నేరడిగొండ: తమ హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆదివాసీలు పేర్కొన్నారు. మండలంలోని లఖంపూర్(జి) రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసీల అత్యవసర సమావేశం నిర్వహించారు. 32 గ్రా మాల ఆదివాసీ పటేళ్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఆదివాసీ ఉద్యోగులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల తొమ్మిది తెగల అస్తిత్వ పరిరక్షణ, జాతి మనుగడతో పాటు గ్రామాల పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించి కీలక తీర్మానాలు చేశారు. పీచర జీపీ పరిధిలోని లక్ష్మీపూర్, తిమ్మాపూర్ గ్రామాలను కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తరతరాలుగా అడవిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ఆదివాసీల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన హక్కులను పరిరక్షించేందుకు రాయి సెంటర్ల ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.


