సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ర్యాంకుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా ఇవాళ విడుదలవుతాయని ప్రచారం జరిగినా.. ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.
ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జులై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. విడుదలయ్యే దాకా గ్యారెంటీ కనిపించడం లేదు.


