సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. విశాఖలోని జబ్బర్తోటలో మత్స్యకార కుటుంబాలను ఆయన ఇవాళ(మంగళవారం) పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్కు తమ కష్టాన్ని మత్స్యకారులు చెప్పుకున్నారు.. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. కేవలం పది మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది. జులైన 4న చిన్నా ఫోన్చేసి ఇంటికొస్తున్నామని చెప్పాడు. దురదృష్ణవశాత్తు పోన్ చేసిన కాసేపటికే బోటు ప్రమాదం జరిగింది. ఫిషరీస్ అధికారులు కూడా స్పందించలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోటు ప్రమాదం జరిగిందని అధికారులకు మెసేజ్ చేశారు. రాత్రి 10:30కి కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు. వెంటనే కోస్ట్గార్డ్ వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు. ఈనెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారు. తప్పుడు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు. త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీష్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా?. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. ఎక్స్ గ్రేషియా కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పన ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఏడుగురు మత్స్యకారులకు కుటుంబాలకు పరిహారం అందాలి.

మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం. గతంలో మా ప్రభుత్వంలో మత్స్యకారులకు భరోసా ఉండేది. 2018 పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాట నెరవేర్చాం. పాక్లో చిక్కుకున్న మత్స్యకారులను సేఫ్గా తీసుకొచ్చాం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో 6 ఫిష్ ల్యాండ్పనులు కూడా చేపట్టాం. ఈ రోజు ఫిషింగ్ హార్బర్లను స్కామ్లతో అమ్మేస్తున్నారు. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బుక్స్, యూనిఫాంలు లేవు. రాష్ట్రంలో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రజలతో బాబు చెలగాటమాడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


