Anna DMK
-
TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్ లేదు: అన్నామలై
చెన్నై:తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల -
అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తన పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. తొలి విడతలో ప్రకటించిన 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారు కావడం గమనార్హం. అలాగే మిత్రపక్షం పుదియ తమిళగం(పీటీ)కి తెన్కాశి (రిజర్వుడ్) సీటును, మరో మిత్రపక్షం ఎస్డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. పెద్ద పార్టీలు కలిసి రాకున్నా, చిన్న పార్టీలతో ఎన్నికలలో తన సత్తా చాట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం చైన్నెలో ఎంజీఆర్ మాళిగైలో ప్రకటించారు. 16 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 14 మంది కొత్త వారు కావడం విశేషం. వీరంతా ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఏ, బీఏ, పీజీ పట్టభద్రలే. ముందుగా మిత్ర పక్షం పుదియ తమిళగం, ఎస్డీపీఐలకు సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, ఎస్డీపీఐ నేత నైల్లె ముబారక్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదరిశ పళణి స్వామి సంతకాలు చేశారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలోని పార్టీల వివరాలను తెలియజేశారు. అలాంటి రాజకీయాలు అవసరం లేదు.. ఎన్నికలలో కూటములు అవసరమని, అయితే కూటములను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని పళణి స్వామి వ్యాఖ్యానించారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్త వారు అని, వీరంతా ప్రజలు మెచ్చిన అభ్యర్థులు అవుతారని అని ధీమా వ్యక్తం చేశారు. మిత్ర పక్షంలోని పుదియ తమిళగంకు తెన్కాశి(రిజర్వుడ్), ఎస్డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించామని ప్రకటించారు. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 5 స్థానాలు కేటాయించామని, గురువారం ఈమేరకు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు. పీఎంకేతో తాము చర్చలు జరపలేదని, త్వరలో తమ ఎన్నికల మేనిఫెస్టో సరికొత్త తరహాలో ప్రజల ముందుకు వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకే సొంత బలంపైనే నిలబడే పార్టీ అని, ఎవరు వచ్చినా రాకున్నా తమ బలం తనకు ఉందన్నారు. 2.06 కోట్ల మంది సభ్యులను కలిగిన అన్నాడీఎంకేకు ప్రజలే తోడు అని, పార్లమెంట్లో 3వ అతి పెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకే రానున్న ఎన్నికలలో తన బలాన్ని చాటుతుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో ఎక్కువగా.. భ్యర్థుల తొలి జాబితాలో జయ వర్దన్ (దక్షిణచైన్నె), చంద్రకాసన్(చిదంబరం) గతంలో ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. జయవర్దన్ అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ వారసుడు. ఇక రాయపురం మనో(ఉత్తర చైన్నె) పార్టీ పరంగా ఓటర్లకు సుపరిచితుడే. మదురై అభ్యర్థి డాకర్ట్ శరవణన్ గతంలో డీఎంకే తరపున తిరుప్పర గుండ్రం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన అన్నాడీఎంకేలో చేరారు. తొలి జాబితాలోని అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయ పేరవైకు చెందిన వారే ఉండడం గమనార్హం. -
TN: అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో బీజేపీ పొత్తు
చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిషృత నేలను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే ఎఎమ్ఎమ్కే చీఫ్ టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో బీజేపీ అగ్రనేతలు సీట్షేరింగ్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతు మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన గతంలో ఏఐడీఎంకే అగ్ర నేతగా వ్యవహరించిన శశికలకు మేనల్లుడు. ఇక పన్నీర్ సెల్వంతో బీజేపీ సీట్షేరింగ్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. మరోపక్క అధికార డీఎంకే, కాంగ్రెస్, కమలహాసన్ పార్టీ, వైకో తదతరులు కలిసి ఇండియా కూటమి గొడుగు కింద లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి అన్నామలై సారథ్యంలోని బీజేపీ గట్టిపోటీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీఎం మోదీ నిర్వహించిన సభలకు కూడా ఇక్కడ మంచి స్పందన రావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల రేసులో బీజేపీ కంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. అమిత్షా ఎంట్రీతో మహాకూటమి పంచాయతీ కొలిక్కి -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
-
మళ్లీ వస్తాను.. అన్ని చక్కదిద్దుతాను: శశికళ
సాక్షి, చెన్నై: తనతో మాట్లాడిన వాళ్లను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ సమన్వయ కమిటీ చేసిన ప్రకటనపై చిన్నమ్మ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అన్నింటినీ చక్కదిద్దుతానని మంగళవారం ఆమె స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమనిగినానంతరం దూకుడు పెంచబోతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకేలో దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత హయాంలో పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నేతలతో ఫోన్లో సంప్రదించారు. కార్యకర్తలతోనూ మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. తాను రావడం ఖాయమని, అన్నాడీఎంకేను కైవసం చేసుకుందామని ధైర్యం చెబుతున్నారు. శశికళ వ్యూహాలకు చెక్పెట్టేందుకు ఆమెతో ఫోన్లో మాట్లాడిన నేతలను అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పార్టీ నుంచి తొలగించింది. గ్రామ పర్యటన మంగళవారం మదురై, తేని జిల్లాల్లోనే అన్నాడీఎంకే నేతలు, పార్టీ అనుబంధ ఎంజీఆర్ యూత్ విభాగం నేతలు పలువురితో చిన్నమ్మ ఫోన్లో మాట్లాడారు. పార్టీని రక్షించుకోవాల్సిన అవశ్యం ఏర్పడిందన్నారు. తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. జయలలిత ఆశయాల దిశగా తన ప్రయాణం ఉంటుందన్నారు. కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. కాగా అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన అధికార ప్రతినిధి పుహలేంది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభావం చూపించలేని బీజేపీ, పీఎంకే వంటి చిన్న పార్టీలకు అన్నాడీఎంకేను తాకట్టు పెట్టారని విమర్శించారు. త్వరలో పళనిస్వామి జైలుకు వెళ్లబోతున్నారని, ఈ మేరకు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. చదవండి: Tamilnadu: శశికళ ఫోన్కాల్ ఆడియో కలకలం -
‘ఆమెతో మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం’
చెన్నై: అసెంబ్లీ డిప్యూటీ లీడర్, అసెంబ్లీ విప్ను ఎన్నుకునే సమావేశంలో ఓ కొత్త తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం.. ఇకపై శశికళతో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తప్పవని తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల శశికళ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయట పడింది. ఆ వీడియోలో.. తాను తొందరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు, తర్వాత అన్నాడీఎంకేపై పార్టీపై పట్టుసాధిస్తానని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో మాట్లాడుతుంది. ఈ ఆడియో విన్న తర్వాత పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శశికళతో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నాడీఎంకే నేతలు తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా శశికళతో మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది. చదవండి: Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
Tamilnadu: శశికళ ఫోన్కాల్ ఆడియో కలకలం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్కాల్ ఆడియో గురువారం వైరల్గా మారింది. అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు. బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎంతో కష్ట పడ్డాను.. దివంగత నేత ఎంజీఆర్ తదుపరి అన్నాడీఎంకే బలోపేతం కోసం అమ్మ జయలలితో కలిసి తాను ఎంతో కష్టపడ్డానని, ఇది ఎవరికీ తెలియని విషయంగా చిన్నమ్మ ఆ ఫోన్కాల్లో పేర్కొన్నారు. అమ్మకు వచ్చే లేఖల్ని చదివి వినిపించడం, వాటికి సమాధానాలు పంపించడం తానే చేయడం జరిగేదని పేర్కొంటూ, ఇప్పుడు కార్యకర్తల నుంచి తనకు వస్తున్న లేఖలు చదివి, చూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఆరోజు కూవత్తూరులోనూ తాను చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయని, అందరం ఏకం అవుదామంటూ చిన్నమ్మ ముగించారు. 14వ తేదీ భేటీలో ఎమ్మెల్యేలకే అనుమతి.. చిన్నమ్మ ఫోన్ కాల్ వ్యవహారాలు ఓ వైపు ఉన్నా, మరోవైపు పార్టీ తమ గుప్పెట్లో నుంచి జారకుండా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కుస్తీలు పట్టే పనిలోపడింది. ఈనెల 14న పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అనుమతి దక్కడంతో గురువారం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులు ఎవ్వరూ రాకూడదని, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత, విప్ను ఎంపిక చేయనున్నారు. చదవండి: దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్ యూపీ కేబినెట్ ప్రక్షాళన! -
ఇక ఇప్పుడు జాతీయ నేతల వంతు..!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 27వ తేదీ నుంచి ఒకరి తర్వాత మరొకరు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అలాగే కన్యాకుమారి లోక్సభ ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెన్నై హార్బర్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న యువజన నేత వినోజ్ బి సెల్వంకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధౌజండ్ లైట్స్ అభ్యర్థి కుష్భుకు మద్దతుగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. 28న ఒకే వేదిక మీదకు... ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనెల 28న మలి విడత ప్రచారానికి సిద్ధం అయ్యారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి హసన్కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సేలంలో భారీ ర్యాలీతో ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సేలం సీలనాయకన్ పట్టిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇంత వరకు డీఎంకే కూటమి నేతలు ఒకే వేదిక మీదకు రాలేదు. ఈ బహిరంగ సభ వేదికగా రాహుల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, మైనారీటీ పార్టీల నేతలు ఖాదర్ మొహిద్దీన్, జవహరుల్లా, తమీమున్ అన్సారీ, వామపక్ష నేతలు బాలకృష్ణన్, ముత్తరసన్లతో పాటుగా డీఎంకే మిత్రపక్షాల నేతలు అందరూ ఒకే చోట కలవనున్నారు. ఉచిత పథకాలతో పేదరికం పోదు: కమల్ వ్యాఖ్య సాక్షి, చెన్నై: ఉచిత పథకాలు అమలు చేసినంతమాత్రాన పేదరికం తొలగే ప్రసక్తి లేదని మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్హాసన్ అన్నారు. బుధవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ.. ఉచితాలు ఇచ్చేస్తున్నారు కదా..? అని ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు తీవ్రసంకటం ఎదుర్కోవడం తథ్యమని హెచ్చరించారు. ఉచిత పథకాల రూపంలో ప్రతి ఒక్కరి నేత్తిన అప్పులభారం పెరగబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ. 65 వేల అప్పు ఉందన్నారు. భవిష్యత్తులో రూ. 2లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఓటు వేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుచ్చిలో సాగిన ప్రచారంలో కమల్పై ఓ మహిళ భారతీయార్చిత్ర పటాన్ని విసరడం కలకలం రేపింది. ఇక కమల్కు మద్దతుగా గురువారం కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో ఎస్ఎంకే నేత శరత్కుమార్ ప్రచారం చేయనున్నారు. -
తమిళ ఎన్నికలు: సర్వేలన్ని ఆ పార్టీకే అనుకూలం
డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే పార్టీ అంతర్మధనంలో పడింది. తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం సిద్ధమయ్యారు. బుధవారం సేలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అర్ధగంట పాటు భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఉచిత పథకాలతో ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్, సీఎం పళనిస్వామి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తున్నా, ఉచిత పథకాల హామీలు ప్రజల్లో ఆసక్తిని కలిగించినా సర్వేలు మాత్రం భిన్నంగా వస్తుండడం ఆ పార్టీని కలవరంలో పడేసింది. వ్యూహాలకు పదును.. ఇప్పటి వరకు వెలువడిన నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై అరగంట పాటు చర్చించారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. అలాగే ప్రచారంలో డీఎంకే హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుటుంబ పాలన, తమిళులకు చేసిన ద్రోహాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత సీఎం జయలలిత విజన్ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు. పన్నీరు ప్రచారం సీఎం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పన్నీరుసెల్వం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కరూర్లో పళని కరూర్లో పోటీ చేస్తున్న ఎంఆర్ విజయ భాస్కర్, అరవకురిచ్చి నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అన్నామలైలకు మద్దతుగా పళనిస్వామి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో విస్తృతంగా పర్యటించారు. డీఎంకే హయాంలో సాగిన కబ్జాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులు, బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరూర్ డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ద్రోహి అని విమర్శించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందు విశ్వప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం వల్లే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల మేరకు నిధులు వచ్చినట్లు వివరించారు. చదవండి: నోరు జారిన పన్నీర్సెల్వం.. అందరూ నవ్వడంతో.. -
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా..
సాక్షి, బెంగుళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్గా మారింది. ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి విధితమే. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది) కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.(చదవండి: మోదీ మన్ కీ బాత్: ఆ ఘటన బాధాకరం) -
అన్నాడీఎంకేలో సామరస్యత
దీర్ఘకాలం రాజకీయరంగాన్ని ప్రభావితం చేసిన దిగ్గజ నాయకులు కనుమరుగైతే... ఆ వెలితిని పూడ్చేవారు కనుచూపు మేరలో కనబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తమిళనాడు చాన్నాళ్లుగా నిరూపిస్తూనే వుంది. రాష్ట్ర రాజకీయాల సంగతలావుంచితే పాలకపక్షంగా వున్న అన్నా డీఎంకేలో ఒకరకమైన అనిశ్చితి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఆ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి, రెండో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీరుసెల్వం నేతృత్వంవహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసివున్న తరుణంలో ఈ అని శ్చితికి ముగింపు పలకాలని ఇరు వర్గాలూ ఒక అంగీకారానికొచ్చాయి. బుధవారం కుదిరిన అవగా హన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం పళనిస్వామే మళ్లీ సీఎం అవు తారు. అలాగే పన్నీరుసెల్వం ఆధ్వర్యంలో పార్టీ సారథ్యబాధ్యతలను చూడటానికి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కోసం పన్నీరుసెల్వం కొంతకాలంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వమూ, పార్టీ తన చెప్పుచేతల్లో వుండాలన్నది పళనిస్వామి నిశ్చితాభిప్రాయం. ఈసారి తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని, అది కుదరకపోతే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని పన్నీరుసెల్వం కోరుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చిన విభేదాలు తీవ్రమై సమస్యలు మొదలయ్యాయి. ఎన్నిక లకు ఇంకా ఆరేడు నెలల వ్యవధి వున్న తరుణంలో ఇద్దరు నేతలూ రాజీపడి ఒక అంగీకారానికి రావడం ఆ పార్టీ శ్రేయస్సుకు మంచిదే. (చదవండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని) ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీకి పెద్ద దిక్కుగా వుంటూ వచ్చిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో చనిపోయాక ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్వితీయ శ్రేణి నాయకుడో, నాయకురాలో లేకపోవడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జయ ఆప్తురాలిగా వున్న వి.కె. శశికళ ఆమె బాటలోనే పన్నీరు సెల్వంను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ మరో రెండు నెలలకు తానే సీఎం కావాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక అదంతా బెడిసికొట్టి పదవి రావడం మాట అటుంచి ఆమెకు అవినీతి కేసులో శిక్షపడింది. ఈలోగా పన్నీరుసెల్వం తన మద్దతుదార్లతో వేరే కుంపటి పెట్టుకున్నారు. చివరకు శశికళ పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. అయితే చాలా త్వరగానే పళనిస్వామి సైతం ఆమె నుంచి దూరం జరిగారు. బీజేపీ నాయకగణం మధ్య వర్తిత్వం ఫలితంగా అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమై అప్పటినుంచీ బండి లాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక్క ఎంజీఆర్ హయాంలో తప్ప ఎప్పుడూ ఒకే పార్టీ వరసగా మూడోసారి అధికారంలోకొచ్చిన దాఖలా లేదు. అలా చూస్తే అన్నాడీఎంకే కోటా అయిపోయినట్టే. ఆ పార్టీ అధికారంలో కొనసాగడం వరసగా ఇది రెండోసారి. ఇప్పుడు నేతలిద్దరి రాజీ ఫలితంగా ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలొచ్చి మూడోసారి సైతం అధికారంలోకొచ్చి చరిత్రను తిరగరాస్తుందా అన్నది ఇంకా చూడాల్సివుంది. పై స్థాయిలో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ సఖ్యత ప్రభావం కింది స్థాయి కేడర్ వరకూ వెళ్తే... పాలన సైతం జనరంజకంగా సాగితే అది అసాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పక్షానికి ఎప్పుడూ కొంత వెసులుబాటు వుంటుంది. ఏయే అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వుందో తెలుసుకుని, వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడానికి... కొత్త విధానాలతో, పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి పాలకపక్షానికే అవకాశం వుంటుంది. పాలనకు సంబంధించి ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా గతంలోవలే కేంద్రంతో పోరాడి దేన్నయినా సాధించే తత్వం ప్రస్తుత పాలకుల్లో కొరవడిందన్న భావన ఏర్పడింది. నీట్ విషయంలో రాష్ట్రం గట్టిగా పోరాడితే బాగుండేదన్న అభిప్రాయం వుంది. నిరుడు చెన్నైలో ఏర్పడిన మంచినీటి కొరత కనీవినీ ఎరుగనిది. దానిపై చివరకు హాలీవుడ్ నటుడు లియనార్డో డి కాప్రియో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు అంతటా నిరుడు జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన దక్షిణాదిలోనే అతి పెద్దది. సహజంగానే ఈ అంశంపై పాలక అన్నాడీఎంకే మాట్లాడలేకపోయింది. అన్నా డీఎంకే సమష్టిగా పోరాడటం ఒక ఎత్తయితే... విపక్షమైన డీఎంకే రూపంలో ఎదురయ్యే సవాలును ఎదుర్కొనడం మరో ఎత్తు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఏర్పాటుచేసి 39 స్థానాలకూ 38 సాధించుకుంది. పొరు గునున్న పాండిచ్చేరిలోని ఒకే ఒక స్థానం సైతం కూటమికొచ్చింది. అసెంబ్లీలోని 22 స్థానాలకు అంతక్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 9 చోట్ల అన్నాడీఎంకే నెగ్గింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోతుందని, తగిన మెజారిటీ లేక పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని భావించిన డీఎంకేకు ఇది షాక్. దాన్నుంచి త్వరలోనే కోలుకుని లోక్సభ ఎన్నికల్లో స్టాలిన్ తన సత్తా చాట గలి గారు. అయితే నిరుడు అక్టోబర్లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పళనిస్వామి పరువు నిలుపుకున్నారు. సినీ నటుడు కమలహాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్సభ ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా తనకంటూ వోటు బ్యాంకు వుందని నిరూ పించుకుంది. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా కళ్లు తెరవలేదు. తమ పార్టీ అసెంబ్లీలోని 234 స్థానాలకూ పోటీ చేస్తుందని మాత్రం ప్రకటించారు. కాగా, శశికళ జైలుశిక్ష పూర్తిచేసుకుని డిసెం బర్లో రాబోతున్నారు. ఆమె ఎత్తుగడలేమిటో చూడాల్సివుంది. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ అయినా అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఏదో ఒకదానితో చెలిమి చేయడం తప్పనిసరి. ఇప్పుడు పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య ఏర్పడిన సామరస్యం ఫలితమేమిటో... కొత్త పార్టీల రాకతో డీఎంకేకు కలిగే లాభనష్టాలేమిటో, జాతీయ పార్టీల భవితవ్యమేమిటో రాగల అసెంబ్లీ ఎన్నికలు తేలుస్తాయి. -
రక్త సంబంధీకులు వారసులు కారా?
సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్గార్డెన్లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆగమేఘాలపై చట్టం ఏంటి? ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. -
‘అమ్మ’ పథకాల అమలుపై ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత 1991, జూన్ 24వ తేదీన మొదటి సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఆ రాష్ట్రానికి రెండో మహిళా ముఖ్యమంత్రి. ఆమెకన్నా ముందు ఆమె రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఓ నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. 1991 నుంచి 2016లో ఆమె చనిపోయే వరకు ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారంటే అందుకు ప్రధాన కారణం ఆమె ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణం. తమిళనాడులో ఆడ శిశు హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో జయలలిత 1992లో ‘క్రేడిల్ బేబీ స్కీమ్’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక కేంద్రాలు, పిల్లల సంరక్షణాలయాల్లో ఊయలలను ఏర్పాటు చేశారు. ఆడ శిశువులు అవసరం లేదనుకున్న తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చి వాటిలో వేసి పోవచ్చు. ఆ తర్వాత ఆ ఆడ శిశువులను అవసరం మున్న దంపతులకు దత్తత ఇచ్చేవారు. లేదంటే ప్రభుత్వ పిల్లల సంరక్షణాలయాల్లో చేర్చేవారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన తర్వాత జయలలిత దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు ఉచితంగా మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్స్ పంపిణీ చేశారు. ఆమె అదే ఏడాది వద్ధులు, వితంతువుల పింఛన్లను పెంచారు. 2013, ఫిబ్రవరి నెలలో ఆమె ‘అమ్మ క్యాంటీన్లు’ స్కీమ్ను ప్రారంభించారు. రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు సాంబార్ అన్నం చొప్పున నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల ఈ క్యాంటీన్లకు అమితమైన ప్రజాదరణ వచ్చింది. 2014లో ‘అమ్మ బేబీ కేర్ కిట్’ అనే స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన పిల్లలకు 16 వస్తువులతో కూడిన వెయ్యి రూపాయల కిట్ ఇచ్చేవారు. వాటిలో సబ్బు, టవల్, నేల్కట్టర్, దోమతెర, ఓ బొమ్మ లాంటివి ఉండేవి. 2015లో అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జయలలిత, రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో 350 తల్లి పిల్లలకు పాలివ్వడానికి అనువైన గదులను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ‘అమ్మ ఆరోగ్య పథకం’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద 30 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ కింద ఉచిత వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. మహిళలకైతే డీ విటమన్ స్థాయి, బోన్ సాంద్రత, పరథ్రాయిడ్ లాంటి ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించేవారు. తమిళనాడులో 1962లో వద్ధాప్య పింఛన్లను ప్రవేశపెట్టారు. 1975లో దాన్ని వితంతువులకు కూడా వర్తింపచేశారు. 2011లో ఆ పింఛన్లను జయలలిత ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. ఆ పింఛన్లను 1500 రూపాయలకు పెంచుతామని 2016 ఎన్నికల ప్రణాళికలో జయలలిత ప్రకటించారు. దాన్ని అమలు చేయకముందే ఆమె మరణించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులైనవారుగానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల జయలలిత ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇది ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి ప్రతికూల అంశం. ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని లోక్సభ స్థానాలతోపాటు రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 234 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 114 మంది సభ్యుల మద్దతు కలిగిన (స్పీకర్ మినహా) పాలకపక్షానికి ఉప ఎన్నికలు కీలకమే! -
డాన్స్తో ఎన్నికల ప్రచారం
తిరువళ్లూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు పూందమల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పూందమల్లి నియోజకవర్గంలోని వదట్టూరు కోయంబాక్కం ఎగువకొండయూర్ ఆరియలూరుతో పాటు పది గ్రామాల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా పూందమల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి పూందమల్లి పట్టణంలోనూ, ఏఎంఎంకే అభ్యర్థి ఏలుమలై ఎల్లాపురం యూనియన్లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ గుమ్మిడిపూండిలోనూ, కాంగ్రెస్ అభ్యర్థి జయకుమార్ తిరువేళాంగాడు యూనియన్లోనూ, ఏఎంఎంకే అభ్యర్థి పొన్రాజా పొన్నేరిలోనూ ప్రచారం నిర్వహించారు. ఇదిలాఉండగా గ్రామీణ ఓటర్లును ఆకట్టుకోవడానికి ఎంజీఆర్తో పాటు ఇతర వేషధారణలో కళాకారులతో నృత్యాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
తలైవా.. ఒక్కసారి రావా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికలు అనగానే భారతీయ జనతా పార్టీకి సూపర్స్టార్ రజనీకాంత్ గుర్తుకొస్తారు. అయితే ఈసారి వారితోపాటూ అన్నాడీఎంకే సైతం తలైవా..రావా అని ఆహ్వానిస్తోంది. మద్దతు లేదా మాట కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం అనగానే అందరికీ జయలలిత కళ్లముందు మెదులుతారు. అమ్మ కన్నుమూసిన తరువాత అన్నాడీఎంకే తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణం ఆ ప్రతిష్ట నిలబడాలంటే లోక్సభ, ఉపఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలువకతప్పదు. ఎన్నికల ప్రచార నిమిత్తం పార్టీ ప్రధాన రథసారథులు ఎడపాడి పళినిస్వామి, పన్నీర్సెల్వం చెరోవైపు రాష్ట్రాన్ని చుడుతున్నారు. అయితే ప్రచార రథంలో జయలలిత లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని చరిష్మా కలిగిన నేత అన్నాడీఎంకేలో కరువయ్యారు. అయితే పార్టీకీ, ప్రభుత్వానికి పూర్వవైభవం కరువైన తరుణంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని దీటుగా ఎదుర్కొనాలంటే ఆదనపు ఆకర్షణ తప్పదనే విషయం అన్నాడీఎంకే అదనపు బలం తప్పదని అన్నాడీఎంకేకు మొదట్లోనే అర్థమైంది. అందుకే బీజేపీ, ఎండీఎంకే, పీఎంకే, పుదియ తమిళగం, తమాకా, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. కూటమికి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్లపై తమ పార్టీ అభ్యర్థులనే కాదు, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పడింది. అడపాదడపా మిత్రపక్ష పార్టీల కోసం ఎడపాడి, ఓపీఎస్ సైతం గళం విప్పుతున్నారు. పీఎంకే తరపున రాందాస్, డీఎండీకే అభ్యర్థుల కోసం ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ తమకు కేటాయించిన స్థానాలకే పరిమితమై ఎవరికి వారుగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్షాల పర్యటన ఇంకా ఖరారు కాలేదు. అమ్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుండగా ఎన్నికలను సునాయాసంగా అధిగమిస్తామనే నమ్మకం అన్నాడీఎంకేలో లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడం ఖాయమనే భయం అన్నాడీఎంకే నేతల్లో పట్టుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను ప్రభావితం చేయగల జనాకర్షక నేత ఎవరబ్బా అని ఆలోచనలో పడిన నేతలకు సూపర్స్టార్ రజనీకాంత్ స్పురించారు. బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదా ‘వాయిస్’ ఇవ్వడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడానికో రజనీని ఒప్పించాలని పట్టుదలతో ఇక ఆలస్యం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటి నుంచి స్నేహపూరిత సత్సంబంధాలను నెరపుతున్న బీజేపీ నేతలు ముందుగా రజనీతో చర్చలు ప్రారంభించింది. అలాగే అన్నాడీఎంకే తరఫున రజనీ స్నేహితులైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత కల్పించే పార్టీలకు ఓటు వేయాల్సిందిగా అభిమానులకు రజనీకాంత్ గతంలో సూచించారు. ఆ నినాదానికి అనుగుణంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో నదుల అనుసంధానం అంశాన్ని చేర్చింది. కొన్నిరోజుల తరువాత అన్నాడీఎంకే విడుదల చేసిన అదనపు మేనిఫెస్టోలో కావేరీ–గోదావరి అనుసంధానంపై వెంటనే ప్రయత్నాలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. రజనీ ఆశయాలకు అనుగుణంగా అన్నాడీఎంకే మేనిఫెస్టో ఉన్న అంశాలను అవకాశంగా చేసుకుని మద్దతు లేదా కనీసం వాయిస్ అయినా రజనీకాంత్ నుంచి రాబట్టాలని ఆశిస్తున్నారు. పార్టీ పక్షాన నేరుగా నిలవకున్నా..మేనిఫెస్టోలో నదుల అనుసం«ధానాన్ని స్వాగతిస్తున్నా, ప్రధాని మోదీ గురించి రెండు మంచి మాటలు చెబితే చాలు ఇక మేము చూసుకుంటామనే రీతిలో అన్నాడీఎంకే ఆశిస్తోంది. వచ్చేనెల 10వ తేదీన రజనీకాంత్ కొత్త చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది. అన్నాడీఎంకే కూటమి కోసం ఆయన ‘మాట’ సాయం చేయదలిస్తే ఈలోగానే చేయాలి. కొట్టంగా కొట్టంగా కొండరాయి కూడా కొంచెం జరుగుతుందనే తీరులో కోరంగా కోరంగా రజనీలో మార్పువస్తుందని ఆశపడుతున్నారు. రజనీకాంత్ మద్దతు కోసం కమల్హాసన్ బహిరంగంగానే ప్రయత్నించి భంగపడ్డారు. మరి అన్నాడీఎంకే ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్కే ఉన్నాయన్నారు. కళైరాజన్ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
నీట్ రద్దు.. రాజీవ్ హంతకుల విడుదల!
