● దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సాక్షి, పాడేరు: గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి పాంగి దుర్గపై పదో తరగతి విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. దుర్గా మెడపై తీవ్ర గాయమైంది. గాయపడిన దుర్గాను ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ఎదురుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. మెడపై గాయం తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం దుర్గాను నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై కత్తితో దాడి ఘటనపై స్పందించిన ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి జర్రెల ఆశ్రమ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఉపాధ్యాయులు గూడెంకొత్తవీధి పోలీసులకు సమాచారం అందించారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు.


