
మహాప్రసాదం నిత్యాన్నదానం
సింహగిరిపై నిత్యాన్నదాన పథకంలో సింహాచలం దేవస్థానం అందించే అన్నప్రసాదాన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదం స్వీకరించే తిరుగుపయనం అవ్వాలని చాలా మంది భక్తులు తపిస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన అప్పన్న నిత్యాన్నదాన పథకం అమల్లోకి వచ్చి నేటి(ఆగస్టు 14)తో 36 వసంతాలు పూర్తిచేసుకుని 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డిస్తున్న సిబ్బంది
నేటితో
36 వసంతాలు
పూర్తిచేసుకున్న సింహాచల దేవస్థానం నిత్యాన్నదాన పథకం
సింహాచలం:
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు రోజూ దేశ విదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారు. వీరిలో ఒడిశా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులే ఎక్కువ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించాలని 1989 ఆగస్టు 14న నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులే ఈ పథకానికి రూ.50 వేలు తొలి విరాళం అందించారు. అప్పటి నుంచి ఈ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
రూ.38 కోట్లకు పైగా విరాళాలు
2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి నిత్యాన్నదాన డిపాజిట్లు 36 కోట్ల 45 లక్షల 41 వేల 720 రూపాయలకు చేరుకున్నాయంటే అది భక్తులకు సింహాచలేశుడిపై ఉన్న అచంచల విశ్వాసమే..! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ విరాళాలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యం దేవస్థానం అన్నప్రసాదం అందిస్తోంది.
దాతలకు ప్రత్యేక ప్రాధాన్యత
నిత్యాన్నదాన పథకానికి విరాళాలందించే దాతలకు ప్రత్యేక గుర్తింపు ఉటుంది. రూ.10,116 ఆపై విరాళం అందించే దాతలకు దేవస్థానం బాండ్లు అందిస్తుంది. ఆ రోజు పరిస్థితి ఆధారంగా స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దీంతోపాటు ఏడాదిలో వారు కోరుకున్న రోజున వారి పేరు మీద భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ వివరాలను ఆ రోజు అన్నప్రసాద భవనం బోర్డులో పేర్కొంటారు.
రూ.10,116 లోపు వచ్చే విరాళాలను స్వల్ప విరాళాలుగా పరిగణిస్తారు. వాటిని ప్రోవిజన్స్, ఇతర ఖర్చులకు వెచ్చిస్తారు.
రోజువారీ అన్నప్రసాదం
సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంలో రోజూ ఉదయం 11.30కు వడ్డన ప్రారంభమవుతుంది. సోమ నుంచి శుక్రవారం వరకు రోజూ 2 వేలు నుంచి 3,500 మందికి, శనివారాలు 5–7 వేలు, ఆదివారం రోజుల్లో 4–6 వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తారు. రోజూ రాత్రి పూట 200–500 మంది భక్తులకు కదంబం(ముక్కల పులుసు అన్నం) అందిస్తారు.
మార్చి 31
నాటికి రూ.36.45 కోట్లకు చేరిన డిపాజిట్లు
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్లు
రుచి చాలా బాగుంది
శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం బాగా జరిగింది. కుటుంబ సభ్యుల కోరికతో తొలిసారి అన్నప్రసాదం స్వీకరించా. రుచి బాగుంది. సాంబారు ఎంతో నచ్చింది. అన్నప్రసాదం రుచి ఎలా ఉందో భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం బాగుంది.
– ఆర్.రావు, భిలాయ్
మహా ప్రసాదంగా భావిస్తా..
సింహాచలేశుడి దర్శనానికి తరచూ వస్తుంటాను. అన్నదాన భవనంలో భోజనం తప్పకుండా చేస్తాను. మహాప్రసాదంగా అనుకుంటాం. దాతల సహకారంతో సింహాచలం దేవస్థానం చేస్తున్న అన్నదానం ఎంతో గొప్ప కార్యక్రమంగా భావిస్తాను.
– మణి, విజయనగరం
భక్తులకు నాణ్యమైన భోజనం
అన్నప్రసాదాన్ని భక్తులకు రుచిగా అందించేందుకు ఎప్పటికప్పుడు నాణ్యత పరిశీలిస్తాం. దీనిపై అధికారులకు ప్రత్యేక సూచనలిస్తాం. ఆఖరి పంక్తి వరకు భక్తులందరికీ ఒకే రకమైన నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. దాతల ప్రోత్సాహం చాలా ఎక్కువ.
– వి.త్రినాథరావు, ఈవొ, సింహాచలం దేవస్థానం

మహాప్రసాదం నిత్యాన్నదానం

మహాప్రసాదం నిత్యాన్నదానం

మహాప్రసాదం నిత్యాన్నదానం

మహాప్రసాదం నిత్యాన్నదానం

మహాప్రసాదం నిత్యాన్నదానం