చెన్నై: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం తమిళనాడులో ప్రధాన పార్టీలైన అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలు మంగళవారం మేనిఫెస్టోలు విడుదల చేశాయి. రెండు వైరి పార్టీల మేనిఫెస్టోల్లోనూ పలు ఉమ్మడి అంశాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష అయిన ‘నీట్’ను రద్దుచేసేందుకు కృషిచేస్తామని, అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తామని ప్రకటించాయి. తమిళనాడులోని మొత్తం 39 సీట్లలో, పుదుచ్చేరిలోని ఒక లోకసభ స్థానానికి ఏప్రిల్ 18న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకే హామీలు ►జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్పీఈఐ) పేరును ‘అమ్మా జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్పీఈఐ)’గా పేదలు, వితంతువులు తదితరులకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తాం ►మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తాం ►జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష రద్దు ►శ్రీలంకలో తమిళుల ఊచకోత అంశాన్ని ది హేగ్లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్లేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►విద్యార్థుల విద్యా రుణాల మాఫీతో పాటు చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి ►దేశంలో తమిళాన్ని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించేలా చేయడంతోపాటు కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రొటెక్టడ్ అగ్రికల్చర్ జోన్గా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేలా చేస్తాం ►మత్స్యకారుల సంక్షేమం కోసం జాతీయ కమిషన్ ఏర్పాటుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం డీఎంకే వరాలు ►రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాలకు నీట్ పరీక్ష రద్దు ►పెద్ద నోట్ల రద్దు బాధితులకు నష్ట పరిహారం (తమిళనాడులో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు క్యూలో నిలబడి సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు) ►ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చర్యలు ►విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాల మాఫీ ►చిన్న, సన్నకారు రైతుల పంట రుణాల మాఫీ ►సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల సరఫరా ►కంపెనీలకు కార్పొరేట్ పన్నును 21 శాతానికి తగ్గింపు ►మైనార్టీ, మహిళలకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు కార్పొరేట్ పన్నులో మరింత తగ్గింపు ►దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల కోటాలోని ప్రయోజనాల కల్పన ►నీతి ఆయోగ్ రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని తీసుకురావడం ►రాజ్యాంగ సంస్థల స్వతంత్రను కాపాడటం ►మొత్తం పన్ను వసూల్లో 60 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేసేలా చూడటం ►జీవిత బీమా, విద్యుత్ సరఫరాకు జీఎస్టీ మినహాయింపు ►వరికి రూ.2,500, చెరకుకి రూ.4,000 మద్దతు ధర కోసం పోరాడతాం ►ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కోసం కృషి ►రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పింఛన్ విధానం అమలు ►గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపు ►రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదల -
మూడో రోజూ సేమ్ సీన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలు, రామ మందిరం నిర్మాణం, కావేరీ నది జలాల విషయంలో ఆందోళనలు చేశారు. గురువారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. 17 ఏళ్ల కింద పార్లమెంటులో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి రాజ్యసభ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ వెంటనే కావేరీ జలాల సమస్యపై అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకొచ్చా రు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని ఎంత కోరినా వారు. వినిపించు కోలేదు. సభా కార్యకలాపాలను సజావుగా సాగని వ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘పార్లమెంటును కాపాడేం దుకు 9 మంది ప్రాణత్యాగం చేశారు. ఇలా చేశారంటే మన వ్యవస్థ గురించి తప్పుడు సమాచారం వెళు తుంది’అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో తప్పని పరిస్థితు ల్లో శుక్రవారానికి చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. లోక్సభలోనూ ఇదే స్థితి.. లోక్సభ ప్రారంభం కాగానే 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులర్పించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో రెండుసార్లు సభను వాయిదావేశారు. కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ఆందోళనలను విరమించుకోకపోవడంతో జీరో అవర్ సమయంలో స్పీకర్ లోక్సభను శుక్రవారానికి వాయిదా వేసింది. రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని శివసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. ‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన అంశమైన హిందూత్వాన్ని ఆ పార్టీ మరిచిపోయింది’ అని పార్టీ నేత అడ్సల్ అన్నారు. -
వెండితెరపై వీధి పోరాటాలు
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం విజయ్ నుంచి రజనీకాంత్ దాకా ప్రజాదరణ పొందిన సినిమా స్టార్ల పని పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళ సినిమాల్లో రాజకీయపరంగా చూపుతున్న వివాదాస్పద దృశ్యాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఇది ప్రతిఫలిస్తోంది. మరొకవైపు జయలలిత జీవించి ఉండగా ఆమెను కన్నెత్తి చూడటానికి సాహసించని తమిళ చిత్ర పరిశ్రమ ఆమె లేనప్పుడు విమర్శలకు దిగడం గమనార్హం. విజయ్ తాజా సినిమా ‘సర్కార్’ లో ప్రజలు మిక్సర్లు, గ్రైండర్లు వంటి జయ ప్రభుత్వం అందించిన ఉచిత వస్తువులను నిప్పుల్లోకి విసిరేస్తున్నట్లు చిత్రించిన పాట పట్ల అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది నిజంగానే పరిహాసాస్పదంగా ఉంది. రాజకీయ రంగంలో ప్రతిభకు సంబంధించిన కన్వేయర్ బెల్ట్గా చిత్రపరిశ్రమను వ్యవహరిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. వెండితెరకు పరిచయమై తర్వాత రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్న ఇద్దరు నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలతో అన్నాడీఎంకే బాగా లబ్ధి పొందింది. అంతకు ముందు డీఎంకే పార్టీ మాస్ మీడియా అయిన సినిమా దన్నుతో తన భావజాలాన్ని ప్రచారం చేసేది. కానీ ఈరోజు అన్నాడీఎంకే గడచిన దీపావళివారాన్ని చాలావరకు చెన్నై ఆకాశంలో రాజకీయ పటాసులను పేల్చడంలోనే గడిపేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో ముగ్గురు మేటి హీరోలు విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్లకు వ్యతిరేకంగా తుపాకులు గురిపెట్టాలని ఈ పార్టీ నిశ్చయించింది. రజనీ, కమల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఇక రాజకీయాలపై విజయ్ ఆసక్తి అందరికీ తెలిసిందే. తమిళనాడులో విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’తో అన్నాడీఎంకే సర్కారుకు సమస్యలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్సాధించింది. అయితే, ‘సర్కార్’ సినిమా తమ పార్టీ పరువుకు నష్టం కలిగించేందుకు పన్నిన కుట్ర అంటూ అన్నాడీఎంకే నిందించింది. విజయ్, ఈ చిత్ర నిర్మాతలను ఉగ్రవాదులుగా చిత్రించడమే కాకుండా రాజద్రోహ ఆరోపణలు చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇద్దరు మంత్రులు హెచ్చరించారు. విజయ్ వంటి వృద్ధిలోకి వస్తున్న నటుడికి ఇది మంచిది కాదు అని రాష్ట్ర సమాచార మంత్రి కె. రాజు అభిప్రాయపడ్డారు. ఇక న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోగ్యకరమైన విమర్శకు ఆహ్వానం పలుకుతూనే, సినిమా హింసను ప్రేరేపించిందని, ఇది తీవ్ర నేరమని వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఓటు వేసేలా ఆకర్షించడానికి వస్తువులను ఉచితంగా బహూకరిస్తామని వాగ్దానం చేయడం తమిళనాడు ఎన్నికల సంస్కృతిలో భాగం. అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత 2011 తమిళనాడు ఎన్నికల్లో ఈ వస్తువులను ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలు ఇలాంటి ఉచిత వస్తువులను తిరస్కరిస్తున్నట్లు చూపటం ద్వారా సర్కార్ చిత్రం అన్నాడీఎంకే పార్టీని వేలెత్తి చూపుతోందని ఆ పార్టీ అర్థం చేసుకుంది. అంతటితో కథ ముగియలేదు. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి పేరు కోమలవల్లి. ఇది జయలలిత అసలు పేరు. తమ నాయకురాలి స్మృతిని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా ఆ పేరును పెట్టారని అన్నాడీఎంకే భావిస్తోంది. పైగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించడం రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అన్నాడీఎంకే పసిగట్టింది. ఈ చిత్ర సమర్పకుడు కళానిధి మారన్ డిఎంకే దివంగత నాయకుడు ఎం.కరుణానిధి మునిమనవడు. కళానిధి సోదరుడు దయానిధి మారన్ డీఎంకే ఎంపీగా, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేశారు. పైగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయపరంగా బద్ధశత్రువులు కూడా. అన్నాడీఎంకే కార్యకర్తలు మదురైలో సర్కార్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా సినిమా హాళ్లపై దాడి చేయడంతో పరిణామాలు మరింత వేడెక్కాయి. ఈ సినిమాపై 110 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినందున ఆర్థిక నష్టాన్ని పసిగట్టిన సర్కార్ చిత్ర నిర్మాతలు సినిమాలో కోమలవల్లి పేరును వల్లించిన దృశ్యాలను మ్యూట్ చేయడంతోపాటు ఉచిత పథకాలపై విమర్శ దృశ్యాలను సినిమాలోంచి తొలగించాలని నిర్ణయించారు కూడా.సర్కార్ సినిమాపై తమ వైఖరిని మరింత స్పష్టంగా వ్యక్తపరచిన ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆర్బి ఉదయకుమార్ తమిళ సినిమాలకు విధివిధానాలను కూడా నిర్దేశించేంత పనిచేశారు. సెన్సార్ బోర్డును మించి మాట్లాడుతూ, రాజకీయ ఉద్దేశాలతో కూడిన వివాదాస్పద దృశ్యాలను సినిమాలు వదిలేయాలని ఉదయకుమార్ పేర్కొన్నారు. అమ్మ జయలలిత ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. 2017 దీపావళినాడు విడుదలైన విజయ్ సినిమా మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) సైతం ఇలాంటి చిక్కులను ఎదుర్కొంది. జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)ని నేరుగా విమర్శిస్తూ ఆ సినిమాలో పొందుపర్చిన ఒక సంభాషణ పట్ల తమిళనాడు బీజేపీ యూనిట్ అభ్యంతరం తెలిపింది. సినిమాలోంచి ఆ డైలాగ్ను తీసివేయాలని కోరుతూ బీజేపీ విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేసింది కూడా. కానీ ఆ చిత్రంపై వచ్చిన వ్యతిరేకత మరింత ఆసక్తిని రేపి, మెర్సల్ని బాక్సాఫీసు వద్ద మరింత హిట్ చేసింది. నిజానికి మెర్సల్ను వ్యతిరేకించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చాక, అన్నాడీఎంకే ప్రభుత్వంతో సహా మరెవరికీ సినిమాను అడ్డుకునే అధికారం లేదని సర్కార్ సినిమాను సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ బలాన్ని, కండబలాన్ని ఉపయోగించి తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిచేస్తున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం సర్కార్ సినిమాతోనే మొదలు కాలేదు. 2013లో కమల్ హాసన్ సైతం ముస్లిం బృందాలు వ్యతిరేకత తెలపడంతో తన విశ్వరూపం సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహంతోటే అలాంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఈ ప్రముఖ నటుడు, నిర్మాత పదేపదే చెబుతూ వచ్చారు. అదే సంవత్సరం విజయ్ తీసిన తలైవా (నాయకుడు) ‘నాయకత్వం వహించాల్సిన సమయం’ అంటూ ట్యాగ్ లైన్తో వచ్చింది. ఇది అన్నాడీఎంకే నాయకత్వాన్ని కలవరపర్చింది. చిత్ర ప్రచార కార్యక్రమాల నుంచి ఆ ట్యాగ్ లైన్ను పూర్తిగా తొలగించాక రెండు వారాలు ఆలస్యంగా ఆ సినిమా విడుదలకు నోచుకుంది. ‘నోటా’, ‘తమిళ్పడమ్2’ అనే రెండు సినిమాలు కూడా అన్నాడీఎంకే పాలనను తీవ్రంగా విమర్శించాయి. కానీ పాలక పార్టీ వాటిపై ఎలాంటి వ్యతిరేకతనూ ప్రదర్శించలేదు. నిజానికి తమిళ్పడమ్2 సినిమా దర్శకుడు సీఎస్ అముదం గత శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, సర్కార్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో అన్నాడీఎంకే సాయపడుతోందన్నారు. ‘అలాంటి ప్రచారాన్ని మా సినిమాకు దక్కనివ్వలేదు, మేం సినిమాను ఉత్తమంగా తీయడానికి ప్రయత్నించాం. ఇది పూర్తిగా పాక్షిక వైఖరే‘ అనేశారు. విజయ్ని అన్నాడీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఉంది. విజయ్కి యూత్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో భారీ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలో ప్రదర్శించిన అన్నాడీఎంకే వ్యతిరేక సందేశం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపగలదు. తమ దివంగత నాయకురాలు ప్రోత్సహించిన సంక్షేమపథకాలపై విమర్శను చూసీ చూడనట్లు వదిలివేసిన పక్షంలో తమ పార్టీని హేళన చేయడానికి కోలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు వరుసకట్టే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే వాదిస్తోంది. అయితే మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపిన అన్నాడీఎంకే పార్టీ విషయాన్ని అంతటితో ఆపివేయలేదు. ఇద్దరు తమిళ దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ల పని పట్టాలని కూడా నిశ్చయించుకుంది. సెన్సార్ బోర్డ్ ఆమోదం తెలిపిన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఈ ఇద్దరు నటులూ విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే పత్రిక ‘నమదు అమ్మ’ (మన అమ్మ) రజనీకాంత్ని విమర్శిస్తూ, ప్రభుత్వం ఆమోదించిన ఆహారంలో బల్లి కనపడితే రజనీకాంత్ దాన్ని ఆరగించగలరా అని ఎద్దేవా చేసింది. ఈ వ్యంగ్య విమర్శను అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నాడీఎంకే రజనీకాంత్పై గురిపెట్టడం వాస్తవమే. ఎందుకంటే బీజేపీతో రజనీకాంత్ బంధం రహస్యమైన విషయం కాదు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది కూడా. రజనీకాంత్ వెంటనే తనపై విమర్శను తిప్పికొట్టడమే కాకుండా, అన్నాడీఎంకేకి బలమైన సందేశం పంపారు. నరేంద్రమోదీని దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా రజనీ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక కమల్ హాసన్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ఎద్దేవా చేశారు. విశ్వరూపం తొలి భాగం సినిమాకు సమస్యలు ఎదురు కానున్నట్లు సూచన వచ్చినంతనే దేశం వదిలి వెళ్లిపోవడానికి సంసిద్ధత ప్రదర్శించిన కమల్ను సీఎం పరిహసించారు. అన్నాడీఎంకే అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ చిత్రపరిశ్రమలో గ్లామర్ ఉన్న నటులను ఓ పట్టు పట్టాలని పాలకపార్టీ ప్రయత్నిస్తోంది. అమ్మ ప్రభుత్వంగా తనకు తాను చెప్పుకుంటున్న ప్రస్తుత నాయకత్వం తేలిపోతున్నట్లు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అన్నాడీఎంకే అనుమానిస్తోంది. జయలలిత నిజమైన వారసురాలిగా అన్నాడీఎంకే నిలబడుతుందా లేదా అనే విషయాన్ని మనం 2019లో చూడబోతున్నాం. ఈలోగా విజయ్ సినిమా సర్కార్కి ఇది ప్రభుత్వ స్పందన అయినట్లయితే, అవినీతిపై యుద్ధం ప్రకటించిన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపట్ల ప్రభుత్వ వైఖరి మరీ ఘోరంగా ఉండతోతుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగానే, పాలక అన్నాడీఎంకేకి, సినీ రాజకీయనేతల నడుమ ఘర్షణ సమీప భవిష్యత్తులో ముగిసిపోయేలా కనిపించటం లేదు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు -
న్యాయమూర్తికే అన్యాయమా ?
అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు హద్దులు దాటాయి. సాక్షాత్తున్యాయమూర్తి కుటుంబాన్నే హతమారుస్తామని బెదిరించే స్థాయికి తెగించాయి.గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తినే భయభ్రాంతులకు గురిచేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత దినకరన్, ఎడపాడి, పన్నీర్సెల్వం రూపంలో పార్టీ మూడు చెక్కలైంది. ఎడపాడి, పన్నీర్ యుగళగీతం ఆలపించి ఏకంకాగా రెండు వర్గాలుగా మిగిలిపోయింది. శశికళ దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని చేపట్టిన ఎడపాడి, శశికళపై తిరుగుబాటు చేసి పన్నీర్సెల్వం ఏకమైన తనను ఒంటరివాడిని చే యడమేగాక పార్టీ నుంచి బహిష్కరించడాన్ని దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దినకరన్ తనకు మద్దతిచ్చే 19 మంది ఎమ్మెల్యేల చేత ప్రభుత్వానికి ఉపసంహరించుకున్నట్లుగా గవర్నర్కు ఉత్తరం ఇప్పించారు. అయితే ఇంతలో వీరిలో ఒక ఎమ్మెల్యే ఎడపాడి వైపునకు మొ గ్గారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని కూ లదోసే కుట్ర పన్నారనే ఆరోపణలపై మిగతా 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ అనర్హతవేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ ఫుల్ బెంచ్కు విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి వేటు చెల్లుతుందని తీర్పు చెప్పగా, స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయం చెల్లదని న్యాయమూర్తి సుందర్ తీర్పు వెల్లడించారు. దీంతో అనర్హత వేటు అంశం మూడో న్యాయమూర్తి ముంగిటకు వెళ్లింది. న్యాయమూర్తికి బెదిరింపులు ఈ నేపథ్యంలో అనర్హతవేటు పడిన 18 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్కు ఒక ఆకాశరామన్న ఉత్తరం అందింది. చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల క్వార్టర్స్ సమీపంలో సుందర్ తన భార్య, కుమార్తెతో నివసిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆదివారంఅందిన ఉత్తరంలో ‘18 మంది ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పిన నిన్ను, నీ కుటుంబ సభ్యులను హతమారుస్తాం’ అని పేర్కొని ఉంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి దృష్టికి తీసుకెళ్లగా ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని గాలింపు చర్యలు ప్రారంభించారు. న్యాయమూర్తి సుందర్ ఇంటికి 24 గంటలపాటు బందోబస్తుకు సాయుధ పోలీసులను నియమించారు. న్యాయమూర్తి రాకపోకలు సాగించే దారుల్లోనూ బందోబస్తు పెట్టారు. -
టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే పదవుల తొలగింపు
టీ.నగర్: అన్నాడీఎంకే అధికారపూర్వక వక్తలు మినహా ఇతర కార్యకర్తలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే అధిష్టానం హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్సెల్వం అంగీకారంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లో అధికారపూర్వక వక్తలు, ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వార్తపత్రికలు, రేడియో, టీవీలకు పంపినట్లు తెలిపారు. అందువల్ల ప్రచారమాధ్యమాలు అన్నాడీఎంకే అధికార ప్రతినిధులను మాత్రమే చర్చా కార్యక్రమాలకు ఆహ్వానించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో పదవుల తొలగింపు: పుదుక్కోట్టైలో సంచలనం పుదుక్కోట్టైలో ఓపీఎస్ మద్దతుదారులకు పార్టీలో పదవులు ఇచ్చిన మరుసటి రోజే వారి పదవుల నుంచి తొలగించారు. పుదుచ్చేరి మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న కార్తిక్ తొండైమాన్ పుదుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ అధ్యక్ష పదవికి అన్నాడీఎంకే ఇలంజర్, ఇలంపెన్గల్ పాసరై జిల్లా కార్యదర్శిగా ఉన్న రాజశేఖరన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడగా కార్తిక్ తొండైమాన్, రాజశేఖర్ ఓపీఎస్ వర్గంలో ఉన్నారు. దీంతో వీరి వద్ద ఉన్న పదవులను లాక్కున్నారు. అన్నాడీఎంకేలో పదవులను ఇవ్వాలని కార్తిక్ తొండైమాన్, రాజశేఖరన్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. దీంతో కార్తిక్ తొండైమాన్కు ఎంజీఆర్ ఇలంజర్ జిల్లా అధ్యక్ష పదవి, రాజశేఖరన్కు ఎంజీఆర్ ఇలంజర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవిని గత ఐదో తేదీన అప్పగించారు. దీంతో వారి మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్ పదవిని మరుసటి రోజే లాక్కోవడంతో మద్దతుదారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. -
నా కొద్దు పెంపు జీతం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ నినాదం కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కేనగర్లో ఎన్నికల ఖర్చులు, లెక్కలు తేలని దృష్ట్యా, దినకరన్పై అనర్హత వేటు పడేనా అన్న చర్చ ఏర్పడింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం తమకు దూరం కావడంతో ఒక వేదిక కోసం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధపడ్డా, చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. ఇందుకు కారణం తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ విచారణలో ఉండడమే. ఈ సమయంలో పార్టీ ప్రకటించిన పక్షంలో వారి పదవులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పవన్న విషయాన్ని పరిగణించారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని కొనసాగించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వేదిక ఏర్పాటులో జాప్యంతో తన పక్షాన ఉన్న వాళ్లు మళ్లీ సొంతగూటి వైపుగా తొంగి చూస్తుండడంతో దినకరన్ అప్రమత్తం అయ్యారు. అమ్మ నినాదాన్ని సొంతం చేసుకునేందుకు తగ్గ అనుమతుల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగాన్ని ఆశ్రయిస్తూ, మరో వైపు కోర్టు ద్వారా అనుమతి పొందేందుకు సిద్ధం అయ్యారు. హైకోర్టులో పిటిషన్: దినకరన్ తరఫున అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని సొంతం చేసుకునే విధంగా ఢిల్లీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం వ్యవహారంలో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, తాము అన్నాడీఎంకే అమ్మ శిబిరంగా ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు వివరించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తమ శిబిరం అన్నాడీఎంకే అమ్మ పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉన్నామని, తమకు ఎన్నికల యంత్రాంగం ఒకే చిహ్నం కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అన్నాడీఎంకే అమ్మ పేరును రిజిస్టర్ చేయాలని కోరుతూ ఎన్నికల యంత్రాంగానికి లేఖను దినకరన్ తరఫున ప్రతినిధులు సమర్పించారు. వేటు పడేనా.. : దినకరన్ ఎమ్మెల్యే పదవికి వేటు పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాల మీద లెక్కల్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం రంగంలోకి దిగింది. అయితే, ఆయన సమర్పించిన లెక్కల వివరాలు తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారుల పరిశీలనలో సాగిన లెక్కలు, దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. డీఎంకే, బీజేపీ అభ్యర్థుల లెక్కలు తేలగా, అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదనన్ ఖర్చుల లెక్కలు కూడా తేలకపోవడంతో సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్కు సమర్పించేందుకు ఆ బృందం సమాయత్తం అవుతోంది. నా కొద్దు పెంపు జీతం: తన ఎమ్మెల్యే పదవికి ప్రభుత్వం అందించనున్న జీతం పెంపును దినకరన్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్కు బుధవారం లేఖ రాశారు. ఎమ్మెల్యేలకు జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని, ఈ దృష్ట్యా, తనకు పెంపు వద్దే వద్దు అని అందులో వివరించారు. తనకు పాత జీతాన్ని ఇస్తే చాలని పేర్కొన్నారు. -
‘రెండాకుల’ లక్ష్యం
♦ మళ్లీ ఢిల్లీకి అన్నాడీఎంకే రాజకీయం ♦ చిహ్నం కైవసానికి కసరత్తు ♦ మంత్రులు, ఎంపీల బృందం తిష్ట ♦ ఈసీతో భేటీకి కుస్తీ ♦ కేంద్ర మంత్రులతో మంతనాలు ♦ మేల్కొన్న దినకరన్ శిబిరం ♦ తమను సంప్రదించాలని ముందుస్తుగా లేఖ ♦ కోర్టుకు సర్వ సభ్య సమావేశం వ్యవహారం రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా అన్నాడీఎంకే రాజకీయం మంగళవారం ఢిల్లీకి చేరింది. ఓపీఎస్–ఈపీఎస్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించి ఉన్న ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం మంత్రులు, ఎంపీల బృందం దేశ రాజధానిలో తిష్ట వేసింది. న్యాయనిపుణులతో ఓ వైపు, కేంద్ర మంత్రులతో మరో వైపు ఈ బృందం చర్చల్లో మునిగి ఉంది. ఇక, చిహ్నం కైవసం లక్ష్యంగా ఓపీఎస్–ఈపీఎస్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూదినకరన్ మేల్కొన్నారు. తమను సంప్రదించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని ముందుగానే ఈసీని ఆశ్రయించారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఈపీఎస్(సీఎం పళని), ఓ పీఎస్(డిప్యూటీ సీఎం) విలీన పర్వం ముగిసినా, ఉప ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటున్న దినకరన్ రూపంలో వివాదం రాజుకుంటోంది. దినకరన్ దూకుడు ఈపీఎస్, ఓపీఎస్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పుదుచ్చేరిలో తిష్టవేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు రోజుకో హెచ్చరికలు, బెదిరింపులతో ఈపీఎస్కు షాక్ ఇచ్చే విధంగా దూసుకెళ్తున్నారు. మంగళవారం మీడియాతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్, వెట్రివేల్ మాట్లాడుతూ, అందరి బండారాలు బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమను కట్టడి చేయడం ఎవరితరం కాదు అని, చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకుంటే మందని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నుంచి ప్రమాణ పత్రాన్ని వెనక్కు తీసుకుంటే, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, బల పరీక్ష విషయంలో గవర్నర్ స్పందించని దృష్ట్యా, పుదుచ్చేరిలో ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్లో పడ్డారు. దినకరన్ శిబిరం నుంచి బెదిరింపుల పర్వం పెరగడంతో, చిన్నమ్మకు చెక్ పెట్టే కార్యాచరణను ఈపీఎస్, ఓపీఎస్ వేగవంతం చేశారు. రెండాకుల చిహ్నం కైవసం చేసుకున్న పక్షంలో దినకరన్ మెడలు వంచినట్టే అని నిర్ధారణకు వచ్చి అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. చిహ్నం దక్కించుకోవడమే లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా ఉన్న సమయంలో సమర్పించిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ వద్ద రెండు కేసులు విచారణలో ఉన్నాయి. అందులో ఒకటి రెండాకుల చిహ్నం, మరొకటి ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారం. ఇందులో రెండాకుల చిహ్నం దక్కించుకున్న పక్షంలో, పార్టీ సర్వ సభ్య సమావేశం ఆధారంగా ప్రధాన కార్యదర్శి ఎవరన్నది తేల్చవచ్చునన్న ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించిన ప్రమాణ పత్రాలు, ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సారథ్యంలో మంత్రులు జయకుమార్, తంగమణి, సీవీ షణ్ముగం, ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీ అయ్యారు. న్యాయ నిపుణులతో ఉదయం నుంచి చర్చ సాగింది. తదుపరి కేంద్ర సహాయ మంత్రి నిర్మల సీతారామన్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సాగింది. ఈ భేటీల గురించి తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, మర్యాద పూర్వకమేనని సమాధానం ఇచ్చారు. అయితే, నిర్మల సీతారామన్ దర్శకత్వంలోనే రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారంలో న్యాయపరంగా చర్చలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్ను తొలిరోజు ఈ బృందం కలవలేదు. ‘సర్వ సభ్యం’ సభ్యుల గురి అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శికి మద్దతుగా సభ్యుల్ని సమీకరించే పనిలో చిన్నమ్మ శశికళ కుటుంబం రంగంలోకి దిగడం గమనార్హం. ఓవైపు దినకరన్, మరో వైపు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాల్లో ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు సర్వ సభ్య సమావేశ సభ్యుల్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు దినకరన్కు వెన్నంటి ఉన్న మాజీ మంత్రి దళవాయి సుందరం ఈపీఎస్తో భేటీకి నిర్ణయించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపుతోంది. అదే సమయంలో దినకరన్కు మున్ముందు ముచ్చెమటలు పట్టిస్తామని నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి స్పందిస్తే, చిన్నమ్మ శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబోమని మరో మంత్రి వెల్లమండి నటరాజన్ స్పందించడం ఆలోచించ దగ్గ విషయం. మేల్కొన్న దినకరన్ ఈపీఎస్–ఓపీఎస్ బృందం ఢిల్లీకి చేరడంతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మేల్కొన్నారు. ఆగమేఘాలపై పార్టీ కర్ణాటక విభాగం నేత పుహలేందిని ఢిల్లీకి పంపించారు. ఓపీఎస్, ఈపీఎస్ల విలీన వ్యవహారాలను ప్రస్తావిస్తూనే, అన్నాడీఎంకే వ్యవహారాల్లో తన ప్రమేయం ఉందని, చిన్నమ్మ శశికళ, తన పేరిట ఇప్పటికే ఈసీకి అనేక వినతిపత్రాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారని వివరిస్తూ ఓ లేఖను పుహలేంది ఎన్నికల కమిషన్కు సమర్పించారు. దినకరన్ను సంప్రదించకుండా, రెండాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని సూచించారు. ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకునే విధంగా ఏదేని ప్రయత్నాలు సాగినా, అందుకు తగ్గ వివరణ దినకరన్ నుంచి తీసుకోవాల్సి ఉందని, చర్చించకుండా, ఎలాంటి ఆమోదాలు తెలిపేందుకు వీలు లేదని అందులో స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి విదేశాలకు వెళ్లడంతో, ఆయన రాకకోసం ఓపీఎస్–ఈపీఎస్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. కోర్టుకు ‘సర్వ సభ్యం’ అన్నాడీఎంకే సర్వ సభ్యసమావేశం వ్యవహారం కోర్టుకు చేరింది. ఆదిత్యన్ రాంకుమార్ అనే వ్యక్తి మంగళవారం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆ పిటిషన్లో వివరించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరన్న వివాదం బయలుదేరి ఉందని, ఇందుకోసం సర్వసభ్య సమావేశం జరగబోతోందని వివరించారు. ఈ సమావేశాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో జరిపేలా కోర్టు నిర్ణయం తీసుకుంటే, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఉంటుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న శిబిరాలను ఒక చోట చేర్చి, రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగే విధంగా> ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ సంబంధిత శిబిరాలను ప్రతి వాదులుగా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి పిటిషన్ వాయిదా వేశారు. -
కథ క్లైమాక్స్కు
♦ చిన్నమ్మను సాగనంపేందుకు 12న ముహూర్తం ♦ అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం ♦ న్యాయనిపుణులతో దినకరన్ అన్నాడీఎంకే కథ క్లయిమాక్స్కు చేరుకుంది. పార్టీకి తలవంపులు, తలనొప్పులుగా మారిన శశికళ, దినకరన్ల శిరోభారాన్ని దించుకునేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ఎడపాడి నిర్ణయం తీసుకున్నారు. శశికళ స్థానంలో ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళ చలవ వల్లనే సీఎం అయిన ఎడపాడికి అదే వ్యక్తి వల్ల చిక్కులు మొదలయ్యాయి. జైలుకెళ్లే ముందు తన ప్రతినిధిగా నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సీఎం ఎడపాడి పాలిట కొరకరాని కొయ్యగా మారారు. పార్టీకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని సైతం కూల్చివేసేందుకు దినకరన్ పూనుకోవడంతో ఇక లాభం లేదనుకుని ఎడపాడి, పన్నీర్ కలిసి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా దినకరన్ వేగం పెంచడంతో అప్రమత్తమైన ఎడపాడి వారిని బహిష్కరిస్తూ సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వారి స్వాధీనంలో ఉన్న నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సీఎం ఎడపాడి అధ్యక్షతన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శశికళ, దినకరన్లను దెబ్బతీయడమే లక్ష్యంగా నాలుగు తీర్మానాలు చేశారు. గవర్నర్కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగించి శశికళ, దినకరన్లపై శాశ్వత వేటు వేయాలని ఎడపాడి వర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్నే ఎన్నికల కమిషన్ నిర్ధారించని పరిస్థితుల్లో ఆమె నియమించిన దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి కానేరడు, ఆయన నియామకాలు, తొలగింపులు చెల్లవు. కాబట్టి జయలలిత నియమించిన వారే ఆయా పదవుల్లో కొనసాగుతారని తీర్మానించారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ దినపత్రికలను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఈనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, పార్టీని బలోపేతం చేసిన జయలలిత బాటలో నడవాలని తీర్మానించారు. పెరుగుతున్న దినకరన్ బలం ఎడపాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా 19 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావుకు లిఖితపూర్వకంగా అందజేశారు. కాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేరడంతో సోమవారం నాటికి దినకరన్ బలం 23 కు చేరుకుంది. శశికళ, దినకరన్లకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై వేటు తప్పదని దినకరన్ వర్గం హెచ్చరిస్తోంది. ఇంతవరకు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించగా, పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం ఎడపాడిని తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి దినకరన్ ప్రకటించడం కలకలం రేపింది. అలాగే మంత్రులు తంగమణి, వేలుమణిలను కూడా పార్టీ నుంచి దినకరన్ సోమవారం తొలగించారు. కాగా, ఎడపాడి సోమవారం నిర్వహించిన సమావేశానికి 113 మందిలో 83 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. గైర్హాజరైన 30 మంది దినకరన్ వైపు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు ఎంపీలు కూడా రాలేదు. అన్నాడీఎంకేని బీజేపీలో నూరుశాతం విలీనం చేశారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. దిష్టిబొమ్మల దహనం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా ఎడపాడి వర్గీయులు దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మదురై జిల్లా మేలూరులో సీఎం ఎడపాడి, పన్నీర్సెల్వం దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వందమందిని అరెస్ట్ చేశారు. నేడు ఢిల్లీకి వైరి వర్గాలు సీఎం ఎడపాడి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ యుద్ధం సాగుతుండగా, ఇరుపక్షాలు మంగళవారం ఒకేసారి ఢిల్లీకి చేరుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఎన్నికల కమిషన్కు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేందుకు సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం సహా ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళుతోంది. అలాగే రాష్ట్రపతిని కలిసి ఎడపాడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరేందుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు సైతం మంగళవారం ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే బోస్ ఎడపాడిని హెచ్చరించారు. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టి సోమవారానికి ఏడు రోజులైంది. ఏ వర్గంలో చేరాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎడపాడి ప్రయత్నాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు దినకరన్ న్యాయనిపుణులతో సమావేశం అయ్యారు. ఎడపాడి, టీటీవీ దినకరన్ ఎవరికి వారు బహిష్కరణలు, నియామకాలు సాగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర కార్యనిర్వాహకులుగా తయారయ్యారు. మరోసారి పేరు మార్పు అన్నాడీఎంకే రెండుగా చీలడం వల్ల ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంంతో ఎడపాడి వర్గం ‘అన్నాడీఎంకే (అమ్మ)’ అని, పన్నీర్సెల్వం వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ రెండు వర్గాలు ఇటీవల ఏకం కావడంతో అన్నాడీఎంకే (అమ్మ, పురట్చి తలైవి అమ్మ) అని పేరు మార్చుకున్నట్లుగా పార్టీ లెటర్హెడ్ల ద్వారా వెల్లడైంది. -
అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు
-
తమిళనాట చతుర్ముఖ పోరు?
అన్నా డీఎంకే - డీఎంకేల మధ్య ప్రధాన పోరాటం జయ సర్కారు అధికారం నిలుపుకునే అవకాశం చిరకాలంగా తమిళనాడులో ప్రాంతీయ పార్టీల రాజ్యమే కొనసాగుతోంది. అయితే.. 1977-88 మధ్య ఎంజీఆర్ 11 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. ఈసారి మాత్రం జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు అధికారం నిలుపుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల పోరాటంలో మాత్రం అన్నా డీఎంకే, డీఎంకేలతో పాటు.. డీఎండీకే, పీఎంకేలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి. దీంతో.. ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటం సాగనుంది. జయకు మంచి ప్రజాదరణ అధికార అన్నా డీఎంకే కొన్ని చిన్న పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తోంది. మొత్తం 234 స్థానాల్లో ఏడు స్థానాలను జయలలిత తన మిత్రపక్షాలకు కేటాయించారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల నేత ఆమె. అమ్మ పేరుతో జయ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో ఆమె ప్రతిష్టను పెంపొందించాయి. గత రెండు విడతల పాలనలో ఆమెపై ఎటువంటి తీవ్ర అవినీతి ఆరోపణలూ రాకపోవటం మరో సానుకూలాంశం. అయితే.. పాత అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి రావటం, ఇటీవలి వరదల్లో ప్రభుత్వ వైఫల్యం, సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవటం వంటి అంశాలు.. అధికార పక్షం గెలుపును అంత సులువు చేయబోవని భావిస్తున్నారు. కోలుకోని కరుణానిధి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కుదేలైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. కరుణానిధి సారథ్యంలోని డీఎంకే అవినీతి ఆరోపణలు కుటుంబ కలహాలతో ఇంకా కోలుకోలేదు. కాంగ్రెస్తో కలిసి ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. రెండేళ్ల కిందట శ్రీలంక తమిళుల అంశంపై విడిపోయిన ఈ రెండు పార్టీలూ మళ్లీ ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి. 92 ఏళ్ల వయసున్న కరుణానిధి వృద్ధాప్యంలోనూ రాజకీయ చతురుతతో ముందుకు వెళుతున్నారు. డీఎండీకే వంటి ఇతర పార్టీలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే జయకు కరుణ గట్టి పోటీ ఇవ్వగలరు. విజయ్కాంత్కు డిమాండ్ ఇక రాజకీయ నాయకుడిగా మారిన మరో ప్రముఖ నటుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కెప్టెన్ విజయ్కాంత్.. ఆయన పార్టీ డీఎండీకే కూడా ఈ ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపుతుందని అంచనా. వన్నియార్ సామాజికవర్గం ప్రధాన ఓటు బ్యాంకుగా గల డీఎండీకే.. తొలిసారి 2006లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి పది శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాల్లోనూ పోటీచేసి మరింత మెరుగైన ఓట్ల వాటా సాధించింది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఆ పార్టీతో వేరుపడి అధికారిక గుర్తింపు గల ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ పార్టీ సాధిస్తున్న ఓట్ల శాతం ఇతర పార్టీలను అమితంగా ఆకర్షిస్తోంది. తమిళనాట గట్టి పాగా వేసేందుకు డీఎండీకేతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన తమతో చేయి కలుపుతారని డీఎంకే ఆశిస్తోంది. అయితే విజయ్కాంత్.. వామపక్షాలు, ఎండీఎంకే తదితర పార్టీలతో జట్టుకట్టి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఫ్రంట్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్కాంత్ను ప్రకటించింది. మరోవైపు విజయ్కాంత్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు అధికార అన్నా డీఎంకే 40 మంది వరకూ వన్నియార్ సామాజిక వర్గ అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఇక ఫ్రంట్లో చేరాలన్న విజయ్కాంత్ నిర్ణయాన్ని పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూల పరిణామాలతో పాటు.. విజయ్కాంత్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. ఇటీవలే తనను చుట్టుముట్టిన జర్నలిస్టులపైకి ఆగ్రహంగా చేయి ఎత్తి కొట్టబోవటం వంటి ఉదంతాలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ ఒంటరి పోరాటం డీఎండీకే, వైకోలతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించిన బీజేపీ.. చివరికి ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి. పొత్తుకు డీఎండీకే నిరాకరించగా.. బీజేపీతో దోస్తీకి ఎండీఎంకే నేత వైకో గుడ్బై చెప్పారు. అనంతరం డీఎండీకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. -
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
దూసుకెళుతున్న అన్నా డీఎంకే, పీఎంకే పార్టీలు హొసూరు: తమిళనాడు శాసనసభకు మే 16న సాధారణ ఎన్నికలు జరుగునున్నాయి. నామినేషన్ల ఘట్టం 22వ తేదీ నుండి ప్రారంభమైంది. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే ముందంజలో ఉంది. డీఎంకే కూటమిలో డీఎంకే పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎండీకే కూటమిలో పోటీ చేస్తున్న సీపీఐ ప్రచారం వేగంగా సాగుతోంది. మండుటెండలు అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హొసూరు: హొసూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలు ప్రచారంలో నువ్వా, నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. బీజేపీ మూడవ స్థానంలో, డీఎండీకే నాల్గవ స్థానంలో ప్రచారంలో ఉన్నాయి. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేదు. హొసూరులో అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. తళి: తళి నియోజకవర్గంలో సీపీఐ, డీఎంకే పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థి ప్రచారంలో మూడవ స్థానంలో ఉన్నారు. బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. పీఎంకే అభ్యర్థిని మార్చడంతో పీఎంకే ప్రచారం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేదు. కన్యాకుమారి జిల్లా అంత విస్తీర్ణంలో ఉన్న తళి నియోజకవర్గంలోప్రచారం కష్టం అంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు. వేపనహళ్లి: వేపనహళ్లి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారంలో మొదటి స్థానంలో, డీఎంకే రెండవ స్థానంలో, పీఎంకే, డీఎండీకే పార్టీలు మూడు, నాల్గవ స్థానంలో నిలిచాయి. క్రిష్ణగిరి: క్రిష్ణగిరి నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల ప్రచారంలో పోటీ పడుతున్నాయి. డీఎండీకే తదితర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బర్గూరు: బర్గూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇతర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. ఊత్తంగేరి: ఊత్తంగేరి రిజర్వ్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి మనోరంజితం నాగరాజుపై అసంతృప్తి ఉన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఇక డీఎంకే అభ్యర్థి కూడా అన్నాడీఎంకేకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎండీకే కూటమిలో విడుదలై చిరుత పార్టీ ప్రచారం ప్రారంభించింది. -
కెప్టెన్ను సీఎం చేస్తాం
