ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్లో 81, గణితంలో 86, సైన్స్లో 97, సోషల్లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది.