
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ..
16న అధికారికంగా ప్రకటన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక దాదాపు ఖరారైంది. స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ రోజు బొత్స సత్యనారాయణ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
పూర్తయిన నామినేషన్ల పరిశీలన
బుధవారం ఉదయం నామినేషన్ల పరిశీలన జరిగింది. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కె.మయూర్ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బొత్స సత్యనారాయణ ఎన్నికల ఏజెంట్ మణికంఠ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది.
అభ్యర్థికి ప్రతిపాదన చేసిన ఓటర్లు, ఇతర పత్రాలను క్షుణంగా పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత 2 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్టు ఆర్వో మయూర్ అశోక్ ప్రకటించారు. ఆ తర్వాత షఫీ ఉల్లా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు ఆర్వో మయూర్ అశోక్కు లేఖ అందజేశారు.
పోటీకి భయపడ్డ కూటమి
ఓటమి భయంతో కూటమి పోటీ నుంచి తప్పుకుంది. బలం లేకపోయినా పోటీ చేయడానికి చివరి వరకు టీడీపీ ప్రయత్నం చేసింది. పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. దీంతో పోటీకి వెనకడుగు వేశారు.