♦ అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలి ♦ విజయకాంత్కే ఎన్నికలపై నిర్ణయాధికారం ♦ డీఎండీకే జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చెన్నై, సాక్షి ప్రతినిధి: తమ పార్టీని కాలరాసేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకేకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతూనే పార్టీ అధినేత విజయకాంత్ను ముఖ్యమంత్రిని చేసి తీరుతామని డీఎండీకే సమావేశంలో నేతలు శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెరంబలూరులో డీఎండీకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలను శనివారం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు విజయకాంత్ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా ఇద్దరికి మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించారు. ఆ తరువాత సర్వసభ్య సమావేశం సాగింది. ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన నేతలంతా అన్నాడీఎంకేపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజా సమస్యలను విస్మరించిన అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఇక పాలించే హక్కులేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వీలులేకుండా ప్రతిపక్షాల గొంతునొక్కడం ఈ ప్రభుత్వ నైజమని అన్నారు. తమతో పొత్తువల్లనే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా ఆ తరువాత తమను విస్మరించిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే గుణపాఠం చెప్పేలా కూటమి ఏర్పరచుకోవాలని పార్టీ నేతలు కోరారు. తమ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే కుటిలయత్నాలను సాగిస్తోందని పార్టీకి చెందిన నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చాంబర్లకు తాళాలు వేసి, అధికారిక కార్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుందని దుయ్యబట్టారు. అంతేగాక డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లేడేందుకు వీలులేకుండా నిషేధం విధించిందని అన్నారు. తమ పార్టీ అధినేత విజయకాంత్పై అదేపనిగా పరువునష్టం దావాలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీలో సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్ను అన్నాడీఎంకేలో చేర్చుకోవడం ద్వారా ఇకపై భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోకూడదని నేతలు అభిప్రాయపడ్డారు.2016లో ఏర్పడబోయే ఎన్నికల కూటములు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. సర్వాధికారాల కెప్టెన్: పార్టీకే కాదు, అసెంబ్లీ ఎన్నికల నిర్ణయాలపై కూడా విజయకాంతే మా కెప్టెన్, ఆయనకు సర్వాధికారాలను కట్టబెడుతున్నామని డీఎండీకే జనరల్బాడీ సమావేశం తీర్మానించింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని, ప్రజల కోర్కె మేరకు రాష్ట్రంలో సంపూర్ణమధ్య నిషేధం విధించాలని తీర్మానించారు. జల్లికట్టుకు అనుమతిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, సాధించిన కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ తదితరులకు అభినందన తీర్మానాలు ఆమోదించారు. గ్రానైట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయస్తానాలే ముందుకు రావాలని కోరుతూ తీర్మానించారు. విద్యుత్ కోతల నుంచి విముక్తి కోసం హెచ్చుమొత్తాలు చెల్లించి విద్యుత్ను కొనుగోలు చేయడాన్ని పార్టీ ఖండించింది. రాష్ట్రప్రభుత్వం అవినీతి అక్రమాలపై దోషులను శిక్షించేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలు చేశారు. సభ ప్రారంభానికి ముందుగా పలు సంతాప తీర్మానాలు ఆమోదించారు. గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామ్, గాంధేయవాది శశిపెరుమాళ్, వరదబాధితులు, మృతులకు సమావేశంలో ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ అగ్రనేత ప్రేమలతా విజయకాంత్ 59 పార్టీ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సహా 1550 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వీలులేకుండా ప్రతిపక్షాల గొంతునొక్కడం ఈ ప్రభుత్వ నైజమని అన్నారు. తమతో పొత్తువల్లనే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా ఆ తరువాత తమను విస్మరించిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే గుణపాఠం చెప్పేలా కూటమి ఏర్పరచుకోవాలని పార్టీ నేతలు కోరారు.తమ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే కుటిలయత్నాలను సాగిస్తోందని పార్టీకి చెందిన నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చాంబర్లకు తాళాలు వేసి, అధికారిక కార్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుందని దుయ్యబట్టారు. అంతేగాక డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లేడేందుకు వీలులేకుండా నిషేధం విధించిందని అన్నారు. తమ పార్టీ అధినేత విజయకాంత్పై అదేపనిగా పరువునష్టం దావాలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీలో సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్ను అన్నాడీఎంకేలో చేర్చుకోవడం ద్వారా ఇకపై భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోకూడదని నేతలు అభిప్రాయపడ్డారు.2016లో ఏర్పడబోయే ఎన్నికల కూటములు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. సర్వాధికారాల కెప్టెన్: పార్టీకే కాదు, అసెంబ్లీ ఎన్నికల నిర్ణయాలపై కూడా విజయకాంతే మా కెప్టెన్, ఆయనకు సర్వాధికారాలను కట్టబెడుతున్నామని డీఎండీకే జనరల్బాడీ సమావేశం తీర్మానించింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని, ప్రజల కోర్కె మేరకు రాష్ట్రంలో సంపూర్ణమధ్య నిషేధం విధించాలని తీర్మానించారు. జల్లికట్టుకు అనుమతిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, సాధించిన కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ తదితరులకు అభినందన తీర్మానాలు ఆమోదించారు. గ్రానైట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయస్తానాలే ముందుకు రావాలని కోరుతూ తీర్మానించారు. విద్యుత్ కోతల నుంచి విముక్తి కోసం హెచ్చుమొత్తాలు చెల్లించి విద్యుత్ను కొనుగోలు చేయడాన్ని పార్టీ ఖండించింది. రాష్ట్రప్రభుత్వం అవినీతి అక్రమాలపై దోషులను శిక్షించేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలు చేశారు. సభ ప్రారంభానికి ముందుగా పలు సంతాప తీర్మానాలు ఆమోదించారు. గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామ్, గాంధేయవాది శశిపెరుమాళ్, వరదబాధితులు, మృతులకు సమావేశంలో ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ అగ్రనేత ప్రేమలతా విజయకాంత్ 59 పార్టీ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సహా 1550 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. -
జయ విజయం
రాజకీయాల్లో ప్రవేశించిన క్షణం నుంచి ఎన్నో యుద్ధాలనూ, అవి ముందుకు తీసుకొచ్చే సవాళ్లనూ...ఎన్నెన్నో ఆటుపోట్లనూ ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న అన్నా డీఎంకే అధినేత జయలలిత మరో సుదీర్ఘ పోరాటంలో ఎన్నదగిన విజయం సాధించారు. పందొమ్మిది సంవత్సరాలనాటి అక్రమార్జన కేసులో ఆమె, ఆమెతోపాటు మరో నలుగురూ నిర్దోషులని కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిరుడు సెప్టెంబర్లో ఇదే కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షనూ, వంద కోట్ల రూపాయల జరిమానాను విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చినప్పుడు జయలలిత రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడినట్టేనని అందరూ భావించారు. నాలుగేళ్ల జైలు శిక్ష, అనంతరం ఆరేళ్ల అనర్హతవల్ల మొత్తం పదేళ్లు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాల్సివస్తుందని లెక్కలు వేశారు. అయితే మిన్ను విరిగి మీదపడినా, సర్వమూ అయిపోయినట్టేననిపించిన సందర్భాలు వచ్చిపడినా ఏమాత్రం చలించకుండా... స్థిరంగా, దృఢంగా నిలబడి పోరాడటం జయలలిత స్వభావం. నిజానికి ఆ స్వభావమే ఆమెను తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఫీనిక్స్లా మళ్లీ మళ్లీ ఆమెను పెకైగసేలా చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పు తర్వాత శాసనసభ సభ్యత్వం రద్దయినందువల్ల నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఎటూ వచ్చే ఏడాదితో ముగిసిపోతుంది గనుక ఆర్నెల్లలోగా ఎమ్మెల్యేగా పోటీచేసే బదులు అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని ఆమె నిర్ణయించుకున్నా ఆశ్చర్యంలేదు. జయలలితపై వచ్చిన అవినీతి ఆరోపణలూ, అందుకు సంబంధించిన కేసులూ, విచారణలూ, వాయిదాలూ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెపై ఇంతవరకూ డజను కేసులు నడిచాయి. వాటన్నిటిలోనూ జయలలిత నిర్దోషిగా బయటికొచ్చారు. టాన్సీ భూములు కుంభకోణంలో కింది కోర్టు 2001లో ఆమెను దోషిగా తేల్చి అయిదేళ్లు శిక్ష విధించగా, అప్పీల్లో ఆ కేసు సైతం వీగిపోయింది. ఇప్పుడు తీర్పు వెలువడిన అక్రమార్జన కేసు 1996 నాటిది. ఒక కేసులో వచ్చిన నేరారోపణలు నిజమా, కాదా అని తేలడానికి ఇన్నేళ్లు పట్టడం...ఆ కేసు ఇన్ని మలుపులు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జయలలితపై వచ్చిన ఈ కేసులన్నిటి వెనకా రాజకీయ స్పర్శ ఉంది. 1991లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన జయలలిత 1996 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆ సమయంలో ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని అపరిమితంగా ఆస్తులు కూడబెట్టారని ప్రస్తుత బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక ఎన్నెన్నో మలుపులు తిరిగింది. ఈలోగా జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందువల్ల కేసులో న్యాయం జరిగే అవకాశం లేదని డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ అనంతరం దీన్ని బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీచేస్తూ 2003లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదలా కొనసాగుతుండ గానే జయలలిత మళ్లీ అధికారం కోల్పోయారు. నిరుడు సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధించేనాటికి జయలలిత అధికారంలో ఉన్నారు. ఆ తీర్పు పర్యవసానంగా ఆమె పదవినుంచి తప్పుకున్నారు. కొత్తగా పన్నీరుసెల్వం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా భవానీసింగ్ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదమైంది. ఆ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఆ పదవిలో మరొకరిని నియమించమని క ర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా వరసబెట్టి ప్రతికూల నిర్ణయాలు వెలువడతున్న తరుణంలో జయలలితకు ఊరటనిస్తూ వెలువడిన కర్ణాటక హైకోర్టు తీర్పు సహజంగానే ఆమెకూ, ఆమె మద్దతుదార్లకూ ఎనలేని సంతోషాన్నిచ్చింది. తమిళనాడు అవినీతి వ్యతిరేక డెరైక్టరేట్ చేసిన దర్యాప్తు తప్పుల తడకగా ఉన్నదని, రాజకీయ కక్ష సాధింపుతో తన ఆస్తుల విలువను తప్పుగా మదింపు వేశారని జయలలిత చేసిన వాదనను సింగిల్ జడ్జి బెంచ్ అంగీకరించింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 66.45 కోట్లుగా ప్రాసిక్యూషన్ నిర్ధారించగా వాటి విలువ రూ. 37.59 కోట్లని హైకోర్టు తేల్చింది. ఈ కాలంలో ఆమె సంపాదనను 34.76 కోట్లుగా లెక్కేసి వ్యత్యాసం రూ. 2.82 కోట్లు మాత్రమేనని నిర్ధారణకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్కెళ్తే భవిష్యత్తులో ఏమవుతుందన్నది పక్కనబెడితే అసలు ఒక కేసులో న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి మన న్యాయస్థానాలు ఇంత సుదీర్ఘకాలాన్ని ఎందుకు తీసుకుంటున్నాయన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు సాగదీయాలనుకోవడంవల్ల కావొచ్చు... అధికారంలో ఉన్నవారి ప్రాపకంతో దర్యాప్తు సంస్థలు కావాలని చేసే జాప్యంవల్ల కావొచ్చు విచారణ ప్రక్రియ హద్దూ ఆపూ లేకుండా ఏళ్లకేళ్లు నడుస్తున్నది. ఇందువల్ల తప్పుచేసినవారు శిక్ష పడకుండా దీర్ఘకాలం తప్పించున్నట్టే నిజంగా ఏ తప్పూ చేయనివారు ‘అవినీతి’ ముద్రతో, క్షోభపడుతూ కాలం వెళ్లబుచ్చవలసి వస్తున్నది. ఇప్పుడు జయలలిత కేసే తీసుకుంటే ఈ పందొమ్మిదేళ్ల పొడవునా ఆమెపై విమర్శలు చేయాల్సివచ్చినప్పుడల్లా ప్రత్యర్థులకు ఈ అవినీతి కేసులే ఆయుధం. అది ఆమె రాజకీయ జీవితంపై అంతో ఇంతో ప్రభావం చూపింది. తీరా ఇన్నేళ్ల తర్వాత ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. ఆలస్యం అయినా కేసులను నిష్పాక్షికంగా విచారించి, తీర్పులివ్వడంలో మన న్యాయవ్యవస్థ సమర్థవంతమైనది. అయితే, ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవడం అవసరం ఉన్నదని ప్రస్తుత కేసు తెలియజెబుతోంది. -
శ్రీ‘రంగం’లో బీజేపీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత శ్రీరంగం ఉప ఎన్నికపై ఉత్సాహంతో ఉన్న బీజేపీకి కూటమి నేతలతో మింగుడు పడలేదు. ఎండీఎంకే దూరం కావడం, ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని పీఎంకే ప్రకటించడంతో ఇక మిగిలిన డీఎండీకే చుట్టూ ప్రదక్షిణలు చేయకతప్పలేదు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా, కూటమి నేతల వైఖరివల్ల బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేక పోయింది. పోటీ ఖాయం అయితే బీజేపీ అభ్యర్థా లేక కూటమి అభ్యర్థా అనేది ఇంకా నిర్ణయం జరగలేదని బీజేపీ దాటవేస్తూ వచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ను ఈనెల 21వ తేదీన తమిళిసై, 22వ తేదీన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కలిశారు. విజయకాంత్ వారికి ఏమి హామీ ఇచ్చారో గోప్యంగా ఉంచారు. అభ్యర్థి ఎవరైనా కూటమి పార్టీగా డీఎండీకే మద్దతు తెలపాలని బీజేపీ నేతలు కోరుతుండగా, విజయకాంత్ నోరుమెదపలేదు. నామినేషన్ గడువు దగ్గరపడుతున్న సమయంలో ఇక జాప్యం చేస్తే లాభం లేదని భావించిన బీజేపీ ఐదు పేర్లను పరిశీలించింది. చివరకు తమ పార్టీ నేతైన సుబ్రమణియన్ను రంగంలోకి దించింది. అన్నాడీఎంకేలో బంగారు బహుమతులు శ్రీరంగం ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ చూసిన బూత్ నిర్వాహకులకు బంగారు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 29 మంది మంత్రులతో కూడిన బృందం గురువారం రాత్రి శ్రీరంగానికి చేరుకుంది. వెంటనే సమావేశమై ప్రచార బాధ్యతల నిమిత్తం నియోజకవర్గాన్ని విభజించుకుని రంగంలోకి దిగారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో జయలలితకు 43 వేల ఓట్ల మెజారిటీ రాగా అంతకు మించి మెజార్టీ సాధించాలని పార్టీ ఆదేశించింది. నియోజకవర్గంలో మొత్తం 322 పోలింగ్ బూత్లు ఉండగా, ఓట్ల లెక్కింపులో ఏ బూత్ నుంచి అధికారపార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయో ఆ ప్రాంత ఇన్చార్జ్కు ఒక పౌను బరువున్న బంగారు నాణాన్ని బహుమతిగా ఇస్తామని పార్టీ ప్రకటించింది. పైగా జయ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని ప్రకటించడంతో పార్టీ నేతలు మరింత ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అదే షరతుపై రెండుపౌన్ల బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తానని తిరుచ్చీ జిల్లా కార్యదర్శి మనోహరన్ హామీ ఇచ్చారు. -
‘అమ్మ’ చెంతకు ఫిర్యాదులు
అన్నాడీఎంకే నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు నేరుగా పోయెస్ గార్డెన్కు వెళ్లడమే ఇందుకు కారణం. ఇది వరకు వీటిని ఫిర్యాదుల కమిటీ విచారించేది. ప్రస్తుతం అధినేత్రి జయలలిత చెంతకు వెళ్లడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, చెన్నై: పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చిన్న తప్పు చేసినా, ఆరోపణలు వచ్చినా వారికి ఉద్వాసనలు పలికే రీతిలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయాలు తీసుకోవడం సహజం. అయితే, గత ఏడాది పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని విచారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపంలో జయలలితకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ కమిటీలో మంత్రులు గోకుల ఇందిర, ఉదయకుమార్, నేతలు సెల్వరాజ్, కుమార్ను సభ్యులుగా నియమించారు. ఇన్నాళ్లూ ఈ కమిటీ అన్ని ఫిర్యాదుల్ని పరిశీలించి, నివేదిక రూపంలో జయలలితకు సమాచారం అందించేది. అయితే, జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఎక్కడి ఫిర్యాదులు అక్కడే అన్న చందంగా పడి ఉండడం వెలుగులోకి వచ్చింది. మంత్రులు ఇద్దరు ప్రభుత్వ కార్యక్ర మాల్లో బిజీగా ఉండడం, మిగిలిన ఇద్దరు తమ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉండడంతో ఫిర్యాదులు అన్నాడీఎంకే కార్యాలయంలో పేరుకు పోయినట్టు సమాచారం. అమ్మ చెంతకు పార్టీ కార్యాలయంలో పేరుకుపోయిన ఫిర్యాదులు పోయేస్ గార్డెన్కు చేరినట్టుంది. పార్టీ కార్యాలయానికి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నందున, ఆ ఫిర్యాదుల్ని పోయేస్ గార్డెన్కు జయలలిత తెప్పించుకునే పనిలో పడ్డట్టు వచ్చిన సంకేతాలు అన్నాడీఎంకే వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. జయలలిత శిక్ష నేపథ్యంలో కొందరు నేతలు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించి ఉండడంతో అట్టి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో గతంలో విధించిన కమిటీ కొన్ని చిన్న చిన్న తప్పుల్ని చూసీచూడనట్టు వ్యవహరించిన సందర్భాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఫిర్యాదులు అన్నీ అమ్మ చెంతకు చేరడం, ఆమె వాటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తుండడంతో మరింత ఆందోళన బయలుదేరింది. జయలలిత కారాగారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు చాప కింద నీరులా కొత్త ప్రయత్నాలు చేసినట్టు, మరి కొందరు జయలలిత నెచ్చెలి శశికళ బంధు వర్గానికి దగ్గరగా వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం పన్నీరు సెల్వం ద్వారా జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాంటి ప్రయత్నాలు చేసిన నేతల్లో మరింత ఆందోళన బయలుదేరింది. -
ఆశ... నిరాశ
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ అర్జీ విచారణ సందర్భంగా హైకోర్టు ఎదుట మంగళవారం హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు పెద్దసంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హైకోర్టు ఆవరణంలోకి అనుమతించారు. నగరంలో తమిళులు అత్యధికంగా నివసించే శ్రీరాంపుర, హలసూరు, జీవన్బీమానగర్, ఇందిరానగర్, హెచ్ఎఎల్ పరిసర ప్రాంతాలు, ఐటీఐ గేట్, పులకేశీనగర్, ఎంఎస్పాళ్య, జేపీనగర రెండవ స్టేజ్, జయనగర ఐదు, తొమ్మిదవ బ్లాక్లు, మురగేష్ పాళ్య, దొమ్మలూరు, భారతీ నగర్, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి అదనపు బలగాలను మొహరింపజేశారు. తొలుత హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే జయలలితకు బెయిల్ చిక్కిదంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కోర్టు బయట ఉన్న జయలలిత అభిమానులు ఒక్కసారిగా బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచారు. హొసూరు రోడ్డులోని హొసరోడ్డు జంక్షన్, చందాపుర, అత్తిబెలె తదితర ప్రాంతాల్లోనూ సంబరాలు నిర్వహించారు. ఈ ఉత్సాహం కొద్దిసేపటిలోనే నీరుగారిపోయింది. బెయిల్ నిరాకరణ అయినట్లు తెలియడంతో చెన్నైకు చెందిన సరళ(40) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను అంబులెన్స్లో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. రెండు గంటలకు పైగా అభిమానులు తమ చేతుల్లో జయలలిత చిత్రాన్ని ఉంచుకుని బోరుమని విలపించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా... జయలలితకు బెయిల్ నిరాకరణ కావడంతో హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్కుమార్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం చుట్టూ ఒక కిలో మీటరు వరకు నిషేదాజ్ఞలు విధించారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో టియర్ గ్యాస్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. తమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు హైకోర్టు తీర్పుతో వెంటనే కేఎస్ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని ఉన్న తమ సంస్థకు చెందిన వాహనాలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కేఎస్ఆర్టీసీ బస్సులపై దాడులు చేయవచ్చునన్న అనుమానంతో తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో చెన్నైలో కేఎస్ఆర్టీసీకి చెందిన 150 బస్సులు నిలిచిపోయాయి. తమిళనాడు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బెంగళూరులోకి అనుమతిస్తున్నారు. -
తరగని అభిమానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడినప్పటికీ ఆమె పట్ల అభిమానం చెక్కు చెదరలేదు. అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు జయ అభిమానులు మంగళవారం కూడా పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. పలు సందర్భాల్లో అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆందోళనలు నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు మంత్రులు జయలలితతో సమావేశం కావడానికి వచ్చారు. మరో వైపు రాష్ట్ర హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు ఎదుట గుమికూడారు. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కిక్కిరిసిన కోర్టు హాలు హైకోర్టులోని ఎనిమిదో నంబరు హాలు మంగళవారం జయ అభిమానులతో కిక్కిరిసిపోయింది. జయతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లపై ఈ హాలులో హైకోర్టు సెలవుల ధర్మాసనం న్యాయమూర్తి రత్న కళ విచారణ చేపట్టారు. వీటన్నిటినీ ఒకే సారి విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఇంకా నియమించనందున విచారణను వాయిదా వేశారు. అన్ని పిటిషన్లపై ఏక కాలంలో వాదనలు వింటానని ప్రకటించారు. కాగా కోర్టు హాలు కిక్కిరిసి పోవడంతో జయ న్యాయవాదులు లోనికి వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వ చ్చింది. జయకు బెయిల్ లభించవచ్చనే అంచనాతో వచ్చిన అభిమానులు విచారణ వాయి దా పడడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జేత్మలానీ వాదిస్తున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లతాృకష్ణమూర్తి కూడా కోర్టుకు హాజరయ్యారు. లాడ్జీలన్నీ ఫుల్ జయ అభిమానులతో నగరంలోని చిన్నా చితకా లాడ్జీలన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు సరిహద్దులోనిృకష్ణగిరితో పాటు సేలం, కోయంబత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. జైలులో అమ్మను దర్శించుకోవాలన్న వారి కోరిక ఫలించక పోయినా, వేచి చూస్తున్నారు. ఒక వేళ అమ్మకు బెయిల్ లభిస్తే జయ జయ ధ్వానాలతో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. వాతావరణానికి అలవాటు పడుతున్న జయ జైలు వాతావరణానికి జయలలిత క్రమేపీ అలవాటు పడుతున్నారు. మంగళవారం యథావిధిగా ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి మార్నింగ్కు వెళ్లారు. అనంతరం దిన పత్రికలు చదివి అల్పాహారం సేవించారు. అంతకు ముందు వైద్యులు ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తమిళనాడు మంత్రులు ఒలర్మతి, కుహులేంద్ర, మోహన్, సెంథిల్ బాలాజీ,ృకష్ణమూర్తి ్రృభతులు జైలు వద్దకు వెళ్లినప్పటికీ అమ్మ దర్శన భాగ్యం కలుగలేదు. -
అన్నాడీఎంకేలో ఎన్నికలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో ఎన్నికల సందడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల తేదీ ప్రకటించారు. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ పదవికి ఇతరులెవ్వరు నామినేషన్ దాఖలు చేయరు కాబట్టి, 29న అధికారికంగా జయలలిత ఏకగ్రీవ ఎంపిక ప్రకటన వెలువడనున్నది. గుర్తింపు పొందిన రాష్ట్రీయ, జాతీయ పార్టీల కార్యవర్గాల ఎన్నిక తప్పని సరిగా సంస్థాగత ఎన్నికల ద్వారా చేయాలన్న నిబంధనను ఎన్నికల కమిషన్ విధించింది. ఆ మేరకు కొన్ని పార్టీలు సంస్థాగత ఎన్నికల ద్వారా పదవులు భర్తీ చేస్తుంటే, మరికొన్ని పార్టీలు మొక్కుబడిగా నిర్వహించడం జరుగుతోంది. ఇక, అన్నాడీఎంకే విషయానికి వస్తే పార్టీ నిబంధనల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. ప్రతి ఐదేళ్లకు ఓ మారు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే, జయలలిత దృష్టిలో పడే రీతిలో పెద్ద ఎత్తున నాయకులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా బలపరుస్తూ నామినేషన్లు సమర్పించడం పరిపాటే. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు 25ఏళ్లుగా జయలలిత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకునేందుకు ఎన్నికల నగారాను మోగించారు. ప్రకటన : పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక నిమిత్తం అన్నాడీఎంకే కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జరగనున్న ఎన్నికకు ఎన్నికల అధికారిగా పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుంజెలియన్ వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24వ తేదీ వరకు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 27న నామినేషన్ల పరిశీలన, 28న ఉప సంహరణ ప్రక్రియ జరగనుంది. 29న ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో జయలలిత పదవికి మరెవరు పోటీ చేయడానికి సాహసించ ప్రసక్తే లేని దృష్ట్యా, ఆ తేదీన ఆమె ఏకగ్రీవ ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నికల నామినేషన్ల పర్వం ఆరంభం కావడంతో నేటి నుంచి ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొననుంది. -
ఉపసభాపతి తంబిదురై
న్యూఢిల్లీ: పార్లమెంటులో అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై లోక్సభ ఉప సభాపతిగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి తంబిదురై ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తద్వారా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రెండవసారి ఎన్నికైన తొలి నేతగా రికార్డులకెక్కారు. ఈ పదవికి 67 ఏళ్ల తంబిదురై అభ్యర్థిత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్సహా అన్ని ప్రధాన పార్టీలూ బలపరిచాయి. తొలుత లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు. తంబిదురై పేరును రాజ్నాథ్ ప్రతిపాదించగా, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ మద్దతు తెలిపారు. తంబిదురై అభ్యర్థిత్వానికి ఎన్డీయే కూటమి పక్షాలు, ఇతర పార్టీలు మద్దతు పలికాయి. దీంతో తంబిదురై డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర పార్టీల ఫ్లోర్లీడర్లు తంబిదురైకు అభినందనలు తెలుపుతూ ఆయన్ను కుర్చీ వరకు తోడ్కోని వెళ్లారు. -
త్వరలో ‘అమ్మ’ థియేటర్లు
చెన్నై: నిరు పేదలకు సినిమా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ‘అమ్మ థియేటర్లు’ ఈ ఏడాది డిసెంబరులోగా చెన్నై వాసులకు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో 15 అమ్మ థియేటర్లను నిర్మించనున్నారు. రూ.25 లోపు ధరకే ఏసీ, డిజిటల్ టెక్నాలజీతో కూడిన థియేటర్లను నిర్మించనున్నామని, త్వరలో టెండర్లు పిలిచి డిసెంబరులోగా ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు మేయర్ సైదై దొరస్వామి గురువారం తెలిపారు. -
లంకపై ఆగ్రహం
చెన్నై, సాక్షి ప్రతినిధి: మత్స్యకారుల సమస్యపై తమిళనాడు, శ్రీలంకల మధ్య నెలకొన్న వైరం ఈనాటికి కాదు. భారత్ స్వాధీనంలో ఉన్న కచ్చదీవులను 1974-76ల మధ్య శ్రీలంకకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం తరువాత నుంచి అగ్గిరాజుకుంటూనే ఉంది. చేపల వేటకు కచ్చదీవుల వైపు వెళ్లే తమిళ జాలర్లు శ్రీలంక దాష్టీకానికి గురవుతూనే ఉన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన జయలలిత ఈ అంశంపై నిన్నటి ప్రధాని మన్మోహన్సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్రమోడీ వరకు ఎన్నో లేఖలు రాశారు. ప్రస్తుతం శ్రీలంక జైళ్లలో కొందరు తమిళ జాలర్లు మగ్గుతున్నారు. వీరి పడవలు సైతం స్వాధీనం చేసుకుని ఉన్నారు. రామనాథపురం, జగదాపట్టినం, పుదుక్కొట్టై తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా తమ మరపడవలకు తెల్లజెండాలు కట్టుకుని ఈ నెల 2వ తేదీన కచ్చదీవులకు పయనమవుతామని హెచ్చరిం చారు. ఈ నేపథ్యంలో తమిళ జాలర్ల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జయలలిత రాసిన లేఖలను ప్రేమలేఖలుగా అభివర్ణిస్తూ శ్రీలంక ఆర్మీ తన అధికార వెబ్సైట్లో కార్టూన్ చిత్రం కూడా పొందుపరచడం వివాదానికి దారితీసింది. రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు అమ్మకు దన్నుగా నిలిచి నిరసన వ్యక్తం చేశాయి. మద్రాసు రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికులు సెంట్రల్ సమీపంలోని బస్డిపో వద్ద శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. శ్రీలంక అధ్యక్షులు రాజపక్సే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మహత్యాయత్నం జయలలిత వీరాభిమాని, సేలం అన్నాడీఎంకే మహిళా విభాగ సహాయ కార్యదర్శి విజయలక్ష్మి (52) ఆత్మహత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి 10కి పైగా నిద్రమాత్రలు మింగారు. ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సేలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతికే అవమానం : జయ భారత ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రులను కించపరుస్తూ శ్రీలంక ఆర్మీ వెబ్సైట్లో అటువంటి వ్యాఖ్యలు, బొమ్మలు రావడం మొత్తం జాతికే అవమానంగా భావించాలని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. శనివారం ప్రధానికి మరో లేఖ రాశారు. ప్రజాస్వామ్య పరంగా ఒక సమస్య పరిష్కారం కోసం పీఎంకు సీఎం లేఖ రాయడాన్ని వక్రీకరించడం ఆ దేశ అల్పతనానికి నిదర్శనమన్నారు. జాలర్ల జీవనాధారాన్ని కాపాడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో శ్రీలంక ఇటువంటి చేష్టలకు దిగడాన్ని మొత్తం భారత దేశాన్ని అవమానించినట్లుగా పరిగణించాలని ఆమె కోరారు. 65 ఏళ్ల మహిళా సీఎం పట్ల అపహాస్యమా..అని ఆమె మండిపడ్డారు. భారత్లోని శ్రీలంక రాయబారికి ఈ విషయంపై ఖండనలు పంపాలని, బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేయాలని తాజా లేఖలో ప్రధానిని ముఖ్యమంత్రి జయలలిత కోరారు. -
ఉప్పు కొను.... 'అమ్మా' అను
ఉప్పు తిన్న విశ్వాసం చాలా గట్టిదంటారు. 'మీ ఉప్పు తిన్నాను. ఇక మీ వాడిని' అని అనడం చాలా పాత మాట. తమిళ నాడు ముఖ్యమంత్రి ఉప్పు తినిపించి మరీ ఓటర్ల విశ్వాసం పొందాలనుకుంటున్నారు. అందుకే ఆమె బుధవారం నుంచి తమిళనాట ప్రజలకు చవక ధరకు ఉప్పును అందించబోతున్నారు. ఈ ఉప్పుకు 'అమ్మ ఉప్పు' అని పేరు పెట్టారామె. ఇప్పటికే అమ్మ ఫుడ్ అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది. ఇప్పుడు వీటికి అమ్మ ఉప్పు జత కలిసింది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరుకుతుంది. తమిళ నాట ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అంటారు. కాబట్టి ఈ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. ఇలా ఈ ఉప్పు ప్యాకెట్ తో కార్పొరేషన్ కు స్వామికార్యం, అధికార అన్నా డీఎంకెకి స్వకార్యం సిద్ధిస్తున్నాయి. -
ఎన్డీఏలోకి జయలలిత?
