తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, జూలై 15వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లింది. ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.


