టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం | All Prepared For Evaluation Of AP 10th Class Exam Answer Sheets, Details Inside - Sakshi
Sakshi News home page

AP 10th Class Exam Evaluation: టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం

Mar 30 2024 2:19 AM | Updated on Mar 30 2024 5:44 PM

All prepared for TENTH evaluation - Sakshi

7.25 లక్షల మంది పరీక్షలకు హాజరు

50 లక్షల జవాబు పత్రాల వ్యాల్యూయేషన్‌కు ఏర్పాట్లు

25 వేల మంది సిబ్బందికి విధుల కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి

విశాఖ విద్య:   పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద్‌ రెడ్డి  తెలిపారు. విశాఖలోని జూబ్లీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.

ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

గతంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లో మూల్యాంకనం జరిగేది కాదని, ఈసారి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మే మొదటి వారానికి అంతా పూర్తి చేసి, ఎన్నికల కమిషన్‌ అనుమతితో, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు.   

స్పాట్‌ కేంద్రాల్లో సకల సౌకర్యాలు
మూల్యాంకనం కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని దేవానంద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో గతంలో నిర్వహించిన చోట సరైన సౌకర్యాలు లేవని గుర్తించి, ఈసారి వాటిని అనువైన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేషన్‌తో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. 

రీ వెరిఫికేషన్‌కు ఆన్‌లైన్‌ విధానం
మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా­రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చా­మన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌ లింక్‌ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాం­కనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement