నర్సీపట్నం: వానొస్తే పట్టణం జలమయమవుతోంది. పల్లపు ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునగడంతో మరమ్మతులకు గురువుతున్నాయి. దీంతో నర్సీపట్నం వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నా పరిష్కార మార్గంపై అధికార యంత్రాంగం దృష్టిసారించకపోవడంతో ముంపు తప్పడం లేదు. డ్రైనేజీలు అధ్వానంగా ఉండడంతో మురుగునీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది.
డ్రైనేజీలు రహదారి కంటే ఎత్తుగా ఉన్నాయి. కొన్నిచోట్ల మురుగు కాలువకు, రహదారికి పొంతన లేకుండా ఉంది. డ్రైనేజీలు దాటి రహదారిపైకి వచ్చి దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీల ఆనవాళ్లే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో చిన్నపాటి వాన కురిసినా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. సుమారు 65 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇది 45 కిలో మీటర్లు మాత్రమే డ్రైనేజీలు ఉన్నాయి. ఇంకా 137 కిలో మీటర్ల మేర డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రైనేజీల నిర్మాణానికి రూ.77 కోట్లు అవసరమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు పదేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.
చిన్నపాటి వర్షానికే..
కె.కోటపాడు : చిన్నపాటి వర్షానికే మండలంలోని వారాడ ప్రధాన వీధిలో వర్షం వర్షపునీరు నిలిచిపోతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్రోడ్డు నుంచి రామాలయానికి వెళ్లే మార్గం లోతట్టుగా ఉండడంతో వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