3న ప్రధానితో భేటీ కానున్న తమిళనాడు సీఎం న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కారులో తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే కూడా చేరబోతోందంటూ సాగుతున్న ఊహాగానాల మధ్య.. జూన్ 3న ప్రధాని నరేంద్ర మోడీతో జయలలిత భేటీ కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ జయలలిత ఆ కార్యక్రమానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించేందుకుగాను మోడీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో జయలలిత మంగళవారం సమావేశం కానున్నారని శుక్రవారం రాష్ట్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఆయనతో జయలలిత అధికారికంగా భేటీ కానుండటం ఇదే తొలిసారి. తమిళనాడుకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై విజ్ఞప్తులతో ఆమె ప్రధానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారని తెలిపాయి. కాగా, తమిళనాడులోని 39 లోక్సభ సీట్లలో 37 సీట్లను అన్నా డీఎంకేనే సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంలో చేరే అంశంపై జయలలితతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం, ఆ సభలో 10 మంది సభ్యులు అన్నా డీఎంకేకు ఉండటంతో జయ పార్టీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
తమిళనాట వి‘జయ’విహారం
సాక్షి, చెన్నై: తమిళనాడులో వి‘జయ’విహారం. మొత్తం 39 లోక్సభ స్థానాలకు గానూ 37 సీట్లను గెలుచుకుని ఏఐఏడీఎంకే పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఒక స్థానంలో బీజేపీ, మరో స్థానంలో పీఎంకే గెలుపొందాయి. అంటే, వచ్చే అయిదేళ్లపాటు తమిళనాడు నుంచి డీఎంకే లేదా కాంగ్రెస్ పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉండదు. 2009 ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఈ విజయంతో ఏఐఏడీఎంకే లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ల తరువాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో ఈ పార్టీ 44.4% ఓట్లను సాధించింది. ‘ఇది మునుపెన్నడూ లేని, సాటిలేని, చారిత్రాత్మక విజయం. ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఈ విజయం సాధించాం’ అని విజయానంతరం పార్టీ అధినేత్రి జయలలిత వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని కానున్న మోడీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలయ్యాయి. -
‘మూడు’ ఆశలు గల్లంతు!
మోడీ గాలికి చతికిలబడిన కూటమిలోని పార్టీలు చావుదెబ్బతిన్న ఎస్పీ, జేడీయూ, డీఎంకే సత్తా చాటుకున్న జయ, నవీన్ పట్నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: మోడీ సృష్టించిన పెనుగాలికి మూడో కూటమి ఆశలు కొట్టుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో బలీయమైన శక్తిగా ఎదిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కూటమిలోని పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం అంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీయూ తదితర 11 పార్టీలు కలసి ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలోని సీపీఎం గతంతో పోలిస్తే సగం స్థానాలను కోల్పోయి 9కిపరిమితం కాగా, సీపీఐ ఖాతానే తెరవలేదు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ధాటికి కమ్యూనిస్టులు చేతులెత్తేశారు. ఆర్ఎస్పీ ఒక స్థానంతో సరిపెట్టుకోగా, ఫార్వర్డ్ బ్లాక్, అస్సాం గణపరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా విజయానికి దూరంగా ఉండిపోయాయి. డీఎంకే 18 సిట్టింగ్ స్థానాల్లో 17 చోట్ల ఓటమితో చావు దెబ్బతిన్నది. ఈ పారీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మూడో కూటమి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చిన ములాయం సింగ్ యాదవ్కు చెందిన ఎస్పీ కూడా 5 స్థానాల దగ్గరే ఆగిపోయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీ 23 స్థానాలను దక్కించుకోవడం గమనార్హం. ములాయం, ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్ చేసిన విమర్శలు మోడీ మంత్రాంగం ముందు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ప్రధాని పీఠంపై కన్నేసిన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆశ కూడా అడియాశే అయింది. మోడీతో విభేదించి, బీజేపీతో దీర్ఘకాలిక మిత్ర బంధాన్ని కాలదన్ని ఒంటరి పోరుకు వెళ్లిన జేడీయూ బీహార్లో రెండే స్థానాలకు పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీకి 20 ఎంపీ సీట్లు లభించాయి. బీజేపీతో దూరం అయినందుకు జేడీయూ మూల్యాన్ని చెల్లించుకుంది. కూటమిలోని అన్నాడీఎంకే, బీజేడీ మాత్రమే చక్కటి విజయాలను నమోదు చేశాయి. ప్రధాని పదవిని ఆశించిన జయలలితకు తమిళనాడులో ఓటర్లు ఘన విజయాన్ని అందించారు. 2009 ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకు కేవలం 9 సీట్లకే పరిమితమైన జయ... ఈ ఎన్నికల్లో 37 ఎంపీ సీట్లు రాబట్టుకున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మొత్తం 21 స్థానాలకు గానూ 17 ఎంపీ స్థానాలను రాబట్టుకుంది. ఇక మూడో కూటమిలో చేరాలనుకున్న పార్టీల్లో బీఎస్పీ గత ఎన్నికల్లో 21 స్థానాలతో అగ్రస్థానంలో ఉండగా... ఈ సారి మోడీ హవాతో ఒక్క స్థానంలోనూ విజయం దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్ మాత్రమే చెప్పుకోతగినన్ని స్థానాలను గెలుచుకుంది. -
ఎన్డీయేకు మద్దతివ్వం: డీఎంకే
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని ఇతర పార్టీలను బీజేపీ ఆహ్వానించిన నేపథ ్యంలో పొత్తులపై చర్చ తీవ్రమైంది. ఎన్డీయేకు మద్దతిచ్చే విషయంలో బీజేడీ, అన్నాడీఎంకే బాటలోనే టీఆర్ఎస్ సాగుతోంది. ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి సహకరించే కూటమికే మద్దతిస్తామని, ఈ విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని ఆ పార్టీ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఫలితాలను బట్టి ఎన్డీయేకు మద్దతుపై పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు చెందిన డీఎంకే మాత్రం తాము ఎన్డీయే పక్షాన నిలిచేది లేదని తేల్చి చెప్పింది. గుజరాత్ అల్లర్లతో మచ్చ తెచ్చుకున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమిళనాడులో మైనారిటీలు తమకు అండగా ఉన్నారని, రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా తాము ఎన్డీయేకు మద్దతివ్వలేమని ఆ పార్టీ నేత ఇలంగోవన్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. బీజేపీకి అధికారం దక్కకుండా చూసేందుకు లౌకికవాద పార్టీలన్నీ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఈశాన్య పార్టీల కూటమి మద్దతు: కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వివిధ పక్షాలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పదిపార్టీల ప్రాంతీయ కూటమి (ఎన్ఈఆర్పీఎఫ్) బీజేపీకి మద్దతు ప్రకటించింది. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వంకోసం తమ కూటమి బీజేపీకి మద్దతు ఇస్తుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫూ రియో తెలిపారు. -
అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ
తిరువొత్తియూరు, న్యూస్లైన్: నాగపట్నం సమీపంలో ఎన్నికల కక్షల కారణంగా అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఆరుగురు కత్తిపోట్లకు గురయ్యారు. నాగపట్టణం, కొల్లిడం, పాలూరాన్ పడుగైకు చెందిన లండన్ అన్బళగన్ (50). పీఎంకే నాయకుడు ఇతను అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నాయకుడు దయాలన్ (50) మధ్య ఎన్నికలకు సంబంధించి పాత కక్షలు ఉన్నాయి. దయాలన్కు చెందిన తాటాకుల కొట్టం బుధవారం రాత్రి నిప్పు అంటుకుని దగ్ధమైంది. దీనికి కారణం అన్బళగన్ అని దయాలన్ అనుమానించాడు. ఈ క్రమంలో దయాలన్ అతని సహోదరుడు శంకర్, బంధువులు, తిరుజ్ఞానం అరుణ్, ప్రభాకరన్, అళగు, కన్నన్, చక్రపాణి మారణాయుధాలు తీసుకుని అన్బళగన్ ఇంటిలోకి చొరబడి అక్కడున్న వస్తువులు ధ్వంసం చేశారు. అన్బళగన్, భార్య కవిత, చెల్లెలు తమిళరసిలపై దాడి చేశారు. ఈ ఘటనలో అన్బళగన్కు గాయాలయ్యాయి. అతన్ని పుదుచ్చేరి బిమ్స్ ఆస్పత్రికి తరలించా రు. అన్బళగన్ వర్గం వారు చేసిన దాడిలో ప్రత్యర్థి వర్గానికి చెందిన తిరుజ్ఞానం, శంకర్, అరుల్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చిదంబరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కొల్లిడం పోలీసులు ఇరు వర్గానికి చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
కూవం ప్రక్షాళన
రూ.3,833 కోట్లతో కార్యాచరణ సిద్ధం తీరవాసులతో చర్చలు సాక్షి, చెన్నై: కూవం నది ప్రక్షాళనకు మళ్లీ కార్యాచరణ సిద్ధం అయింది. రూ.3,833 కోట్లతో అంచనా రూపొందించా రు. తీరవాసులతో చర్చలు జరిపి ఆక్రమణల తొలగిం పునకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. అరక్కోణం సమీపంలోని తక్కోళం కేశవరం నుంచి మొదలయ్యే కూవం నది అనేక పాయలుగా చీలి కోయంబేడు వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఈ కూవం పరివాహక ప్రాంతంలో 82 చెరువులు, 13,575,93 హెక్టార్ల ఆయకట్టు భూములు ఉండేవి. ఈ ప్రాంతాల్లో అరన్వెయిల్, కొరట్టూరు, కన్నన్ పాళెం, ఆయిల్చెడి, పర్తిపట్టుల వద్ద ఆనకట్టలు సైతం నిర్మిం చారు. తక్కోళం కేశవరం నుంచి 72 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. చెన్నై మహానగరంలో మాత్రం 17.98 కిలోమీటర్ల మేరకు ప్రవహించి చివరకు నేప్పియర్ వంతెన వద్ద సముద్రంలోకి కలుస్తున్నది. వర్షాకాలంలో అయితే, ఈ నది మరీ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది. అన్యాక్రాంతం: కాలక్రమేణా ఈ నది పరివాహక ప్రాం తాలు అన్యాక్రాంతం కావడంతో ప్రస్తుత నది వెడల్పు సగానికి సగం తగ్గిపోరుుంది. ఈ ప్రాంతాల్లో వెలసిన ఇళ్లు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు, చెత్తా చెదారం నదిలో కలవడంతో కూవం కాస్త మురికి కూపంగా మారింది. ఈ మురుగునీరు ప్రవహిస్తుండడంతో నగరంలో అనేక ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. కూవం మురికి కూపం కారణంగా బకింగ్హామః కాల్వ, ఓట్టేరి కాల్వలు సైతం మురికి నీటి కాల్వలుగా మారాయి. స్వచ్ఛతను కోల్పోయిన ఈ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఒకప్పుడు రాష్ర్టంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ పథకాన్ని తమ భుజాన వేసుకునే పనిలో డీఎంకే పడింది. తేమ్స్ నదీ తరహాలో ఈ కూవంను తీర్చిదిద్దుతామని కార్యచరణ సిద్ధం చేశారు. సింగపూర్, లండన్లకు వెళ్లి మరీ అక్కడి నదుల అభివృద్ధిని పరిశీలించి వచ్చారు. పనులు ఆరంభించారు. కోట్లాది రూపాయల నిధులను వెచ్చించారు. అయితే, రాష్ట్రంలో అధికారం మారడంతో ఆ పథకాన్ని అన్నాడీఎంకే తుంగలో తొక్కింది. మళ్లీ ప్రక్షాళనకు కార్యాచరణ: కూవం నదిని తాము సుందరంగా తీర్చిదిద్దుతామంటూ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం జయలలిత మాట్లాడుతూ, కూవం పనుల్ని సరి కొత్త తరహాలో చేపట్టనున్నామని, గత ప్రభుత్వం సిద్ధం చేసిన వాటిని పక్కన పెడుతున్నామని ప్రకటించారు. అదే సమయంలో ఎక్స్ప్రెస్ వే పనులకు బ్రేక్ వేయడానికి నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కూవం ప్రక్షాళన నినాదాన్ని అందుకుంది. కూవం నదిని అభివృద్ధి పరచబోతున్నామని, ఈ తీరంలో ఆ ఎక్స్ప్రెస్ వే వద్దన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించి చివరకు కోర్టులో భంగపడాల్సి వచ్చింది. ఎలాగైనా కూవం నది ప్రక్షాళన చేపట్టాలన్న లక్ష్యానికి ప్రభుత్వం రావడంతో డీఎంకే పథకాన్ని పక్కన పెట్టి, కొత్త పథకానికి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పనులను కాస్త పక్కన పెట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో అధికారులు పనుల్లో బిజీగా ఉన్నారు. కూవం నది ప్రక్షాళన ఫైల్ను దుమ్ము దులిపేశారు. ప్రక్షాళన చేపట్టాల్సిన పనులతో కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. రూ.3,833 కోట్లతో పనులు: రెండేళ్లలో ఈ నది ప్రక్షాళన లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందు కోసం రూ.3,833 కోట్లతో అంచనా వ్యయం సిద్ధం చేశారు. కూవం నదీ తీరంలో అక్కడక్కడ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం, మరికొన్ని చోట్ల సుందరంగా తీర్చిదిద్దడం, తీరం వెంబడి చెట్లను పెంచడం, కూవం నదీ తీరంలో పూడిక తీత, మురికి నీరు శుద్ధీకరణ తదితర పనులకు నిర్ణయించారు. అన్యాక్రాంతమైన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. చెన్నై నగరంలోని తీరం వెంబడి ఉన్న గుడిసెలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాల్ని లేదా ఇళ్లను కేటాయించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఫలితాల లెక్కింపు అనంతరం తీర వాసులతో చర్చలు, అభిప్రాయాల సేకరణకు ప్రజా పనుల శాఖ నిర్ణయించి ఉన్నది. -
‘జయ’కేతనమే..!
* తమిళనాట అధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే! * రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ హోరాహోరీ * కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గల్లంతే సి. నందగోపాల్, సాక్షి ప్రతినిధి-చెన్నై: తమిళనాడులో ప్రచార హోరు మంగళవారం నాటితో ముగిసింది. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక స్థానం కలుపుకొని, మొత్తం 40 స్థానాలకు గురువారమే పోలింగ్ జరగనుంది. తాజా అంచనాల ప్రకారం తమిళనాట ‘జయ’కేతనమే రెపరెపలాడనుంది. అత్యధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే చేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. ప్రజాబలం ఉందనే ధైర్యంతో అన్నాడీఎంకే ఒంటరిగానే బరిలోకి దిగింది. అధికార పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయమనే ధీమాతో కొన్ని చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని డీఎంకే రంగంలోకి దిగింది. మరోవైపు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు లేని బలమైన కూటమిని బీజేపీ ఏర్పాటు చేసుకోగలిగింది. ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు చివరిక్షణం వరకు కాంగ్రెస్ విఫలయత్నాలు చేసింది. చిన్న పార్టీలు సైతం కాంగ్రెస్ను కన్నెత్తి చూడకపోవడంతో గత్యంతరం లేక ఒంటరి పోరాటానికే సిద్ధపడింది. నలభై మనవే... ‘అమ్మ’ ఆత్మవిశ్వాసం అభ్యర్థుల జాబితా ప్రకటన మొదలుకొని, ప్రచార ప్రారంభం వరకు అన్నింటా ముందంజలో ఉన్న అన్నాడీఎంకే అధినాయకురాలు, ముఖ్యమంత్రి జయలలిత ‘నాళై నమదే... నార్పదుం నమదే’ (రేపు మనదే... నలభై స్థానాలూ మనవే) నినాదంతో కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. ప్రధాని పీఠమే లక్ష్యంగా ప్రచారం ప్రారంభించిన ఆమె, ప్రతి ప్రచారవేదికను ఎర్రకోటను లేదా పార్లమెంటు భవనాన్ని నమూనాగా చేసుకున్నారు. తొలిరోజుల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే ప్రాభవమే కనిపించింది. బీజేపీ, డీఎంకే కూటములు సైతం ప్రచారం ప్రారంభించడంతో పరిస్థితులు మారాయి. అన్నాడీఎంకే అంతర్గత అంచనా 30 నుంచి 20-25 స్థానాలకు పడిపోయింది. అన్నాడీఎంకేకు జయలలిత మాత్రమే ఏకైక స్టార్ క్యాంపెయినర్ కావడం ప్రతిబంధకంగా మారింది. డీఎంకేకు ఇంటిపోరు ప్రభావం అంతంత మాత్రమే... డీఎంకే 35 స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, 5 స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. డీఎంకే అధినేత కుమారుడు అళగిరి తొలుత ఇబ్బందులు సృష్టించినా, దాని ప్రభావం కేవలం మధురకే పరిమితమైంది. కరుణానిధి 90 ఏళ్ల వార్ధక్యాన్ని సైతం లెక్క చేయకుండా, తన వాగ్ధాటితో ఓటర్లను కొంతవరకు ఆకట్టుకోగలిగారు. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, సినీనటి ఖుష్బూ వంటి స్టార్ క్యాంపెయినర్ల బలం కూడా డీఎంకేకు తోడైంది. అయితే, ‘అవినీతి’ మరకలున్న కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్, రాజాలను బరిలో నిలపడం ద్వారా కరుణానిధి ప్రతిష్ట మసకబారింది. అయినా, డీఎంకే కూటమికి 6-9 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో శక్తిగా ‘కాషాయ’కూటమి ఎన్నికలకు రెండు మూడు నెలల కిందటి వరకు తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండేది. బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడం, రాష్ట్రంలో ఆయన వరుసగా ప్రచార సభలు నిర్వహించడంతో ఆ పార్టీ పుంజుకుంది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే మినహా ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే వంటి ప్రాంతీయ పార్టీలన్నీ వరుసగా బీజేపీ కూటమిలో చేరాయి. దీంతో బీజేపీ కూటమి రాష్ట్రంలో మూడో శక్తిగా మారింది. బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితమై, ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మోడీ ప్రభావంతో పాటు మిత్రపక్షాల నేతలైన విజయకాంత్, వైగో, డాక్టర్ రామదాస్లకు స్థానికంగా గల ప్రాబల్యమూ ఈ కూటమికి కలసి వచ్చే అంశమే. మరోవైపు సూపర్స్టార్ రజనీకాంత్తో మోడీ భేటీ కూడా ఈ కూటమికి సానుకూలత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరేడు స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు ఒక్కసీటైనా అనుమానమే... డీఎంకేతో పొత్తు పెట్టుకుని యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కడమైనా అనుమానమే. ఓటమి తథ్యమయ్యే పరిస్థితుల కారణంగా కేంద్ర మంత్రులు చిదంబరం, నాచియప్పన్, జీకే వాసన్లు పోటీకి దూరంగా ఉన్నారు. చిదంబరం తన కుమారుడిని బరిలోకి దించారు. యూపీఏ రెండు ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రి పదవులను దక్కించుకున్న డీఎంకే అధినేత కరుణానిధి, శ్రీలంక అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేశారు. దీంతో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రులు, తమ పార్టీ అభ్యర్థులు దయానిధి మారన్, రాజాలు నిర్దోషులని, అసలు దోషి ప్రధానేనని చెప్పుకొనేందుకు కరుణానిధికి అవకాశం కలిగింది. రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను కాంగ్రెస్ అడ్డుకోవడం కూడా బెడిసికొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్కు ఒక్కస్థానమైనా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆటలో అరటిపండులా వామపక్షాలు రెండూ చెరో తొమ్మిది స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. -
ఆ పార్టీలకు విమర్శించే అర్హత లేదు
వేలూరు, న్యూస్లైన్: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రధానిని విమర్శించే అర్హత లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం అన్నారు. వేలూరు జిల్లా అరక్కోణం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్కు మద్దతుగా ఆర్కాడులో ఆయన ప్రచార సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలనను అందించిందన్నారు. అయితే రాష్ట్ర పార్టీలు ఏవైనా ఏనాటికీ దేశాన్ని పరిపాలించే అవకాశం ఉండదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ ప్రజల కోసం పాటు పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. పదేళ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆర్ఎస్ఎస్ బినామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో నరేంద్రమోడి గాలి వీస్తోందని పలు పార్టీలు చెబుతున్నాయని, అయితే రాష్ట్ర ప్రజలకు నరేంద్రమోడి ఎవరనేది తెలియదనే విధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరని కొన్ని ప్రాంతాల్లో చెబుతున్నారని, కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ పార్టి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సంక్షేమ పథకాలను గుర్తించుకుని ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోర్టుకు అమ్మ డుమ్మా
ఆదాయపు పన్ను కేసు విచారణ వాదనలు విన్న న్యాయమూర్తి 28న జయ, శశి హాజరు కావాలని ఆదేశం చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి కోర్టు వాయిదాకు డుమ్మా కొట్టారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె నెచ్చెలి శశికళ సైతం హాజరుకాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 40 స్థానాలపై గురిపెట్టిన అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే తలవని తలంపుగా ఆమెకు ఇదే సమయంలో కోర్టు కేసులు, వాయిదాలు చుట్టుముట్టాయి. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో సాగుతున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఈనెల 3న విచారణకు వచ్చింది. అదే రోజున చెన్నైలోని ఎగ్మూరు కోర్టులో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు కేసు వెంటాడింది. శశి ఎంటర్ప్రైజస్ పేరున జయలలిత, శశికళ భాగస్తులుగా ఒక సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై 1991-94 మధ్య వారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో ఆదాయపు పన్ను శాఖ జయ, శశిలపై కేసు నమోదు చేసింది. గత 15 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుతూ ఎగ్మూరు, హైకోర్టు సుప్రీం కోర్టుల్లో జయ, శశి వరుసగా వేసిన పిటిషన్లకు అన్ని న్యాయస్థానాల్లోనూ చుక్కెదురైంది. పైగా ఈ కేసుకు 4 నెలల్లోగా ముగింపు పలకాలని గత నెలలో సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో గతనెల 20వ తేదీన, ఆ తరువాత ఈనెల 3వ తేదీన కేసు విచారణకు వచ్చింది. రెండు సార్లూ జయ హాజరుకాలేదు. సుప్రీం ఆదేశాలకు కట్టుబడి కేసు ముగింపునకు కక్షిదారులు సహకరించడం లేదంటూ ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదాలపై వాయిదాలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 10వ తేదీ నాటి వాయిదాకు జయ, శశి హాజరుకావాలని న్యాయమూర్తి మూడో తేదీన ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం ఎగ్మూరు కోర్టుకు జయ, శశికళ మళ్లీ గైర్హాజరయ్యూరు. 4 నెలల గడువు కోరుతూ సుప్రీంలో తాము వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందని జయ తరపున హాజరైన న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి దక్షిణామూర్తి కేసు విచారణను ఈనెల 28 వ తేదీకి వాయిదా వేశారు. అప్పటికి పోలింగ్ కూడా ముగిసిపోతున్నందున జయ, శశి ఇద్దరూ వాయిదాకు హాజరుకావాలని ఆదేశించారు. -
జయతోనే అభివృద్ధి సాధ్యం
పళ్లిపట్టు, న్యూస్లైన్: జయలలితతోనే అభివృద్ధి సాధ్యమని హాస్య నటుడు సెంథిల్ పేర్కొన్నారు. లోక్సభ అన్నాడీఎంకే అభ్యర్థి హరికి మద్దతుగా గురువారం అరక్కోణంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జయల లిత అవినీతికి పాల్పడినట్లు డీఎంకే నిర్వాహకు లు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కరుణ కుటుంబసభ్యులు ఏమి చేసి కోట్ల ఆస్తి కూడబెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జయలలితపై నింద మోపి రాజకీయ లబ్ధిపొందాలనే ఆలోచనతో చే స్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దేశంలో సమస్యలు అధికమించి ప్రజాపాలన అందించే సత్తా జయలలితకు మాత్రమే ఉందన్నారు. ప్రజలు అన్నాడీఎంకేను గెలిపించి జయలలితను ప్రధానిమంత్రి చేయాలని కోరారు. -
జయ వైఫల్యాలే విజయ సోపానాలు
కనిమొళి ఇంటర్వ్యూ సి. నందగోపాల్ - సాక్షి, చెన్నై: తమిళనాడులో తొలి ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన డీఎంకేకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయాల్లో ‘ప్రాంతీయ’ ప్రాభవానికి ప్రాణం పోసిన డీఎంకేదే. కరుణానిధితో తలెత్తిన విభేదాలతో బయటకు వచ్చిన ఎంజీఆర్ స్థాపించిన అన్నా డీఎంకేకు ప్రేరణ డీఎంకేనే. పార్టీ అధినేత కరుణానిధి జీవించి ఉండగానే, సారథ్య వారసత్వం కోసం ఆయన తనయులు అళగిరి, స్టాలిన్ బహిరంగంగా కీచులాడుకోవడం తెలిసిందే. అన్నదమ్ములిద్దరి మధ్య వారథిగా మారిన ముద్దుల చెల్లెలు కనిమొళి డీఎంకే పగ్గాలను చేపట్టే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలూ ఉన్నాయి. పార్టీపరంగా, కుటుంబపరంగా కీలకపాత్ర పోషిస్తున్న కనిమొళి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.. ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలే తమకు విజయ సోపానాలుగా మారనున్నాయని కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయని, తమిళనాడుకు రావాలంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆమె అన్నారు. విద్యుత్ సంక్షోభానికి గత డీఎంకే ప్రభుత్వమే కారణమని జయలలిత చేస్తున్న ఆరోపణలను కనిమొళి తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి పలు కొత్త విద్యుత్ పథకాలను ప్రారంభించారని, అన్నా డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటైనా పూర్తి చేసిందేమో చెప్పాలని ప్రశ్నించారు. జయ సర్కారు కొత్త పథకాలు చేపట్టకపోగా, గతంలో డీఎంకే సర్కారు ప్రారంభించిన వాటిని అటకెక్కించారని ఆరోపించారు. జయలలితకు అనుకూలంగా వచ్చిన సర్వే ఫలితాలను సైతం కనిమొళి తోసిపుచ్చారు. ఎన్నికల ప్రకటన వెలువడిన మొదట్లో అన్నాడీఎంకే 39 స్థానాలు గెలుచుకుంటుందనే అంచనాలు వెలువడ్డాయని, తర్వాత 20-18 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెప్పాయని అన్నారు. అయితే, తన తండ్రి కరుణానిధి ప్రచారం ప్రారంభించిన తర్వాత సీన్ మారిపోయిందని, 18 కంటే తక్కువ స్థానాలతోనే జయలలిత సరిపెట్టుకోక తప్పదని అన్నారు. కోటీశ్వరులకే టికెట్లు కట్టబెట్టారన్న ఆరోపణలనూ ఆమె కొట్టి పారేశారు. అభ్యర్థుల్లో కొందరు ధనవంతులు ఉండి ఉండవచ్చని, అయితే, ప్రజాజీవితంలో మమేకమై, మంచి నేపథ్యం గల కొత్త వారికే టికెట్లు ఇచ్చామని చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసును ప్రస్తావించగా, అవినీతి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని, నిజం నిలకడగా తేలుతుందని అన్నారు. జయలలితపైనా బెంగళూరు కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని, అయినా, ఎవరు ఎలాంటి వారో ప్రజల కు తెలుసునని అన్నారు. శ్రీలంక తమిళుల వ్యవహారంలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల తీర్మానానికి రెండుసార్లు మద్దతు పలికిన భారత్, ఇప్పుడు బహిష్కరించిందన్నారు. యూపీఏలో తాము కొనసాగినప్పుడు తమ ఒత్తిడితో మద్దతునిచ్చిన కేంద్రం, తాము వైదొలగామనే ధీమాతో బహిష్కరించిందని ఆరోపించారు. శ్రీలంక తమిళుల సమస్యలపై డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని కనిమొళి స్పష్టం చేశారు. తన ఇంటికి అళగిరి రావడంపై మాట్లాడుతూ, ఒక చెల్లిగా ఆయన తనను కలుసుకున్నారన్నారు. ఇటీవల తన కు కొంత అనారోగ్యం చేసిందని, అందుకే తనను పరామర్శించడానికి ఆయన ఇంటికి వచ్చారని, తాము రాజకీయాలేమీ మాట్లాడుకోలేదని చెప్పారు. -
అన్నాడీఎంకేతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
వేలూరు, న్యూస్లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని వేలూరు పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ తెలిపారు. శనివారం ఉదయం నియోజక వర్గం లోని మేల్ మనూర్, కీల్ మనూర్, పొయిగై, అమ్ముండి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మూడేళ్ల అమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పలు సంక్షేమ పథకాలను పొందారని వీటిని ప్రతి ఓటరు గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోను సిమెంట్ రోడ్లు, తాగునీటి ట్యాంకర్లున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి జయలలితనే కారణమన్నారు. ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఎన్నో ఉచిత హామీలిస్తుంటారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాష్ట్ర, గ్రామీణాభివృద్ధిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ ధర్మలింగం, జిల్లా జాయింట్ కార్యదర్శి మునెమ్మ, ఆవిన్ పాలడెరుురీ చైర్మన్ వేలయగన్, సర్పంచ్ సెల్వి, మాజీ కౌన్సిలర్ జిజిఆర్ రవి, కాట్పాడి యూనియన్ చైర్మన్ రాజ, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు. -
స్టాలిన్తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్కుమార్ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. -
అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్గా మార్చిందని విమర్శించారు. వేలూరు, న్యూస్లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు. గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రచార హోరు
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలందరూ సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. జాతీయ పార్టీల నాయకులు సైతం రాష్ట్రంలో ప్రచారాలకు సిద్ధమయ్యారు. మదురై ఆధీనం అరుణగిరినాథర్ సైతం ప్రచార బాట పట్టారు. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 లోక్సభ స్థానాల్లో ప్రచారం హోరెత్తుతోంది. పుదుచ్చేరిని పక్కన బెడితే రాష్ట్రంలోని 30 స్థానాలకు పంచముఖ సమరం నెలకొంది. అన్నాడీఎంకే ఒంటరిగాను, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగంలతో కలసి కూటమిగా డీఎంకే ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. సీపీఎం, సీపీఐలు కలసికట్టుగా, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే, కొంగు పార్టీలతో కలసి బీజేపీ నేతృత్వంలో ఓ కూటమి బరిలోకి దిగి ఉంది. ఇక కొన్నేళ్ల అనంతరం రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడింది. అన్ని పక్షాలు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు మాత్రం చెరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పార్టీలు పూర్తి స్థాయిలో జాబితాల్ని ప్రకటించాయి. ప్రచార హోరు: ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్ల ను ఆకర్షించడం లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఓపెన్ టాప్ జీపులకు భలే డిమాండ్ ఏర్పడింది. కొన్ని చోట్ల ఇంటింటా ప్రచారం సాగిస్తు న్నా, మరి కొన్ని చోట్ల రోడ్ షోల రూపంలో అభ్యర్థులు ప్రచారాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో, ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని లేదా, రెండేసి ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వస్తున్నారు. నేతల బిజీ : అభ్యర్థులు ఓ వైపు ప్రచారంలో దూసుకెళుతుంటే, మరో వైపు ఆయా పార్టీల నాయకులు సైతం ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అందరి కంటే ముందుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ రోజుకు రెండు లోక్సభ నియోజక వర్గాల చొప్పున ఆమె ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. హెలిపాడ్ల నుంచి రోడ్ షోల రూపంలో బహిరంగ సభల వేదికకు వచ్చే ఆమె కేంద్రంలోని కాంగ్రెస్, రాష్ట్రంలోని డీఎంకే పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక, బీజేపీ కూటమి తరపున డీఎండీకే అధినేత విజయకాంత్, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రచారంలో ముందున్నారు. వేర్వేరుగా ఈ ఇద్దరు ఓ పెన్ టాప్ వాహనాల ద్వారా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ కన్యాకుమారి నుంచి ప్రచారంలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత కరుణానిధి సైతం రెండు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ తాను పోటీచేస్తున్న కన్యాకుమారిలో ఓటర్లను ఆకర్షిస్తునే, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోజు మార్చి రోజు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు రామకృష్ణన్, టీ పాండియన్లు తాము పోటీ చేస్తున్న చెరో తొమ్మిది స్థానాల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఎండీఎంకే అధినేత వైగో తాను విరుదునగర్లో పోటీ చేస్తున్నప్పటికీ, అక్కడి బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించి, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షో రూపంలో ప్రచారంలో దూసుకె ళ్తున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సినీ నటులు ప్రచారంలో ఉరకలు తీస్తుంటే, మదురై ఆధీనంలోని అరుణగిరి నాథర్ అన్నాడీఎంకేకు మద్దతుగా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రచారం నిర్వహించే పనిలో ఉన్నారు. అన్నాడీఎంకే కు మద్దతుగా ఎస్ఎంకే నేత, నటుడు శరత్కుమార్ ప్రచార బాట పట్టారు. జాతీయ నాయకులు: రాష్ట్ర పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకెళ్తోంటే, జాతీయ పార్టీలు సైతం ప్రచారాలకు సిద్ధం అయ్యాయి. 18 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ పన్నెండు నుంచి కారత్, 19 నుంచి సీతారాం ఏచూరీ మూడు రోజుల పాటుగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, ఏపీ బర్దన్ ప్రచారానికి సిద్ధం అవుతోంటే, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి నాలుగు చోట్ల ప్రచార సభల్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం రూపొంది స్తోంది. బీజేపీ నేత నరేంద్ర మోడీ సభలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు. భానుడి దెబ్బ: వేసవి కాలం కావడంతో ప్రచారానికి భానుడు అడ్డంకిగా మారుతుండడంతో ఉదయాన్నే తమప్రచారానికి శ్రీకారం చుట్టేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రచారాన్ని ముగించుకుని, మళ్లీ సాయం సంధ్య వేళ ప్రచార బాట పట్టే పనిలో అభ్యర్థులు, నాయకులూ ఉన్నారు. -
వామ్మో కాంగ్రెస్ టికెట్టా!
చెన్నై, సాక్షి ప్రతినిధి :కాంగ్రెస్ టికెట్పై పోటీనా వద్దు బాబోయ్ అంటున్నారు కేంద్ర మంత్రులు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ సైతం ప్రాంతీయ పార్టీల గొడుగు కిందే కొనసాగుతోంది. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. బలహీనంగా ఉన్న బీజేపీ బలమైన కూటమిని ఏర్పరుకుంది. డీఎంకేతో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2 కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. జాతీయ స్థాయిలో అనేక అప్రతిష్టలు మూటగట్టుకున్న ఫలితంగా కాంగ్రెస్తో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇక తప్పని సరై కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ, డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ నలిగిపోయే కంటే పోటీకీ దూరంగా ఉంటేనే మేలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ బడా నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. అధిష్టానం వద్ద తనకున్న పరపతిని ఉపయోగించిన కేంద్ర మంత్రి చిదంబరం సైతం చల్లగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు కార్తీని బరిలో నిలిపారు. సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం హుకుం జారీచేయడంతోపాటు ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్ ఖరారుచేసి జాబితాలో చేర్చింది. వద్దు వద్దంటున్నా వినిపించుకోని అధిష్టానం వైఖరితో మింగుడు పడని సిట్టింగ్ ఎంపీలు బలవంతంగానే బరిలోకి దిగుతున్నారు. జీకే వాసన్కు తప్పని పోరు రాష్ట్ర కాంగ్రెస్లో భిన్న ధృవాలైన కేంద్ర మంత్రులు చిదంబరం, జీకే వాసన్ ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే ప్రకటించారు. పోటీ విషయంలో సిట్టింగ్ ఎంపీల పట్ల నిఖార్సుగా వ్యవహరించిన అధిష్టానం చిదంబరం పట్ల మెతకవైఖరిని అవలంబించింది.ప్రచారానికే పరిమితం కానున్నట్లు జీకే వాసన్ ప్రకటించుకున్నారు. అధిష్టానం అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుని హోదాలో నౌకాయానశాఖా మంత్రిగా పదవిని అనుభవించిన వాసన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రాష్టంలో 39 లోక్సభ స్థానాలకు గాను 37 చోట్ల అభ్యర్థుల జాబితా వెల్లడైంది. దక్షిణ చెన్నై, విల్లుపురం స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దక్షిణ చెన్నై నుంచి జీకే వాసన్ను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్న ట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వాసన్ అంగీకరించని పక్షంలో జాబితాలో మార్పు చేసైనా అతన్ని పోటీలో నిలపాని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అధిష్టానం ఆదేశాలకు వాసన్ తలొగ్గుతారా, పార్టీలోని తన ప్రత్యర్థి చిదంబరంను మినహాయించి తనను మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వాదించి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. మూడో జాబితాలో నలుగురు రాష్ట్రంలోని 39 స్థానాల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న కాంగ్రెస్ ఇప్పటికి రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 30 మంది, మలి విడతలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. తాజాగా బుధవారం విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురి పేర్లను వెల్లడించింది.ఉత్తర చెన్నై నుంచి బీజూ సాక్కో, కృష్ణగిరి నుంచి డాక్టర్ సెల్వకుమార్, కరూరు నుంచి జ్యోతిమణి, కన్యాకుమారి నుంచి వసంతకుమార్ పోటీ చేయనున్నారు. మూడో జాబితాతో 37 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తవగా, మరో రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పుస్తకాలు సీజ్ యూపీఏ పాలనలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన పుస్తకాలను ఫ్లరుుంగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కేరళ రాష్ట్రం కొట్టాయం లోక్సభ స్థానం నుంచి జోస్ కే మానిక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయాలను వివరిస్తూ తమిళనాడులోని శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా 17 లక్షల పుస్తకాలను ముద్రించారు. కాంగ్రెస్ పుస్తకాలను వేసుకుని కేరళకు వెళుతున్న కారును నెల్లై జిల్లా శివగిరి తాలూకా పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీచేశారు. పుస్తకాలకు సంబంధించి ఆర్డరు, ముద్రణకు చెల్లించిన బిల్లు మరే ఆధారమూ లేకపోవడంతో కారు సహా పుస్తకాలను సీజ్ చేశారు. విరుదునగర్కు చెందిన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
డీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై బహిష్కృత వేటు పడింది. డీఎంకే పార్టీ నుంచి అళగిరిని మంగళవారం కరుణానిధి బహిష్కరించారు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలోనే పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. దాంతో అళగిరి మద్దతు ఇవ్వాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే మినహా మిగతా పార్టీ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు నిన్న అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆయనపై డీఎంకే వేటు వేయటం గమనార్హం. -
అళగిరి ఇంట క్యూ
సాక్షి, చెన్నై: అయ్యా... మద్దతు ఇవ్వండి అంటూ అళగిరి ఇంటి వద్ద క్యూ కట్టే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. డీఎంకే, అన్నాడీఎంకే మినహా తక్కిన పార్టీల వాళ్లంతా అళగిరి మద్దతు కోసం క్యూ కడుతుండడంతో మదురై రాజకీయం ఆసక్తికరంగా మారింది. మదురై అంటే ఆధ్యాత్మికంగా అరుుతే అందరికీ గుర్తుకు వచ్చేది మీనాక్షి అమ్మవారి ఆలయం.రాజకీయంగా అయితే, అళగిరి అడ్డా. ఇక్కడి నుంచే దక్షిణాది జిల్లాల్లో డీఎంకే కింగ్ మేకర్గా అళగిరి అవతరించారు. డీఎంకే అధికారంలో ఉన్నా,లేకున్నా సరే మదురై అడ్డాగా అళగిరి చక్రం తిప్పేవారు. అయితే, ఇప్పుడు ఆయన అవసరం డీఎంకేకు లేదు. అళగిరి కోటను దాదాపుగా దళపతి, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ చీల్చేయడం ఇందుకు ఓ ఉదాహరణ. దక్షిణాదిలో సగం మంది అళగిరి వెంట, మిగిలిన వారు స్టాలిన్ వెంట సాగుతున్నారు. ఈ ఆధిపత్య రాజకీయమే కరుణానిధి కుటుంబంలో చిచ్చు రేపుతూ వ చ్చింది. చివరకు ఇటీవల పార్టీ నుంచి అళగిరిని బిహ ష్కరించారు. ఆరోపణాస్త్రం: పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది. డీఎంకే అభ్యర్థులను అళగిరి వ్యతిరేకిస్తున్న దృష్ట్యా, ఆయన్ను ప్రసన్నం చేసుకుని, ఆయన మద్దతుదారుల ఓటు బ్యాంక్ను కొల్లగొట్టేందుకు రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం అళగిరిని ఎండీఎంకే నేత వైగో కలిశారు. అనధికారికంగా అళగిరిని అనేక మంది కలుస్తున్నా, అధికారికంగా వైగో భేటీ కావడం చర్చకు దారితీసింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో అళగిరి వర్గం మద్దతు ఎటో? అన్న ప్రశ్న బయలు దేరింది. డీఎంకేను, అధినేత కరుణానిధిని మాత్రం రక్షించుకుంటానని అళగిరి తేల్చిన దృష్ట్యా, ఆ పార్టీ అభ్యర్థులకు ఆయన ఆశీస్సులు ఇక లేనట్టేనని తేలింది. మద్దతు కోసం...: అళగిరిని కలిసి వైగో మద్దతు కోరారో లేదో ఉదయాన్నే అళగిరి ఇంటి వద్ద క్యూ పెరిగింది. వాతావరణం అంతా సందడి సందడిగా మారింది. సినీ తరహాలో అయ్యా...తమకంటే, తమకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా రాజకీయ పక్షాల అభ్యర్థులు బారులు తీరారు. ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, శివగంగై అభ్యర్థి హెచ్ రాజా అళగిరిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. శివైగంగైలో తన గెలుపు లక్ష్యంగా సహకారం అందించాలని విన్నవించారు. దక్షిణాది జిల్లాల్లోని లోక్ సభ బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించే రీతిలో మద్దతు సంకేతం ఇవ్వాలని విన్నవించారు. వెలుపలకు వచ్చిన హెచ్ రాజా మీడియాతో మాట్లాడుతూ, అళగిరిని మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తమ అధినేత రాజ్ నాథ్ సింగ్తో ఆయన ఢిల్లీలో సమావేశం అయ్యారని, మోడీ పీఎంగా వస్తే ఆహ్వానిస్తామని అళగిరి గతంలో ప్రకటించిన విషయూన్ని గుర్తు చేశారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో పాటుగా, తమ గెలుపున కు మద్దతు ఇవ్వాలని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎండీఎంకే తేని అభ్యర్థి అలగు సుందరం అళగిరితో భేటీ అయ్యారు. తన గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు అళగిరిని కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం అళగిరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రసన్నం: డీఎంకే అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా అళగిరి కంకణం కట్టుకున్న దృష్ట్యా, ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మదురైకు పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన అళగిరి మద్దతు కోరే విషయాన్ని మదురైలో ప్రకటిస్తానన్నారు. మదురై కాంగ్రెస్ అభ్యర్థి సీఎన్ భరత్నాచ్చియప్పన్ మధ్యాహ్నం అళగిరిని కలిశారు. యువతకు పెద్ద పీట వేయాలని యువకుడైన భరత్ నాచ్చియప్పన్ అళగిరిని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం మంది యువకులే ఉన్నారని మీడియాతో మాట్లాడుతూ భరత్ వివరించారు. కేంద్ర కేబినెట్లో పనిచేసిన మంత్రుల్లో అళగిరి ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. తాను మంత్రి పదవిలో లేనప్పటికీ, తనకు అవకాశం ఇచ్చినందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన మనస్సుల్లో మంచితనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. మదురైలో తన గెలుపు కోసం అళగిరి మద్దతు తప్పని సరిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అళగిరికి మద్దతు వినతుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్నారుు.మదురై వేదికగా కింగ్ మేకర్ రాజకీయం రక్తికట్టిస్తోంది మరి. అళగిరి వార్తకు కలుపుకోవాలి మళ్లీ ఫైర్: డీఎంకే అభ్యర్థులపై అళగిరి మళ్లీ విరుచుకు పడ్డారు. ఉదయం నుంచి అళగిరిని పలు పార్టీల నాయకులు కలవడంతో సాయంత్రం ఆయన్ను మీడియా కలిసింది. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అని ప్రశ్నించగా, ముందే చెప్పానుగా మద్దతుదారుల భేటీ అనంతరం వెల్లడిస్తానన్నారు. డీఎంకే అభ్యర్థులు కోట్లు చల్లి మరీ సీట్లు తెచ్చుకున్నారని, వీరందరికీ ఓటర్లు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. తెన్కాశి బరిలో నిలబడ్డ పుదియ తమిళగం నేత కృష్ణ స్వామిని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి పనికి రాని ఆయనకు ఒక పదవి చాలదా? అని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరొకరికి అవకాశం ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించారు. పార్టీ తన చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా చేస్తానని హెచ్చరించడం గమనార్హం. -
డీఎంకేలో తెలుగుకు అన్యాయం
కొరుక్కుపేట, న్యూస్లైన్: డీఎంకే హయూంలో తెలుగు భాషకు అన్యాయం జరిగిందని తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆరోపించారు. గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో తమిళనాడులో తెలుగు భాష అంతరించిందని పేర్కొన్నారు. ఈ మేరకు తమిళనాడు తెలుగు యువశక్తి నేతృత్వంలో వాడవాడలా అమ్మబాట... బంగారు బాట పేరుతో అన్నాడీఎంకే లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అం దులో భాగంగా సోమవారం దక్షిణ చెన్నై అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టర్ జయవర్ధన్కు మద్దతుగా మైలాపూర్, టీనగర్, లజ్ కార్నర్, కపాలేశ్వర్ కోవిల్, సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో నిర్బంధ తమిళం అమలు చేశారని పేర్కొన్నారు. తమిళనాడులోని వీధులకు ఉన్న తెలుగు ప్రముఖుల పేర్లను తొలగించారని విమర్శించారు. అన్నాడీఎంకే పాలనలో తెలుగు వారికి అన్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. గతంలో తెలుగు వారు కోరిన తెలుగు అకాడమీ స్థాపన, తెలుగు భవన్ నిర్మాణం, నిర్బంధ తమిళం సమస్యలను పరిష్కరించే దిశగా జయలలిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తెలుగువారి సమస్యలను అమ్మ జయలలిత మాత్రమే తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారందరూ ఆలోచించి అమ్మకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.శివశంకర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటరాజు, రామకృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు. -
నాగపట్నం నాయకుడెవరు?
సాక్షి, చెన్నై : ఉప్పు ఉత్పత్తికి, చేపల పరిశ్రమకు కేంద్రంగా, నాగూర్ దర్గా, వేలాంగని మేరీ మాత ఆలయం, శింగార వేలర్, సుందరరాజస్వామి, నీలాదిలక్ష్మి, నీలకరై మారి యమ్మ వంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయంగా నాగపట్నం ప్రఖ్యాతి గాంచింది. పర్యాటకంగా అభివృద్ధి దిశలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఈ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వుడు స్థానంగా ఉన్న నాగపట్నానికి నాయకుడు తామే కావాలన్న లక్ష్యంతో రాజకీయ పక్షాల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాలు : పునర్విభజనానంతరం వేదారణ్యం, తిరువారూర్, నన్నిలం, నాగపట్నం, తిరుత్తురైపూండి, కీళ్ వేలూర్ అసెంబ్లీ స్థానాలతో కొత్త పుంతలు తొక్కుతూ నాగపట్నం లోక్సభ రూపుదిద్దుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వేదారణ్యం నుంచి ఎన్వీ కామరాజ్(అన్నాడీఎంకే), నన్నిలం నుంచి ఆర్ కామరాజ్(అన్నాడీఎంకే), నాగపట్నం నుంచి కేఏ జయపాల్(అన్నాడీఎంకే), కీళ్ వేలూర్ నుంచి పీ మహాలింగం అలియాస్ వీపీ నాగమలై(సీపీఎం), తిరువారూర్ - ఎంకే కరుణానిధి(డీఎంకే), తిరుత్తొరై పూండి నుంచి కె ఉలగనాథన్(సీపీఐ) గెలిచారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్వగ్రామం తిరువారూర్ ఈ లోక్సభ పరిధిలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున ఆయనొక్కరే గెలిచారు. మిగిలిన ఐదు స్థానాలను అన్నాడీఎంకే కూటమి దక్కించుకుంది. అయితే, సీపీఎం, సీపీఐలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ ఖాతాలో మూడు స్థానాలే ఉన్నాయి. ఓటర్లు: ఈ లోక్సభ పరిధిలో 11 లక్షల 88 వేల 738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఐదు లక్షల 96 వేల 019 మంది పురుషులు, ఐదు లక్షల 92 వేల 712 మంది స్త్రీలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సార్లు, కమ్యూనిస్టులు ఐదు సార్లు, డీఎంకే నాలుగు సార్లు, అన్నాడీఎంకే ఒక్కసారి మాత్రమే విజయకేతనం ఎగుర వేసింది. కాంగ్రెస్, సీపీఐలకు పట్టున్న ఈ నియోజకవర్గాన్ని డీఎంకే తన గుప్పెట్లోకి తీసుకుంది. ప్రకృతి వైఫరీత్యాలకు తరచూ గురయ్యే నాగపట్నం లోక్సభ పరిధిలో ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాలతో పాటుగా జాలర్ల ఓటు బ్యాంకు న్యాయ నిర్ణేతలు. 2009 ఎన్నికల్లోకి వెళితే..: సిట్టింగ్ ఎంపీగా ఏకేఎస్ విజయన్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి దిశలో నడిపించడంలో సఫలీకృతులు అవుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఆయన్ను సీటు వరించింది. ఆయన విజయానికి కళ్లెం వేయడం లక్ష్యంగా అన్నాడీఎంకే కూటమి తరపున సీపీఐ అభ్యర్థిగా సెల్వరాజ్ బరిలో దిగారు. ఈ ఇద్దరినీ ఢీ కొడుతూ డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ రేసులో నిలబడ్డారు. ఏడు లక్షల 62 వేల 988 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మూడు లక్షల 69 వేల 915 ఓట్లతో విజయన్ మళ్లీ విజయ ఢంకా మోగించారు. సీపీఐ అభ్యర్థి సెల్వరాజ్ మూడు లక్షల 21 వేల 953 ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ 51 వేల 376 ఓట్లతో పరువు నిలబెట్టుకున్నారు. నాయకుడు : ముచ్చటగా మూడో సారి నాయకుడు అనిపించుకునేందుకు ఏకేఎస్ విజయన్ సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎంపీకి మళ్లీ సీటును డీఎంకే కేటాయించింది. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న నియోజకవర్గాన్ని కాస్తో కూస్తో అభివృద్ధి పరచడంలో విజయన్ తన వంతు కృషి చేశారని చెప్పవచ్చు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు పదే పదే లేఖాస్త్రాలను సంధించి మరీ తన నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని వేడుకునే వారు. అలాగే, ఎవరు పిలిచినా సరే వారి కార్యక్రమాలకు వెళ్లడం, ఒక కుటుంబ సభ్యుడిగా వారితో కలసి పోవడం విజయన్ నైజం. ఆయనకు ఉన్న వ్యక్తిగత హవా, మంచి పేరు మళ్లీ సీటు దక్కేలా చేసిందని చెప్పవచ్చు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు లక్ష్యంగా నియోజకవర్గంలో విజయన్ దూసుకెళ్తోంటే, ఆయన స్పీడ్కు బ్రేకులు వేయడానికి స్థానికంగా పట్టున్న డాక్టర్ను అన్నాడీఎంకే రంగంలోకి దించింది. డాక్టర్ కే గోపాల్కు అండగా మంత్రి ఆర్ కామరాజ్ నియోజకవర్గంలో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. డీఎంకే వైఫల్యాలను టార్గెట్ చేసి ప్రచారంలో కే గోపాల్ దూసుకెళ్తోన్నారు. ఇక, సీపీఐ, సీపీఎంలకు పట్టున్న ప్రాంతాలు అనేకం. తమ బలాన్ని చాటుకునేందుకు సీపీఐ తరపున జీ పళని స్వామి రేసులో నిలబడ్డారు. కార్మికులు, జాలర్ల ఓటు బ్యాంకును టార్గెట్ చేసి ప్రచారంలో పళని స్వామి ఉరకలు తీస్తుంటే, బీజేపీ కూటమి తరపున తాము రేసులో ఉన్నామని పీఎంకే ప్రకటించింది. కూటమిలోని డీఎండీకే, బీజేపీ, ఎండీఎంకే ఇతర మిత్రుల ఓటు బ్యాంకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి పీఎంకే అభ్యర్థికి ఏర్పడింది. తమకు పెద్దగా పట్టు లేనప్పటికీ అభ్యర్థిని కాంగ్రెస్ రేసులో దించడం విశేషం. ఆ పార్టీ అభ్యర్థిగా సెంథిల్ పాండియన్ ఒంటరిగా బరిలోకి దిగారు. ప్రకృతి వైపరీత్యాలకు తరచూ నష్టాన్ని చవి చూస్తున్న నాగపట్నంలో మార్పు తీసుకురావడంలో నాయకులు విఫలం అయ్యారన్నది జగమెరిగిన సత్యం. నాగపట్నంకు ‘నాయకుడు’ ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే! -
దక్షిణాదిలో మోడీ హవా
సాక్షి, చెన్నై: టీ నగర్లోని కమలాలయంలో ఆదివారం ఎం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు లోక్సభ ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ ఓటును ఆయుధంగా మలుచుకునేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ మీద ప్రజలు ఏ మేరకు ఆవేశంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పాలకులు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు సైతం యూపీఏపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే అనేక రాష్ట్రాల్లో తమ నాయకత్వాన్ని దక్షిణాదిలో మోడీ హవా బలపరిచేందుకు సిద్ధ పడుతున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో 45 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఓ మెగా కూటమి ఆవిర్భవించడం శుభసూచకంగా అభివర్ణించారు. అది కూడా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వలసలు : దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, దక్షిణాదిలోనూ ఆయన ప్రభంజనం రాబోతున్నదని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శమన్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు బయలు దేరడంతో పాటుగా సెలబ్రటీలు, ప్రజాదరణ కలిగిన వాళ్లు సైతం మోడీ పక్షాన నిలబడే దిశగా తమ గూటికి చేరుతున్నారని వివరించారు. దేశ సమగ్రాభివృద్ధి మోడీ ద్వారా సాధ్యమన్న విషయాన్ని యువత గుర్తించిందని, వారు తాము సైతం అని కదులుతున్నారని పేర్కొన్నారు. అత్యధిక సీట్ల కైవశం: జాతీయ స్థాయిలోనూ, తమిళనాడులోని బీజేపీ కూటమి అత్యధిక సీట్లను కైవశం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏర్పడిన కూటమి గెలుపు కూటమి అని, ఈ కూటమి అభ్యర్థులను, మోడీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం ఈ పర్యాయం అన్నాడీఎంకే, డీఎంకేలకు అంత సులభం కాదన్నారు. దేశంలో బీజేపికి 230-240 సీట్లు, మిత్రులతో కలుపుకుంటే 300 సీట్లు సాధించి తీరుతామన్నారు. మోడీ పీఎం కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంటూ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు కీలక భూమిక పోషించడం ఖాయం అని స్పష్టం చేశారు. తమిళనాడులోని తమ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉందన్నారు. బోణీ: తమిళనాడు నుంచి బీజేపీ కూటమి ప్రతినిధులు అత్యక శాతం మంది పార్లమెంట్లో అడుగు పెట్టి తీరుతారని, కేరళలో తాము ఈ సారి బోణీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర, తెలంగాణల్లోను అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, అక్కడి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ చర్యలు తీసుకుంటుందన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధానితో పాటుగా అక్కడి జిల్లాలో అన్ని రకాల అభివృద్ధి, విద్య, వైద్య పరంగా సేవలను మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలన తీరు అలా ఉంటుందని వివరించారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు సమన్యాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, జాలర్లపై దాడులకు ముగింపు పలుకుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజేపీలో అసంతృప్తి అన్న పదానికి ఆస్కారం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నట్టుగా తమ సీనియర్లు ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి తమరికి చెప్పారా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అద్వాని, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సింగ్లను పార్టీ పక్కన పెట్ట లేదని, మోడీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. వెంకయ్య నాయుడు సమక్షంలో కృష్ణగిరి, కన్యాకుమారిలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సీనియర్ నాయకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దక్షిణ చెన్నై పార్టీ అభ్యర్థి ఇలగణేషన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో వెంకయ్య నాయుడు పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేశారు. ప్రచారానికి శ్రీకారం: బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలోఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ స్థానం బరిలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాడ వాడల్లో ఓట్ల వేటలో పడ్డ పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలో హార్బర్ ఏర్పాటు చేస్తానని, విమానాశ్రయం నెలకొల్పుతానని, పర్యాటక కేంద్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడుతానని ఓటర్లకు హామీలు గుప్పించడం విశేషం. -
కరుణతోనే సంక్షోభం
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కడలూరు, విల్లుపురంలలో సీఎం జయలలిత పర్యటించారు. కడలూరు అభ్యర్థి అరుణ్ మొళి దేవన్, విల్లుపురం రాజేంద్రన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎత్తి చుపుతూ, ఇందుకు కారణం డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటూ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లే యత్నం చేశారు. కరుణ పుణ్యం: రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా, ప్రజలను ఇబ్బం దుల పాలు చేసింది డీఎంకే ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అంధకారంలో ముంచి, ఓటర్ల చేత ఛీ కొట్టించుకున్నారన్న విషయాన్ని మరచిపోయూరని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన కొత్త ప్రాజెక్టుల ద్వారా వస్తున్న విద్యుత్ ఫలాలను ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నెలకొందని గోల చేసేవాళ్లు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల గురించి, ప్రజల గురించి పట్టించుకోకుండా కరుణానిధి చేసిన పుణ్యానికి ప్రతి ఫలంగా అప్పుడప్పుడు విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని త్వరితగతిన అధిగమిస్తామని భరోసా ఇచ్చారు. అవకాశ వాది: కరుణానిధి అవకాశ వాది అని ఆయన్ను నమ్మొద్దంటూ ఓటర్లకు వివరించే యత్నం చేశారు. ఇందుకు గత ప్రభుత్వ హయూంలో సాగిన వ్యవహారాలు, కేంద్రంలోని యూపీఏను అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి, కుంభకోణాలను, ఈలం తమిళుల విషయంలో ప్రదర్శించిన కపట నాటకాల గురించి వివరించారు. అవకాశ వాద రాజకీయాన్ని సాగించే కరుణానిధిని ఓటు అనే ఆయుధంతో అణచివేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీని ఆదరించొద్దని, ఆ పార్టీని ఆదరించిన పక్షంలో తమిళ ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాలని, దేశం మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రంలో ప్రజా పాలన రావాలని, అన్నాడీఎంకే కీలక భూమిక పోషించే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు చోట్ల సాగిన జయ ప్రచార సభకు జన సందోహం పోటెత్తడంతో అభ్యర్థుల్లో గెలుపు ధీమా పెరిగింది. అధికారుల ఉరకలు : రాష్ట్రంలో ఎన్నికల వేళ కోతలు అమల్లోకి రావడంతో విద్యుత్ బోర్డు వర్గాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. విద్యుత్ ఉత్పత్తి మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ బోర్డు వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. తూత్తుకుడి, మెట్టూరు, ఉత్తర చెన్నై కేంద్రాల్లో ఉత్పత్తి మెరుగుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అధికారి పేర్కొంటూ, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని మరో రెండు రోజుల్లో అధిగమిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
పథకాలను చూసి ఓటేయండి
వేలూరు, న్యూస్లైన్: రాష్ట్రంలో అమ్మ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ ఓటర్లను అభ్యర్థించారు. వేలూరు కార్పొరేషన్లో గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. అమ్మ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే ఓటర్లు రెండాకుల గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఒక్క అవకాశం కల్పిస్తే వేలూరు కార్పొరేషన్లోని తాగునీటి సమస్యతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి అమ్మ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయుధంగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, మాజీ కౌన్సిలర్ జీజీ రవి, జననీ బిగ్ బజార్ అధినేత సతీష్కుమార్, విజయకుమార్, కౌన్సిలర్లు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీపీఐ జాబితా
సాక్షి, చెన్నై: ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల జాబితాను సీపీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను దించారు. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ ప్రకటించారు. అన్నాడీఎంకేను పక్కన పెట్టి సీపీఎం, సీపీఐలు కలిసి రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమకు పట్టున్న స్థానాలను ఈ రెండు పార్టీలు ఎంపిక చేసుకున్నాయి. చెరో తొమ్మిది స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో సీట్ల పంపకాలను ముగించాయి. సీపీఎం జాబితా రెండు రోజుల క్రితం వెలువడగా, సీపీఐ జాబితాను తాజాగా ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తమ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పార్టీ కార్యదర్శి టీ పాండియన్ విడుదల చేశారు. అభ్యర్థులు: తెన్కాశీ - లింగం, నాగపట్నం-జి పళని స్వామి, పుదుచ్చేరి - విశ్వనాథన్, సీపీఐ జాబితా తిరుప్పూర్- సుబ్బరాయన్, శివగంగై - ఎస్ కృష్ణన్, తిరువళ్లూరు - ఏఎస్ కన్నన్, కడలూరు - బాలసుబ్రమణ్యన్, రామనాథపురం - ఉమామహేశ్వరి, తూత్తుకుడి - మోహన్ రాజ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. 24 నుంచి ప్రచారం : అభ్యర్థులను ప్రకటించిన టీ పాండియన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 24 నుంచి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నాన్నట్టు ఆయన వివరించారు. కాంగ్రెస్ను ఓడించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారని, అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచారని ధ్వజమెత్తారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తెచ్చిన కాంగ్రెస్ను తరిమి కొట్టడం లక్ష్యంగా ఎన్నికల్లో ప్రచారం ఉంటుందని వివరించారు. కార్పొరేట్ సంస్థల ధనంతో, మీడియా బలంతో ప్రధాని అభ్యర్థిని తానే అని ప్రచారం చేసుకుంటున్న మోడీని ఓడించే విధంగా ఓటర్ల వద్దకు వెళ్లనున్నామన్నారు. మతత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసి తమ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాల తరపున పలాన వ్యక్తి పీఎం అభ్యర్థిగా పేర్కొంటూ ప్రచారం ఉండబోదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము ఏ ఒకర్నీ ముందుకు తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. -
అమ్మ ఓకే బొమ్మ వద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ మార్కెట్లు రాష్ర్టంలో నడుస్తుండగా, అమ్మ థియేటర్ కూడా రాబోతోంది. అమ్మ పేరున అధికార దుర్వినియోగం సాగుతోందంటూ అన్నాడీఎంకేపై ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా చెన్నై సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, సీఎం ఫొటోలు ఎక్కడ ఉన్నా తొలగిం చడమో లేక కప్పిఉంచడమో చేయాలని అదేశించారు. అయితే కొందరు ఆరోపిస్తున్నట్లుగా అమ్మ అనే పదా న్ని తొలగించాల్సిన అవసరం లేదనిన్నారు. అమ్మ అనేది ప్రతి ఒక్కరూ వాడే పదం, అందులో ఎటువంటి రాజకీయమో, తప్పిదమో లేదని వివరించారు. ఈనెల 5న ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడగా ఆనాటి నుంచి 17వ తేదీ వరకు మొత్తం 54,976 ఫిర్యాదులు అందగా వాటిల్లో 52,258 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలపై 34,254 ఫిర్యాదులు, గోడలపై పార్టీల రాతలపై 20,722 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాహనాల తనిఖీల్లో 10 కోట్ల 25లక్షలా 69 వేల 324 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే *10 లక్షలా 41 వేల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడినట్లు అమ్మ ఓకే.. బొమ్మ వద్దు చెప్పారు. తగిన ఆధారాలతో వ్యాపారులు 10లక్షలు, రాజకీయ నాయకులు 50వేలు తీసుకెళ్లవచ్చని అన్నారు. ఆధారాలు చూపినా పట్టుబడిన నగదును ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఒక మహిళా అధికారిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో ఉత్సవాలు చేసుకోవచ్చు, అయితే అక్కడి వేదికలపై రాజకీయ నాయకులు ఆశీనులు కారాదని చెప్పారు. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇంటర్నెట్ ద్వారా ప్రచారానికి ఈసీ నుంచి అనుమతి పొందారని తెలిపారు. నోటాకు చిహ్నంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రిపై విచారణ ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని మంత్రి సంపత్పై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కడలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మంత్రి ఎంసీ సంపత్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా ఒక దినపత్రికలో ఫొటోతో సహా వార్త వచ్చినట్లు డీఎంకే ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని కడలూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. నివేదికను అనుసరించి చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రిపై నేరం రుజువైన పక్షంలో ఎఫ్ఐఆర్, చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు. -
మేమూ రెఢీ!
డీపీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మహిళానేత, సినీ నటి ఖుష్బూ రెడీ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖుష్బూ, ఐదో తేదీ నుంచి కనిమొళి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఓపెన్ టాప్ వాహనాలు వీరి కోసం సిద్ధం అవుతున్నారుు. సీఎం జయలిలత వాగ్దాటిని ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు మహిళలు సిద్ధమయ్యారు. సాక్షి, చెన్నై: వీసీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, పీటీలతో కలసి డీఎంకే నేతృత్వంలో డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్(డీపీఏ) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పదుచ్చేరితో పాటుగా రాష్ర్టంలోని 40 స్థానాల బరిలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రచార బాటలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. తాను సైతం అంటూ పార్టీ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి సీఎం జయలలిత ఒంటి చేత్తో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తుంటే, ఆమె వాగ్దాటిని ఎదుర్కొనే విధంగా మహిళా నాయకుల్ని ప్రచార కదన రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధం అయింది. కని, ఖుష్బూ రెడీ జయలలిత తమ మీద విమర్శల వర్షం కురిపిస్తుండటంతో దాన్ని తమ వాగ్దాటితో తిప్పికొట్టే విధంగా ప్రచారంలోకి ఎంపీ కనిమొళి, నటి ఖుష్బూలు రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ గ్లామర్ ఖుష్బూను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాక్ చాతుర్యంతో, చక్కటి ప్రసంగంతో ఓటర్లను ఆమె ఆకర్షించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు డీఎంకే నిర్ణయించింది. ఇది వరకు వేదికలపై నుంచి ప్రసంగాలు ఇచ్చిన కనిమొళి, ఈ పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా జయలలిత ప్రసంగాల్ని టార్గెట్ చేసి, ఆమె వ్యాఖల్ని దీటుగా ఎదుర్కొనే రీతిలో ఈ ఇద్దరు మహిళు తర్ఫీదు పొందుతున్నారని సమాచారం. కనిమొళికి చక్కటి ప్రసంగాన్ని ఇవ్వగల సత్తా ఉంది. ఖుష్బూ అనర్గళంగా ప్రసంగించగలరు. అయితే, కొన్ని అంశాల్ని ఎత్తి చూపాల్సిన సమయంలో స్క్రిప్ట్ తప్పని సరి. పర్యటన వివరాలు కనిమొళి పర్యటన వివరాలు సిద్ధం చేసే పనిలో అన్నా అరివాళయం వర్గాలు ఉన్నాయి. ఆమె ఏప్రిల్ 5 తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్టాలిన్ కన్యాకుమారి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్న దృష్ట్యా, చెన్నై నుంచి ఆమె ప్రచారం ఆరంభించే రీతిలో పర్యటన వివరాల్ని సిద్ధం చేస్తున్నారు. లేని పక్షంలో కనిమొళి మద్దతుదారులు అత్యధికంగా ఉండే కడలూరు, చిదంబరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఖుష్బూ పర్యటన వివరాలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి పార్టీకి సేవలను అందించేందుకు ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పర్యటన సాగనుంది. వీరు రోడ్ షోలలో కూడా పాల్గొని ప్రచారం చేయనున్నారు. ప్రధాన కూడళ్లల్లో ప్రసంగాలు, అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీరి ప్రచారం కోసం అన్ని వసతులతో కూడిన రెండు ఓపెన్ టాప్ వాహనాలు సిద్ధం అవుతున్నాయి. జయను ఎదుర్కోవడానికే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారానికి అనూహ్యస్పందన రావడంతోనే ఈ ఇద్దరినీ రంగంలోకి దించేందుకు కరుణానిధి నిర్ణయించినట్టు అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్లు చీలడం ఖాయం. ఈ దృష్ట్యా, తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం బరిలోకి అందరినీ దించే పనిలో కరుణానిధి ఉన్నారు. -
అమ్మకు చుక్కెదురు
ఎన్నికల కమిషన్ వద్ద అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. చెన్నైలో కొత్తగా ప్రవేశపెట్టిన మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిం ది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ప్రతి పథకంపైనా అమ్మ ఫొటో లేదా అన్నాడీఎంకే గుర్తులు ఉండేలా జాగ్రత్త లు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అమ్మ క్యాం టీన్లు, అమ్మ మార్కెట్లు, అమ్మ వాటర్ ఇలా అనేక పథకాలు అమలులో ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ పథకాలపై ముద్రించిన జయలలిత ఫొటోలను తొలగించడమో లేక కప్పి ఉంచడమో చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని పోలిన నాలుగు ఆకుల బొమ్మ లు అలాగే ఉన్నాయి. దీనిపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రా సు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవీణ్కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లా రు. ఈ క్రమంలో సీఎం ఫొటోలు తొలగించాలని, అమ్మ అనే పదం ఉండవచ్చని, అన్నా సమాధి వద్ద రెండాకుల చిహ్నాన్ని కొనసాగవచ్చని, మినీ బస్సులపై ఉన్న రెండాకుల చిహ్నా న్ని తొలగించాలంటూ సీఈసీ సూచించింది. సీఈసీ జారీ చేసిన ఆదేశాలను ప్రవీణ్కుమార్ శుక్రవారం ప్రకటించారు. సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరపున సీనియర్ న్యాయవాది రాజేం ద్రన్ ాదనను వినిపిస్తూ మినీ బస్సులపై ఉన్నది పర్యావరణ పరిరక్షణ గుర్తేగానీ అన్నాడీఎంకే చిహ్నం కాదని పేర్కొన్నారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించేలా ఆదేశాలు జారీ చేయూలని కోరారు. ఈ పిటిషన్ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
జయకు టాటా!
