తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కండి.. శ్రీధర్ బాబు | Sridhar Babu comments in Davos | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కండి.. శ్రీధర్ బాబు

Jan 20 2026 6:19 PM | Updated on Jan 20 2026 6:57 PM

Sridhar Babu comments in Davos

సాక్షి హైదరాబాద్:  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి "తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కావాలని  పారిశ్రామికవేత్తలను  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన "ఇండియా పెవిలియన్" ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని పారిశ్రామికవేత్తలను శ్రీధర్ బాబు సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ....భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని.... అందుకు అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఇక్కడి ఎకో సిస్టం వివరాలు మంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల  పెట్టుబడులను సమీకరించిందని మంత్రి తెలిపారు.

2026లో కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఉత్తమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. "తెలంగాణ బ్రాండ్" మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.O, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement