నాగులుప్పలపాడు: ఎల్నినో ప్రభావం వలన ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావారణ శాఖ సూచనల మేరకు రైతులు తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా అమ్మనబ్రోలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్కువ వర్షపాతం నమోదు వలన దీర్ఘకాలిక పంటలు వేస్తే నీటి సమస్య తలెత్తవచ్చని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. అలాగనే ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువులు అందించడనున్నట్లు తెలిపారు. వర్షాలకు ముందుగానే దుక్కి లో నవధాన్యాలు వేయడం వలన వర్షం పడిన వెంటనే అవి మెలకెత్తుతాయని, దీని వలన ఎదిగిన పంట పచ్చిరొట్ట ఎరువుగా దుక్కి దున్నుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.


