
రాయితీ రుణాలు ఎప్పుడిస్తారో...!
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఎదురుచూపులు
ఇంటర్వ్యూలు పూర్తయి 4 నెలలైనా మంజూరు కాని వైనం
బ్యాంక్లకు చేరిన లబ్ధిదారుల జాబితా..?.
కూటమి నేతల సిఫారసులు ఉన్నవారికేనా..?
దరఖాస్తుదారుల్లో అయోమయం
కె.కోటపాడు : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మంజూరు చేస్తామని ప్రకటించిన బీసీ కార్పొరేషన్ రుణాలకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ రుణంతో యూనిట్ ఏర్పాటుతో ఆర్థిక భరోసాను పొందవచ్చునని ఆశపడ్డ లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలు ఎప్పుడు మంజూరవుతాయో తెలియక అయోమయంలో ఉన్నారు. 2024–25 ఏడాదికి బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఈ ఏడాది మార్చి 10 నుండి 25 మార్చి వరకూ ఆన్లైన్లో దర్ఖాస్తులు స్వీకరించారు. వీరికి ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక జాబితాను బ్యాంక్ అధికారులకు మండల పరిషత్ అధికారులు పంపించారు. దీంతో దరఖాస్తుదారులు బ్యాంకులను సంప్రదిస్తే యూనిట్ మంజూరు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ నగదు ఇంకా విడుదల కాలేదని సంబంధిత బ్యాంక్ అధికారులు తెలుపుతున్నట్టు సమాచారం. దీంతో అసలు బీసీ కార్పొరేషణ్ రుణాలు ఈ ఏడాది మంజూరవుతాయా అన్నా అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
కూటమి నేతల సిఫార్సులకే పెద్ద పీట..?
కె.కోటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏప్రిల్లో ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు జరిపారు. వాస్తవానికి బ్యాంకులు దరఖాస్తుదారుల్లో బ్యాంక్కు రుణాలను సకాలంలో చెల్లించే పరిస్థితి గల వారిని, అర్హులను గుర్తించి మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ మండలంలో బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి రుణాలు మంజూరు చేయాలో కూటమి నాయకులు అధికారులతో జాబితాలను సిద్ధం చేసి బ్యాంకులకు చేరవేసినట్టు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో కూటమి నాయకుల పెత్తనం ఉన్నట్టు తెలియడంతో దరఖాస్తులు చేసిన 645 మందిలో కేవలం 528 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. గ్రామాల్లో గల కూటమి నాయకుల సిఫారసులకే అధికారుల పెద్దపీటను వేయనున్న కారణంగానే వీరు గైర్హాజరయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఈ కార్పొరేషణ్ రుణాల మంజూరు సమయంలో జన్మభూమి కమిటీలదే పెత్తనం ఉండేది. కాగా ఇప్పటికే బ్యాంకులకు వచ్చిన జాబితాలో లబ్ధిదారులకూ ఇంకా రాయితీ రుణాలు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు.
నమ్మకం లేదు...
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను. బ్యాంక్కు వెళ్లి నా పేరు వచ్చిందో లేదో అని ఆరా తీయగా, ఎంపీడీవో కార్యాలయ అధికారులు లబ్ధిదారుల పేర్లు పంపించాలని చెబుతున్నారు. రాజకీయ సిఫారసుల ఉన్న వారికే రుణాలు అందిస్తే నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది. బ్యాంక్లకు వచ్చిన పేర్లు గల వారికి కూడా రుణాలు ఇంకా మంజూరు కాలేదు.
–ఎల్.నర్సింగరావు, బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారు

రాయితీ రుణాలు ఎప్పుడిస్తారో...!