వేంకటాద్రిపై ధనుర్మాస వైభవం
పెందుర్తి: ‘మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవము పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనా పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమీలేని మావంటివారం మంగళము పాడిననూ ‘పఱ’అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్ర నుంచి లేచి మైకము వదిలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరచి మాటాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము’అంటూ గోదాదేవి సన్నిధిలో 10వ పాశుర పఠనాన్ని అర్చకులు తాత్పర్య సహితంగా విన్నవించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్థానిక వేంకటాద్రి క్షేత్రంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో 10వ రోజు విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని మేల్కొలిపి హారతి ఇచ్చి సేవాకాలం జరిపారు. శాత్తుమురై, తిరుప్పావై పఠనం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ప్రవచనకర్త కలగ మురళీకృష్ణశర్మ ప్రవచనం వినిపించారు. ఈవో నీలిమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజల్లో పాల్గొన్న అశేష భక్త జనానికి ప్రసాద వితరణ చేశారు.
వేంకటాద్రిపై ధనుర్మాస వైభవం


