సీఎం జగన్‌పై రాయితో దాడి: కంటికి గాయం | Attack On CM YS Jagan With Stone | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై రాయితో దాడి: కంటికి గాయం

Apr 13 2024 9:18 PM | Updated on Apr 15 2024 4:39 PM

Attack On CM YS Jagan With Stone - Sakshi

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.  అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. 

సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్‌  పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. 

వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు సీఎం జగన్‌. విజయవాడలో సీఎం జగన్‌ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్‌ బస్సుయాత్ర అప్రతిహతంగా భారీ రోడ్‌ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.



వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్‌ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్‌ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్‌ భారతీ ఉన్నారు. 

గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్‌ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

సీఎం జగన్ పై దాడి ఘటనపై పోలీసు శాఖ సీరియస్
ప్రత్యేక బృందాల ఏర్పాటు, క్యాట్ బాల్ వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడే ఈ దాడి చేయించి ఉంటాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై దాడిని ఖండించిన తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్,నారా లోకేష్ లకు చెప్పులతో కొట్టి ఫ్లెక్సీని కాల్చి వేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి,పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.నీచమైన చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement