breaking news
ashram school students
-
రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత
చింతూరు/కోటవురట్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిదర్శనమిది. గతంలో పలు కేజీబీవీల్లో, ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైనా, వాటి నిర్వహణలో లోపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా మధ్యాహ్నం వండిన పప్పు, కూరలనే రాత్రికి కూడా పిల్లలకు పెట్టడంతో పాచిపోయిన ఆ ఆహారం తిని రెండు పాఠశాలల్లో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.పోలవరం జిల్లా వీఆర్ పురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 41 మంది, అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోములగూడెంలో పాచిపోయిన పప్పు సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వండిన పప్పు మిగిలిపోవడంతో విద్యార్థినులకు రాత్రి కూడా దానినే వడ్డించినట్లు తెలిసింది. మధ్యాహ్నం మిగిలిన పప్పుతో పాటు బంగాళదుంప కూర తిన్నామని, అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పి ప్రారంభం కావడంతో మాత్రలు వేసుకున్నామని విద్యార్థినులు చెప్పారు.శనివారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు అధికం కావడంతో చింతూరు సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ బాధిత విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం మిగిలిన పప్పును రాత్రి కూడా పెట్టారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నొఖ్వాల్ చెప్పారు. కోటవురట్లలో పాడైపోయిన కూరలు కోటవురట్ల కేజీబీవీలో శుక్రవారం జరిగిన పేరెంట్–టీచర్స్ మీటింగ్కు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వంకాయ, బంగాళాదుంప కూరలను పెట్టారు. మిగిలిపోయిన కూరలను రాత్రికి కూడా విద్యార్థినులకు పెట్టారు. శనివారం ఉదయం కిచిడీ తిన్న కొద్ది సేపటికే 30 మంది విద్యార్థినులు విరేచనాలు, వాంతులతో విలవిల్లాడిపోయారు. వీరిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి కేజీబీవీకి చేరుకుని చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బొట్టా సత్యవతి, గాలి జయలక్షి్మ, గుడివాడ విజయలక్ష్మి, గెడ్డం పూజిత, గజ్జి జాహ్నవిలను కోటవురట్ల సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 25 మందికి కేజీబీవీలోనే పీహెచ్సీ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కేజీబీవీకి పరుగు పరుగున వచ్చారు. పాచిపోయిన ఆహారం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కొన్ని..⇒ 2026 ఫిబ్రవరి 7 : పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని ఇడ్లీలు, చాలా రోజులుగా నిల్వ ఉన్న శనగ పిండితో చేసిన బొంబాయి చట్నీ తినడం వల్ల ఆస్పత్రిపాలయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 1 : అన్నమయ్య జిల్లా పుంగనూరులోని మున్సిపల్ పాఠశాలలో బల్లి పడిన భోజనం తిని ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 21 : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ⇒ 2026 జూలై 8 : కడపలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ లేడీస్ హాస్టల్లో 30 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దోశలు, చట్నీ తిన్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. -
చంద్రన్న హైటెక్ వైద్యం!
-
మనసుందా మీకసలు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పై ఫొటో చూడగానే మీకేమనిపిస్తోంది.. ఆడపిల్లలెవరో సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టుకుని కూర్చున్నారనిపిస్తోంది కదూ.. అచేతనంగా చూస్తే కళ్లు చెమర్చుతాయి. కోపంతో నిండిన ఆవేశం ఈ ప్రభుత్వంపైన, పాలకులపైన తన్నుకొస్తుంది. సాలూరు మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు 14 మంది సోమవారం రాత్రి కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని సాలూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. పశువులను దొడ్డిలో వరుసగా కట్టేసి గడ్డి పడేసినట్లుగా విద్యార్థినులను వరుసగా కూర్చోబెట్టి సిలైన్లు ఎక్కించారు. కొందరికైతే సిలైన్ సూదిని నేరుగా చేతిలో గుచ్చేశారు. ఓ వైపు వాంతులతో, ఒంట్లో శక్తి నశించి నీరసించిన ఆడపిల్లలు సిలైన్ తమ శరీరంలోకి ఎక్కుతున్నంత సేపూ బాధను మౌనంగా భరిస్తూ కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరికైనా మనం నవ సమాజంలోనే ఉన్నామా.. లేక ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతుంది. హైటెక్ బాబుగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు పాలనలోఇదేనా హైటెక్ వైద్యమంటూ నెటిజన్లు ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో పోస్టింగ్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ఆశ్రమ పాఠశాలలో వసతులు లేవు. అనారోగ్యమొస్తే ఒకే గదిలో, ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరిగినా... ఓ వైపు బాలికలు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుంటే.. మన పాలకుల్లో, అధికారుల్లో చలనం లేదు. ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ జరగలేదని సాక్షాత్తూ సాంఘిక, సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనంద్బాబు స్వయంగా బుకాయింపు ప్రకటన విడుదల చేశారు. ఒక విద్యార్థిని జ్వరంతో, కొద్ది మంది విద్యార్థినులు తగినంతగా నీరు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ లక్ష్మీషాతో పాటు ఇతర అధికారులు మంత్రికి ఫోన్లో చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పించిందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మన జిల్లాకు చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా అధికారులతో మాట్లాడి ఇదేవిధంగా ఒకరికొకరు సర్దిచెప్పుకుని అసలు జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని, జ్వరాల మరణాలసలే లేవని, తామంతా ఎందో బాగా పనిచేసేస్తున్నామని జబ్బులు చరుచుకున్నారు. ఇదంతా గమనిస్తున్న జనం ‘‘వీళ్లా మన పాలకులు.. వీళ్లకసలు మనసుందా..మనుషులేనా’’ అంటూ ఛీ కొడుతున్నారు. -
విద్యార్థినుల 'మిస్టరీ' హత్య కేసు సీఐడీకి
- డీఎస్పీ బాలు జాదవ్కు దర్యాప్తు బాధ్యతలు నర్సంపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇంకా మిస్టరీగానే ఉండిపోయిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల హత్యకేసు దర్యాప్తు సీబీసీఐడీ విభాగానికి బదిలీ అయింది. రెండు నెలలు కావస్తున్నప్పటికీ నిందితులను వెదికిపట్టుకోవడంలో జిల్లా పోలీసులు విఫలం కావడంతో సీఐడీ దర్యాప్తు అనివార్యమైంది. చనిపోయిన బాలికల తల్లిదండ్రులు 20 రోజుల కిందట డీజీపీ అనురాగ్శర్మను కలసి దర్యాప్తును వేగవంతం చేయాలని వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్కు అప్పగించారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు జారీ అయ్యాయని, మేడారం జాతర బందోబస్తులో ఉండడం వల్ల బాధ్యతలు తీసుకోలేకపోయానని, అతి త్వరలోనే కేసును టేకప్ చేస్తానని డీఎస్సీ జాదవ్ 'సాక్షి'కి తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న భానోత్ భూమిక, భానోత్ ప్రియూంకలను గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా చంపి, పూడ్చిపెట్టిన ఉదంతం గత ఏడాది డిసెంబర్ 27న వెలుగులోకి వచ్చింది. చెన్నారావుపేట వుండలం ఖాదర్పేట గుట్ట వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సవాల్గా నిలిచిన ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.


