breaking news
Telangana Rising 2047
-
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు,సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ ని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు ‘ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే, సంక్షోభంలో ఉన్న రాష్టాన్ని గాడిన పెట్టాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దాయన ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆయనకు అవకాశం కలి్పంచారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. సాగునీటి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా సంగబండలో బండ పగులకొట్టడానికి రూ.12 కోట్లు ఇవ్వలేదు. మనకు సాగు, తాగునీరు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు..’ అని పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దండుకట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి.. ‘ప్రస్తుతం పాలమూరు ప్రజలు వారి బిడ్డను ఆశీర్వదించి సీఎం చేయడంతో మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల్లో భూములు కోల్పోయిన వారికి సహాయ, పునరావాసాన్ని (ఆర్అండ్ఆర్) నూటికి నూరు శాతం మంజూరు చేసి అమలు చేస్తాం. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీఓ కోసం గొంతెత్తి మాట్లాడినా అప్పట్లో మన బాధను ఎవరూ వినలేదు. ఇప్పడు కూడా కుట్రలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నిస్తే ..కేసులు వేసి ఏడాదిన్నరగా నిలిపి వేయించారు. కానీ మంత్రి శ్రీహరి రైతులతో మాట్లాడి 96 శాతం రైతులను ఒప్పించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కోసం దండుకట్టి. గుంపు కట్టి రెండేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగించండి. రాతింబ్రవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించే వారిని స్పర్పంచ్లుగా ఎన్నుకోవాలి ‘మీరు ఒక్క ఓటు వేస్తే ఇన్ని సమస్యలు తీరాయి. 2023లో ఊరు గెలిచాం. ఇప్పుడు రచ్చ గెలవాలి. ఇంకా పదేళ్లు ఉంటే అన్నీ చేయొచ్చు. ప్రభుత్వం కాళ్ల కింద కట్టె పెట్టే వారిని సర్పంచ్గా చేస్తే ఊరు దెబ్బతింటది. గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఎవరి మాటలో నమ్మి ఓట్లు వేస్తే గోస పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచ్లుగా గెలిపించుకోవాలి. మన సమస్య తెలిసి పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి..’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సభకు ముందు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి వాకిటి భావోద్వేగం సీఎం బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచి్చనా బాధలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్రెడ్డి వచి్చన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. కానీ మీ ప్రవర్తనతో మనసు గాయపడింది..’ అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో ఎప్పుడైనా రెండేళ్లలో రూ.1,000 కోట్లు వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు మరోసారి చేయకండి..’ అని కోరారు. -
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఈ జిల్లాలకు సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ముందుకువెళ్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్ను ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరుతో డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్లో భాగంగా డిసెంబర్ 9న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడానికి భవిష్యత్లో తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతామన్నారు.


