తిరుపతి: తిరుపతి నగర శివారులో పట్టపగలే ఓ మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ముత్యాలరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ కార్యాలయాని సమీపంలోనే ఈ ఘటన జరగింది. ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ కథనం మేరకు.. వైకుంఠపురం ఆర్చి సమీపంలో హిమబిందు (38) అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మహమ్మద్ షరీఫ్ ప్రస్తుతం ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో హిమబిందు ఆటోలో వైకుంఠపురం నుంచి జీవకోనకు వెళుతుంగా, చెర్లోపల్లెకు చెందిన ఆకాష్ కారులో వచ్చి ఎంపీడీవో కార్యాలయం వద్ద అడ్డగించి కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
తప్పించుకునేందుకు ఆమె రెండు చేతులను అడ్డుగా పెట్టుకోవడంతో వేళ్లతోపాటు మెడ, వీపుపై తీవ్రమైన గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన హిమబిందు ఆటో నుంచి దిగి సమీపంలోని హోటల్లోకి పరుగెత్తింది. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు ఆకాష్ తన కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు హిమబిందును తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో హిమబిందు, ఆకాష్కు సుమారు ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆకాష్ కు హిమబిందు వివిధ దఫాల్లో మొత్తం రూ.46 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది.
కొంతకాలంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె కోరుతుండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హిమబిందును హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదనే దురాలోచనతోనే ఆకాష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రుయాలో చికిత్స పొందుతున్న హిమబిందును సీఐ నరేష్ విచారించి వివరాలు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి, పరారీలోని నిందితుడు ఆకాష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


