పాడేరు: విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతులను యథావిధిగా కొనసాగించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులను వెనక్కి పంపే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు చేపడుతున్న రిలే దీక్షలను మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నామనే కారణంతో పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతుల విద్యార్థులను అర్ధంతరంగా వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. గిరిజన విద్యార్థులను ప్రాథమిక విద్యకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మారికవలసలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను వెళ్లిపోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా హక్కును జిల్లా ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు. విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించాలని జారీ చేసిన జీఓ నంబర్ 69ను తక్షణమే ఉపసంహరించుకుని, వారిని అదే పాఠశాలలో యథావిధిగా కొనసాగిస్తూ మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూల్ నివాస్ సంఘం రాష్ట్ర నాయకులు కేవై కుమార్, విద్యా కమిటీ చైర్మన్ రాజేష్, నాయకులు రాజేష్, భారతీ, త్రినాథ్, వి.రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స


