● తక్షణం అమలు చేయల్సిందే
● పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం డిమాండ్
సాక్షి, పాడేరు: ఎన్నికలకు ముందు అరకు సభలో ఇచ్చిన హామీ మేరకు జీవో నంబరు 3ను పునరుద్ధరించి, ప్రత్యామ్నాయ జీవో ద్వారా గిరిజనులకు వందశాతం ఉద్యోగాలు కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. ఆదివాసీ అరణ్య గర్జనకు మద్దతుగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శుక్రవారం పాడేరులో ర్యాలీ నిర్వహించారు. గిరిజన చట్టాల పరిరక్షణ, వందశాతం ఉద్యోగాల జీవో పునరుద్ధరణ డిమాండ్తో ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వందశాతం ఉద్యోగాల జీవోను అమలు చేసే బాధ్యత సీఎం చంద్రబాబుపైనే ఉందన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
గిరిజనుల పక్షాన పోరాటాలు తప్పవు :
జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర
జీవో నంబరు3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం గిరిజనుల పక్షాన పోరాటాలు తప్పవని ఉమ్మడి ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వందశాతం ఉద్యోగాలు లేకపోవడంతో ఆదివాసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిరుద్యోగ సమస్య అధికమైందని అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
జీవో నంబరు3ను పునరుద్ధరించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిందని ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సీఎం చంద్రబాబు జీవో నెం.3పై ఇచ్చిన హామీని నిలబెట్టుకుని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మాజీ జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, ఎస్టీ సెల్ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు కమ్మిడి అశోక్, సందాడి కొండబాబు, పాడేరు, అరకు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.


