కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. కిండంగి పంచాయతీ కార్యాలయం ఆవరణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా బుధవారం మహిళలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్,డిజిటల్ చెల్లింపులు,బీమా,పెన్షన్లు తదితర ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో 29 బ్యాంకుల శాఖలు, 21 ఏటీఎంలున్నాయని, 2,643 మంది బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో 13వేల మంది రైతులకు వ్యవసాయ రుణాలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కిండంగి,అడ్డుమండ,సంగోడి గ్రామాలు 100 శాతం డిజిటల్,ఆర్థిక సంతృప్తి గ్రామాలుగా ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ ఎస్.రత్నకుమారి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ మాధురి,ఎల్డీఎం మాతునాయుడు,అదనపు ఎంపీడీవో రమేష్,తహసీల్దార్ శ్రీనివాసరావు,సీఎఫ్ఐ కో ఆర్డినేటర్ బాలకృష్ణ,పలుశాఖల యూబీఐ మేనేజర్లు భానుశేఖర్,నారాయణరావు,మాజీ ఎంపీపీ బి.విజయరాణి పాల్గొన్నారు.
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
సాక్షి,పాడేరు: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ టి.నిశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన ప్రచార పోస్టర్లను జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. డీఆర్వో లోకేశ్వరరావు,ఆర్డీవో భుజంగరావు,వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం
తొలివిడతలో జిల్లాకు కేటాయించిన 13 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ టి.నిశాంతి బుధవారం ప్రారంభించారు.రెండవ దశలో మరో 10 వాహనాలు జిల్లాకు వస్తాయని కలెక్టర్ తెలిపారు.


