రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత | Around 41 students fell ill with suspected food poisoning in Polavaram district | Sakshi
Sakshi News home page

రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత

Jul 26 2026 2:17 AM | Updated on Jul 26 2026 2:17 AM

Around 41 students fell ill with suspected food poisoning in Polavaram district

అనకాపల్లి జిల్లా కోటవురట్లలో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను నేలపైనే పడుకోబెట్టిన దృశ్యం

మధ్యాహ్నం వండిన పప్పు, కూరలే రాత్రికి కూడా వడ్డించిన సిబ్బంది 

పోలవరం జిల్లా సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్లో 41 మందికి అస్వస్థత 

అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మందికి అస్వస్థత 

తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు బాలికలు 

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విలవిల్లాడిన విద్యార్థినులు  

చింతూరు/కోటవురట్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిదర్శనమిది. గతంలో పలు కేజీబీవీల్లో, ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైనా, వాటి నిర్వహణలో లోపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం జరిగిన పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ సందర్భంగా మధ్యాహ్నం వండిన పప్పు, కూరలనే రాత్రికి కూడా పిల్లలకు పెట్టడంతో పాచిపోయిన ఆ ఆహారం తిని రెండు పాఠశాలల్లో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

పోలవరం జిల్లా వీఆర్‌ పురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 41 మంది, అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

సోములగూడెంలో పాచిపోయిన పప్పు 
సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ సమావేశం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వండిన పప్పు మిగిలిపోవడంతో విద్యార్థినులకు రాత్రి కూడా దానినే వడ్డించినట్లు తెలిసింది. మధ్యాహ్నం మిగిలిన పప్పుతో పాటు బంగాళదుంప కూర తిన్నామని, అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పి ప్రారంభం కావడంతో మాత్రలు వేసుకున్నామని విద్యార్థినులు చెప్పారు.

శనివారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు అధికం కావడంతో చింతూరు సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నా­రు. చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్‌ బాధిత విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం మిగిలిన పప్పును రాత్రి కూడా పెట్టారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థా­యి­లో విచారణ జరిపి బాధ్యులపై చర్య­లు తీసుకుంటామని నొఖ్వాల్‌ చెప్పారు. 

కోటవురట్లలో పాడైపోయిన కూరలు 
కోటవురట్ల కేజీబీవీలో శుక్రవారం జరిగిన పేరెంట్‌–టీచర్స్‌ మీటింగ్‌కు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వంకాయ, బంగాళాదుంప కూరలను పెట్టారు. మిగిలిపోయిన కూరలను రాత్రికి కూడా విద్యార్థినులకు పెట్టారు. శనివారం ఉదయం కిచిడీ తిన్న కొద్ది సేపటికే 30 మంది విద్యార్థినులు విరేచనాలు, వాంతులతో విలవిల్లాడిపోయారు. వీరిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి కేజీబీవీకి చేరుకుని చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బొట్టా సత్యవతి, గాలి జయలక్షి్మ, గుడివాడ విజయలక్ష్మి, గెడ్డం పూజిత, గజ్జి జాహ్నవిలను కోటవురట్ల సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 25 మందికి కేజీబీవీలోనే  పీహెచ్‌సీ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కేజీబీవీకి పరుగు పరుగున వచ్చారు. పాచిపోయిన ఆహారం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో కొన్ని..
2026 ఫిబ్రవరి 7 :  పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని ఇడ్లీలు, చాలా రోజులుగా నిల్వ ఉన్న శనగ పిండితో చేసిన బొంబాయి చట్నీ తినడం వల్ల ఆస్పత్రిపాలయ్యారు. 
 2026 ఏప్రిల్‌ 1 : అన్నమయ్య జిల్లా పుంగనూరులోని మున్సిపల్‌ పాఠశాలలో బల్లి పడిన భోజనం తిని ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.  

 2026 ఏప్రిల్‌ 21 : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. 
  2026 జూలై 8 :  కడపలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌లో 30 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దోశలు, చట్నీ తిన్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement