శ్రీరాంపూర్: ఏరియాలోని ఎస్ఆర్పీ 3 గని సమీపంలో సింగరేణి స్క్రాప్ను ఎస్అండ్పీసీ విభాగం సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం రాత్రి ఎస్ఆర్పీ 3 గనిలో దొంగలు దూరి స్క్రాప్, విద్యుత్ కేబుల్ చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డు వెంటనే మొబైల్ టాస్క్ఫోర్సుకు సమాచారం అందించారు. వారు గని లోపలికి వచ్చే సరికి దొంగలు జారుకున్నారు. గని పరిసరాల్లో వెతకగా సుమారు 60 మీటర్ల డ్రిల్ కేబుల్ లభ్యమైంది. అనంతరం బంకర్పై ఉన్న ఎస్డీఎల్ యంత్రం కేబుల్ చోరీకి గురైనట్లు గుర్తించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మళ్లీ సోదాలు చేశారు. ఈ క్రమంలో గని మెయిన్ సబ్స్టేషన్ వద్ద ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. దీన్ని వెంబడించి పట్టుకోగా ఆటోలో సుమారు రూ. 60 వేల విలువ చేసే ఐరన్స్క్రాప్, డ్రిల్ మిషన్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ శ్రీధర్ను పట్టుకోగా రమేశ్ అనే దొంగ పరారయ్యాడు. ఆటోతో పాటు డ్రైవర్ను శ్రీరాంపూర్ పోలీసులకు అప్పగించినట్లు సెక్యూరిటీ అధికారులు పేర్కొన్నారు.