వామ పక్షాల నిర్ణయం ఒంటరిగా బరిలోకి అన్నాడీఎంకే కూటమికి సీపీఎం, సీపీఐలు టాటా చెప్పాయి. తమకు కనీస మర్యాద ఇవ్వలేదని, సీట్ల పంపకాల్లో తమను నిర్లక్ష్యం చేశారని వామ పక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలు కలసి కట్టుగా రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోనున్నాయని గురువారం వారు ప్రకటించారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి సీపీఎం, సీపీఐలు పయనించాయి. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టినా, తాము మాత్రం ఆ కూటమిలోనే ఉన్నామని వామపక్షాలు చాటుకుంటూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను అన్నాడీఎంకే పక్కన పెట్టినా, ఎన్నికల కూటమిలోనే ఉన్నట్టు ప్రకటించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూటమిగా ఎదుర్కొనున్నామని ప్రకటిస్తూ వచ్చిన సీపీఎం, సీపీఐ నేతలకు చివరకు మిగిలింది భంగపాటే. సీపీఎం, సీపీఐల జాతీయ నేతలు పోమెస్ గార్డెన్ మెట్లు ఎక్కి కూటమిని ఖరారు చేసుకు వెళ్లారు. అయితే, సీట్ల పందేరంలో పొత్తు బెడిసి కొట్టింది. వామపక్షాలు తలా నాలుగేసి సీట్లకు పట్టుబట్టడంతో అన్నాడీఎంకే నిరాకిస్తూ వచ్చింది. పలు దఫాలుగా సీట్ల చర్చలు సాగాయి. చివరకు తలా రెండు సీట్లు దక్కుతాయని భావించిన వామపక్ష నేతలకు మిగిలింది నిరాశే. చెరో సీటుతో సర్దుకోవాలంటూ అన్నాడీఎంకే అధిష్టానం సూచించడంతో ఖంగు తిన్నారు. అదే సమయంలో కూటమిలోని ఆ రెండు పార్టీలకు తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థులను జయలలిత ప్రకటించారు. సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే తమ అభ్యర్థులను వెనక్కు తీసుకుంటామని చెప్పారు. -
జయకు లెఫ్ట్ ఝలక్
లోక్సభ సీట్ల కేటాయింపులో కుదరని పొత్తు సాక్షి, చెన్నై: తమిళనాట గురువారం నాటి రాజకీయ పరిణామాలు జాతీయ స్థాయిలో మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)కి బీటలు వారే పరిస్థితికి దారి తీస్తున్నాయి. లోక్సభ సీట్ల పందేరం కొలిక్కిరాక పోవడంతో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. లోక్సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఇది పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వామపక్షాలు, అన్నాడీఎంకే గతంలో 2009 పార్లమెంట్ ఎన్నికలలో, 2011 శాసనసభ ఎన్నికలలో కలసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ప్రకాశ్ కారత్, బర్ధన్, సుధాకర్రెడ్డి జయలలితతో భేటీ కావడం, జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు చేయనున్నట్టు చెన్నైలో ప్రకటించడం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికలలో అన్నాడీఎంకేతో సీపీఎం, సీపీఐ కలసి పనిచేస్తాయని చెప్పారు. గత నెల తన జన్మదినం సందర్భంగా పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 40 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు జయలలిత ప్రకటించారు. రెండ్రోజుల క్రితం ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టారు. మరోవైపు సీపీఎం, సీపీఐలతో సీట్ల పంపకాలు కొలిక్కివస్తే, తమ అభ్యర్థులు కొందర్ని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సీపీఎం, సీపీఐ తొలుత నాలుగేసి చొప్పున సీట్లు ఆశించినప్పటికీ జయలలిత అంగీకరించలేదు. చెరో సీటుతో సర్దుకోవాలంటూ ఆమె సూచించినట్టు తెలిసింది. పలు దఫాలుగా చర్చలు సాగినా జయలలిత మాత్రం మెట్టు దిగకపోవడంతో గురువారం సాయంత్రం చెన్నై టీ నగర్లోని కార్యాలయంలో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు జి.రామకృష్ణన్, డి.పాండ్యన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్నామని ప్రకటించారు. సీపీఎం, సీపీఐ కలసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. బీజేపీతో పొత్తుకు డీఎండీకే, పీఎంకే సై కేంద్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీకి తమిళనాడులో రెండు పార్టీలు స్నేహహస్తాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. డీఎండీకే, పీఎంకే బీజేపీతో పొత్తు విషయమై చర్చలు నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించాయి. -
చర్చల జోరు
రాష్ర్టంలో లోక్సభ ఎన్నికల వేడి జోరందుకుంది. సీట్ల పందేరానికి డీఎంకే శ్రీకారం చుట్టింది. ఐదు సీట్లకు ఆ కూటమిలోని వీసీకే పట్టుబట్టగా, మిగిలిన వారందరికీ ఒక్కో సీటు సర్దేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రచార బాట పట్టడంతో సీట్ల కోసం వామపక్షాలు కుస్తీ పడుతున్నాయి. తమ కూటమిని బుధవారం వెల్లడిస్తామని బీజేపీ ప్రకటించింది. వీరితో డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు చేతులు కలిపేనా అన్న ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయన్న సంకేతాలతో రాష్ట్రంలో ఎన్నికల కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే తమ అభ్యర్థులను ప్రకటించింది. వారికి మద్దతుగా పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ప్రచార బాట పట్టారు. మంగళవారం మీనంబాక్కం జైన్ కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సభలో శ్రీ పెరంబదూరు అభ్యర్థి రామచంద్రన్కు మద్దతుగా జయలలిత ప్రచారం చేశారు. అన్నాడీఎంకేకు పోటీగా డీఎంకే తమ కసరత్తులు వేగవంతం చేసింది. పార్టీ తరపున పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలను మంగళవారంతో ముగించింది. మిత్రులకు సీట్లను పంచి పెట్టే విషయంగా డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పందేరం: డీఎంకే కూటమిలో వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం ఉన్నాయి. వీరికి సీట్ల పంపకాల నిమిత్తం మంగళవారం ఉదయం అన్నా అరివాళయం వేదికగా చర్చలు ఆరంభం అయ్యాయి. తొలుత ముస్లిం లీగ్కు ఓ సీటును కేటాయించిన సంతృప్తి పరిచారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ అన్నది గోప్యంగా ఉంచారు. ఇక, తనకు ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని వీసీకే నేత తిరుమావళవన్ పట్టు బట్టడంతో డీఎంకే అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ తేల్చినట్టు సమాచారం. మిగిలిన మిత్రులకు తలా ఓ సీటుతో సంతృప్తి పరుస్తు తొలి రోజు చర్చ సంతృప్తికరంగా సాగిందని చెప్పవచ్చు. మనిదనేయ మక్కల్ కట్చికి మైలాడుదురై సీటును, పుదియ తమిళగంకు తెన్కాశి సీటును కేటాయించారు. వీసీకే మాత్రం పట్టు వీడకుండా ఉండడంతో వారికి రెండు సీట్లను ఇచ్చేందుకు డీఎంకే అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రంలోపు వీసీకేతో సీట్ల పందేరాన్ని తేల్చేసి గురు లేదా, శుక్రవారాల్లో డీఎంకే తొలి జాబితా ప్రకటనకు ఆ పార్టీ అధినేత కరుణానిధి కసరత్తుల్లో ఉన్నారు. సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక కాంగ్రెస్ను డీఎంకే దరిచేర్చడం ప్రశ్నార్థకంగా మారింది. వామ పక్షాల మల్లగుల్లాలు: అన్నాడీఎంకే కూటమిలో సీపీఎం, సీపీఐలు ఉన్నాయి. వారికి ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు. అయితే, వారికి తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించారు. ఇది సీపీఎం, సీపీఐల వర్గాల్ని అయోమయంలో పడేశాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించని దృష్ట్యా, తదుపరి కార్యాచరణపై సీపీఎం దృష్టి కేంద్రీకరించింది. మంగళవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆరంభం అయ్యాయి. రెండు రోజుల ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొనే రీతిలో పలు అంశాలతో కూడిన మేనిఫెస్టోను సీపీఎం ప్రకటించబోతున్నది. అన్నాడీఎంకేపై ఒత్తిడి తెచ్చే కసరత్తుల్లో ఉంది. ఈ విషయంగా ఆ పార్టీ నాయకులు రామకృష్ణన్, రంగరాజన్, వరదరాజన్ మీడియాతో మాట్లాడుతూ, తాము అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. చర్చలు సంతృప్తికరంగా సాగుతోందని, త్వరలో తమకు సీట్ల పంపకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తిరువారూర్లో సంచలన ప్రకటన చేశారు. నాగపట్నం సీటు తమదేనని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రేసులో ఉన్నా, జయలలిత ప్రచారానికి సిద్ధపడ్డా, ఆ సీటు తమ ఖాతాలో చేరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. బీజేపీ కూటమి: బీజేపీ కూటమిలో ఐజేకే, కొంగునాడు తదితర పార్టీలు ఉన్నారుు. అయితే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేశాయి. తమ కూటమిలోకి డీఎండీకే వచ్చినట్టేనన్న సంకేతాన్ని బీజేపీ నేతలు ఇచ్చారు. తమ కూటమి పార్టీలను బుధవారం సాయంత్రం ప్రకటించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్ణయం తీసుకోలేదన్న కెప్టెన్ : ఇదే విషయాన్ని చెన్నైలో ప్రచార బాటలో బిజీగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. విజయకాంత్ తమ కూటమిలోకి చేరినట్టేనని ప్రకటించిన బీజేపీ నేతలు, పీఎంకే విషయంలో సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ తాను ఇంకా కూటమిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం కొసమెరుపు. -
ద్రోహులను తరిమేద్దాం
ఒక్క చాన్స్ ఇవ్వండి రాష్ట్రం కాదు, దేశ స్వరూపాన్ని మార్చేస్తా ఎన్నికల ప్రచారంలో జయలలిత ఒక్క చాన్స్ ఇవ్వండి రాష్ట్రం కాదు, దేశ స్వరూపాన్ని మార్చేస్తా ఎన్నికల ప్రచారంలో జయలలిత సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే దూసుకె ళుతోంది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన జయలలిత, వారికి మద్దతుగా ఓట్ల వేటలో పడ్డారు. తొలి విడతగా నెల రోజుల పాటు రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కాంచీపురం జిల్లా వేదికగా తన ఎన్నికల ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకారం: మధ్యాహ్నం పొయేస్ గార్డెన్ నుంచి కాంచీపురానికి బయలుదేరిన జయలలితను అన్నాడీఎంకే మహిళా విభాగం నేతలు పూర్ణ కుంభాలను చేత బట్టి సాగనంపారు. అడయార్లోని ఐఎన్ఎస్ కేంద్ర హెలిపాడ్కు చేరుకున్న జయలలితకు అన్నాడీఎంకే నాయకులు మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి జయలలిత బయలు దేరారు. కాంచీపురం నత్తం పేటలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు జయలలిత చేరుకోగానే, మంత్రులు పన్నీరు సెల్వం, చిన్నయ్య, ఎంపీ మైత్రేయన్, ఎమ్మెల్యేలు వాలాజాబాద్ గణేషన్, సోమ సుందరం, కాంచీపురం అభ్యర్థి మరగదం కుమర వేల్ స్వాగతించారు. సాంస్కృతిక సంబరాల నడుమ ముఖ్యమంత్రి జయలలితకు అడుగడుగున అభిమానులు నీరాజనాలు పలికారు. తొక్కేద్దాం: తేరడిలో అశేష జనవాహని నడుమ తమ అభ్యర్థిని మరగదంను పరిచయం చేస్తూ ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టారు. తన ప్రసంగంలో యూపీఏ సర్కారు, రాష్ట్రంలోని డీఎంకేను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కావేరి, ఈలం తమిళులు, జాలర్లపై దాడుల వ్యవహారంలో యూపీఏ సర్కారు తమిళులకు తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించడంతో పాటుగా నిధులు, కిరోసిన్, విద్యుత్ కేటారుుంపుల్లో కోతలు విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని యూపీఏకు ఇన్నాళ్లు వత్తాసు పలుకుతూ వచ్చి, తాజాగా కొత్త నాటకాన్ని రచిస్తున్న డీఎంకేకు పుట్టగతులు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తమిళ ద్రోహుల్ని ఓటు అనే ఆయుధం ద్వారా అణగదొక్కేయాలని విజ్ఞప్తి చేశారు. కడపు కొట్టారు: రాష్ట్రంలోని అన్నదాతల కడుపు మాడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించిందని మండి పడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాలు, హఠాత్ చర్యలతో అన్నదాత కొంత మేరకు ఊరట పొందగలిగాడని వివరించారు. అన్ని రకాలుగా తమిళులను సర్వనాశనం చేయడం లక్ష్యంగా కంకణం కట్టుకున్న కాంగ్రెస్ను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదర్శం: రాష్ట్ర పోలీసు యంత్రాంగం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖను నిర్వీర్యం చేయడంతో అరాచక శక్తులు దేశంలో పేట్రేగుతున్నాయని వివరించారు. భారత్ను పక్కదేశాల కుట్రలు కుతంత్రాల నుంచి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించుకోవాలంటే, అన్నాడీఎంకే నేతృత్వంలోని బలమైన కూటమి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాల్సి ఉందని సూచించారు. ప్రపంచ దేశాలు భారత్ను, తమిళనాడును ఆదర్శంగా తీసుకునే రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా హిత సేవలకు తాము సిద్ధం అని, అదే సమయంలో ఓటు అనే ఆయుధంతో అందుకు తగ్గ అధికారాలను తమకు అప్పగిస్తారా? అంటూ ఓటర్లను ప్రశ్నిస్తూ, వారి నుంచి సమాధానం రాబట్టారు. అవినీతి పరులకు శిక్ష: కేంద్రంలో అధికార మార్పు జరిగిన తక్షణం కాంగ్రెస్ హయూంలో జరిగిన అవినీతి కుంభకోణాలన్నింటినీ వెలికి తీసి, న్యాయ స్థానాల ద్వారా బాధ్యులను శిక్షించి తీరుతామని ప్రకటించారు. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని దేశానికి తెప్పించడంతో పాటుగా రానున్న కాలంలో విదేశీ సంస్థలతో కాకుండా, ఆయా దేశ ప్రభుత్వాలతో కలసి ఒప్పందాలు కుదుర్చుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ర్టంగా తమిళనాడును తొలి జాబితాలోకి చేరుస్తామని, అన్ని పథకాలు ఫలాలు ఇక్కడి ప్రజలకు అందేలా చేస్తానని, తమిళాన్ని జాతీయ అధికార భాషగా ప్రకటించడంతో పాటుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు తమిళంలోనే సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాల్ని మార్పు చేసి, ఏడాదిపాటు ధర స్థిరంగా ఉండే రీతిలో చర్యలు తీసుకుంటానన్నారు. ఆదాయ పన్న పరిమితి ఐదు లక్షలకు పెంచుతానని హామీలు గుప్పించారు. దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు దక్కే రీతిలో ఒక్క అవకాశం ఇవ్వాలని, ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్, డీఎంకేలను తరిమి కొట్టడంతో పాటుగా తమ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రచార బాట
రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. సోమవారం నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు తొలి విడతగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. కాంచీపురం జిల్లా తేరడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టనున్నారు. కొలిక్కిరాని దృష్ట్యా, 40 స్థానాల బరిలో తమ అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించా రు. దీంతో ఆయా అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధుల్లో ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా ఉరకలు పరుగులు తీస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఓట్ల వేటకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సిద్ధం స్వయంగా పర్యటించనున్నారు. సోమవారం నుంచి ఎన్నికల ప్రచార బాట పట్టనున్నారు. కాంచీపురం తేరడి నుంచి ఈ ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టనున్నారు. పర్యటన సాగేది ఇలా...: ఏప్రిల్ ఐదో తేదీ వరకు సాగనున్న తొలి విడత ప్రచారంలో భాగంగా 13 లోక్ సభ నియోజక వర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల రూపంలో ప్రచారం సాగనుంది. ఒక రోజు విరామం, మరో రోజు ప్రచారం అన్నట్టుగా పర్యటన సాగనున్నది. అధినేత్రి జయలలిత తమ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నడంతో కాంచీపురం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. చెన్నై - కాంచీపురం మార్గాన్ని అన్నాడీఎంకే జెండాలు,తోరణాలతో ముంచెత్తారు. ఆమె పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 4: శ్రీ పెరంబదూర్ నియోజకవర్గం పరిధిలోని మీనంబాక్కం జైన్ కళాశాలలో బహిరంగ సభ మార్చి 6: నాగపట్నం నియోజకవర్గం అవరిత్తిడల్, మైలాడుదురై నియోజకవర్గం సెంబనర్ కోయిల్ యూనియన్ కాళహస్తికాపురం. మార్చి 9: కన్యాకుమారి నియోజకవర్గం నాగర్ కోయిల్ నాగరాజ తిడల్. మార్చి 11: చిదంబరం నియోజకవర్గం చిదంబరం తేరు వీధి మార్చి 13: ఈరోడ్ నియోజకవర్గం సిత్తోడి జంక్షన్, తిరుప్పూర్ నియోజకవర్గం అన్నానగర్, పెరుమానల్లూరువీధి. మార్చి 15: కళ్లకురిచ్చి నియోజకవర్గం ఆర్కాడు మిల్, ఉలగన్కాత్తాన్, చిన్నసేలం మార్చి 18: రామనాథపురం నియోజకవర్గం రాజభవన్, రామనాథపురం మార్చి 19: తిరుచ్చి నియోజకవర్గం తొలూర్ ఉలవరన్ సంత. మార్చి 21 : విరుదునగర్ నియోజకవర్గం కురుక్కు పాదై, శివకాశి - విరుదునగర్ జంక్షన్. శివగంగై నియోజకవర్గం గాంధీ విగ్రహం, కారైక్కుడి మార్చి 23: పుదుచ్చేరి నియోజకవర్గం ఏఎఫ్టీ మైదానం కడలూరు రోడ్డు, ఉప్పళం మార్చి 25: దిండుగల్ నియోజకవర్గం అంగువాలాస్ క్రీడా మైదానం, పళిని రోడ్డు. మార్చి 28: వేలూరు నియోజకవర్గం కాట్టిక్కొలై, ఇడయాన్ గాడి, అనైకట్టు పంచాయతీ యూనియన్ ఏప్రిల్ 1: తూత్తుకుడి నియోజకవర్గం అన్నానగర్ మెయిన్ రోడ్డు ఏప్రిల్ 1 : తేని నియోజకవర్గం బైపాస్రోడ్డు తేని నగరం ఏప్రిల్ 5: తెన్కాశి నియోజకవర్గం ఉత్తర మాడ వీధి శంకరన్ కోయిల్తో ప్రచారం ముగుస్తుంది. సాక్షి, చెన్నై : లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిగతా పార్టీలకంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఎన్నికల పనులు వేగవంతం చేస్తూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
ఐటీ మినహాయింపు 5 లక్షలు
జయలలిత ‘జాతీయ’స్థాయి ఎన్నికల హామీ చెన్నై: ప్రధాని పదవిపై కన్నేసిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను జాతీయ స్థాయి హామీలతో తీర్చిదిద్దారు. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తాము భాగమైతే ప్రస్తుతం రూ. 2లక్షలుగా ఉన్న ఆదా య పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడానికి చమురు కంపెనీలకు కట్టబెట్టిన అధికారాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అన్నాడీఎంకే మేనిఫెస్టోను జయ మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసమే కాకుండా మొత్తం దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పథకాలకు సంబంధించి ఎన్నో విధానాలను, వాగ్దానాలను ఇందులో పొందుపరచామన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు. - రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర ఆర్థిక, విదేశీ విధానాలపై ఆధారపడి ఉంటుంది కనుక తమిళనాడు హక్కుల పునరుద్ధరణ, రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో దక్కాల్సిన వాటా, అదనపు అధికారాల కోసం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగం కావాల్సిన అవసరముంది. - తమిళనాడులో ప్రజాదరణ పొందిన ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, పేదలకు పాడి ఆవులు, మేకల పథకాలను దేశమంతా విస్తరిస్తాం. - చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును చట్టంగా తీసుకొస్తాం. విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం. -
‘తృతీయ’ శిబిరం!
సంపాదకీయం: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో దేశ రాజకీయ యవనికపై తృతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించింది. న్యూఢిల్లీలో నాలుగు వామపక్షాలు, మరో అయిదు ప్రాంతీయ పార్టీలు మంగళవారం సమావేశమై దీనికి సంబంధించిన ఉమ్మడి ప్రకటన విడుదలచేశాయి. ఇంకా పేరెట్టని, ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోని ఈ ఫ్రంట్ సమావేశానికి వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్లతోపాటు జేడీ(యూ), అన్నా డీఎంకే, జేడీ(ఎస్), జార్ఖండ్ వికాస్ మోర్చా నేతలు హాజరయ్యారు. ఇందులో కలవాల్సిన మరో రెండు పార్టీలు ఏజీపీ, బీజేడీలు ఈ సమావేశానికి రాకపోయినా, అవి తమతోనే ఉన్నాయని ఫ్రంట్ అంటున్నది. ఈ తరహా ఫ్రంట్ ఆవిర్భావం ఇది మొదటిసారేమీ కాదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడల్లా కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలు ఒక వేదికపైకి రావడం రివాజే. ప్రతిసారీ వామపక్షాలే ఇందుకు చొరవ తీసుకున్నాయి. 1996లో ఇలాంటి ప్రయత్నం ఫలించి హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అయితే, ఫ్రంట్ శాశ్వతం తప్ప అందులో పక్షాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. 2004లో వామపక్షాలు ఏకమై యూపీలో ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో జతకట్టాయి. మళ్లీ ఆ పక్షాలే 2009లో అక్కడ మాయావతివైపు మొగ్గుచూపాయి. అణు ఒప్పందం విషయంలో ములాయం చివరి నిమిషంలో మాట మార్చి యూపీఏకు మద్దతివ్వడమే అందుకు కారణం. తమిళనాడుకొచ్చేసరికి ఒకసారి డీఎంకే, మరోసారి అన్నాడీఎంకే వామపక్షాలకు చేరువవుతుంటాయి. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గాలివాలును చూసుకుని ఒకసారి ఎన్డీఏవైపు, మరోసారి వామపక్షాల కూటమివైపు మొగ్గుతుంటారు. ఈ ఫ్రంట్ కు వామపక్షాలు, వారి నేతృత్వంలో జరిగే ఉద్యమాలు బలమైతే...సూత్రబద్ధమైన రాజ కీయాలకూ, సిద్ధాంతాలకూ కట్టుబడలేని దుర్బలులను కలుపుకోవాల్సిరావడం దాని బలహీనత. అందుకే, ఇలాంటి ఫ్రంట్లు గట్టిగా ఏడాదికాలమైనా నిలబడలేకపోయాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి రెండంకెల స్థానానికి పడిపోతుందని, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 200కుపైగా స్థానాలు లభించవచ్చునని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఈ రెండింటితో సంబంధంలేకుండా ఏర్పడిన ఫ్రంట్ బలంపై ఎవరికైనా సందేహాలు రావడం సహజమే. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న బెంగాల్ ఇప్పుడు మమతాబెనర్జీ వశమైంది. బీహార్కు చెందిన జేడీ(యూ)మొన్నటివరకూ ఎన్డీయే కూటమిలోనే ఉండేది. ఇప్పుడది మూడో ఫ్రంట్లో చేరడంతో అక్కడి బలాబలాల్లో మార్పులు వచ్చే ఆస్కారం ఉన్నది. తమిళనాట అన్నాడీఎంకేకు తిరుగులేని బలం ఉంది. యూపీలో ఎస్పీ ఎంతవరకూ దూసుకెళ్తుందో చూడాలి. మొత్తంమీద చూస్తే మూడో ఫ్రంట్లోని వివిధ ప్రాంతీయ పార్టీలు 9 రాష్ట్రాల్లో 286 ఎంపీ సీట్లలో యూపీఏ, ఎన్డీయేలకు గట్టి పోటీ ఇవ్వనున్నాయన్నది వాస్తవం. ఇందులో యూపీ (80), బీహార్ (40), జార్ఖండ్(14), పశ్చిమబెంగాల్ (42), తమిళనాడు (39), ఒడిశా(21), కేరళ(20), కర్ణాటక(28), త్రిపుర(2) ఉన్నాయి. జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అన్నట్టు ఎన్నికలు సమీపించేలోగా ఈ ఫ్రంట్లో మరికొన్ని పార్టీలు వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికి ఇంకా యూపీఏతోనే ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ... ఫ్రంట్ ఆవిర్భావాన్ని స్వాగతించడం అందుకు తార్కాణం. అయితే, ఎన్నికలయ్యాక సంభవించగల పరిణామాల్లో ఒకరిద్దరు బయటికెళ్లే అవకాశాలనూ తోసిపుచ్చలేం. తమ ప్రధాని అభ్యర్థి ఎవరో ముందే చెప్పబోమని, ఎన్నికలయ్యాకే అది నిర్ణయమవుతుందని శరద్యాదవ్ అంటున్నారు. గతంలో వీపీసింగ్, దేవెగౌడ, గుజ్రాల్ వగైరాలను ఎన్నికల అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు. అందులో నిజం లేకపోలేదుగానీ...ఈసారి అది అంత సులభం కాదు. ములాయం, జయలలితలు ఇప్పటికే ప్రధాని పదవిపై తమ ఆకాంక్షను వ్యక్తంచేసివున్నారు. దేవెగౌడ సరేసరి. వ్యక్తుల ఆకాంక్షల సంగతలా ఉంచి అసలు ఫ్రంట్ ఉమ్మడి కార్యక్రమమేమిటో, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దాని వైఖరి ఎలాంటిదో తెలిశాకే ప్రజల్లో దానికి ఉండగల ఆదరణను అంచనా వేయడం సాధ్యమవుతుంది. అయితే, ఈలోగానే ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఈ ఫ్రంట్పై విమర్శల జడివాన ప్రారంభించాయి. మఖలో పుట్టి పుబ్బలో అంతరించే ఇలాంటి ఫ్రంట్ను ప్రజలు ఆదరించబోరని ఆ పార్టీలు అంటున్నాయి. నిజంగా ఆ స్థితే ఉంటే ఇలాంటి ఫ్రంట్ గురించి ఆ పార్టీలు పట్టించుకోవాల్సిన పనేలేదు. అందుకు విరుద్ధంగా ఫ్రంట్కు సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్న దశలోనే...అందులో ఎవరుంటారో, ఉండరో తెలియని స్థితిలోనే దాదాపు రెండునెలలక్రితమే కాంగ్రెస్, బీజేపీలు ఉలిక్కిపడ్డాయి. అది దేశాన్ని అథమస్థాయికి తీసుకెళ్తుందని మోడీ హెచ్చరిస్తే...థర్డ్ ఫ్రంట్ ఒక ఎండమావి అని కాంగ్రెస్ అంటున్నది. థర్డ్ ఫ్రంట్లో ఉండేది ప్రాంతీయ స్థాయిలో బలంగా ఉన్న పార్టీలు గనుకనే, వాటినుంచి తమకు గట్టి సవాల్ ఎదురుకాగలదన్న భయం ఉండటంవల్లనే రెండు ప్రధాన పార్టీలూ అతిగా స్పందిస్తున్నాయన్నది వాస్తవం. ఈ రెండు జాతీయ పార్టీలూ నిజానికి ఈ ప్రాంతీయ పార్టీల కారణంగా సారాంశంలో ‘పెద్ద ప్రాంతీయ పార్టీలు’గా మారాయి. ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీని ప్రాంతీయ పార్టీగా లెక్కేస్తే మూడు, నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉండి ఇవి జాతీయ పార్టీ ముద్ర వేయించుకుంటున్నాయి. మొత్తానికి ఈ మూడో ఫ్రంట్లోని పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఏమేరకు నిలువరించగలవో, దృఢంగా నిలబడగలవో వేచిచూడాలి. -
అన్నాడీఎంకేలోకి బన్రూటి
జయ సమక్షంలో పార్టీ తీర్థం అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తా డీఎండీకేలో వలసల బెంగ సాక్షి, చెన్నై : సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ అన్నాడీఎంకేలో చేరారు. కుటుంబంతో కలసి పోయేస్ గార్డెన్లో సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ ఒకరు. తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో రాజకీయ పయనం సాగించారు. ఎంజీయార్కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన అనంతరం ఆ పార్టీకి దూరం అయ్యారు. 2005లో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. ఆ పార్టీలో సాగుతున్న కుట్ర పూరిత రాజకీయాలు బన్రూటిలో ఆవేదనను రగిల్చాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటూ: గత ఏడాది చివరల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా బన్రూటి హఠాత్ ప్రకటన చేశారు. డీఎండీకే ప్రిసీడియం చైర్మన్ పదవికి, ఎమ్మెల్యే, శాసన సభా పక్ష ఉప నేత పదవులకు రాజీనామా చేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో రాజకీయూల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవరినీ నిందించకుండా డీఎండీకే నుంచి బయటకు వచ్చిన బన్రూటి సేవలను తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు సీఎం జయలలిత వ్యూహ రచన చేశారు. తిరువళ్లూరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్రూటికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదును ప్రకటించారు. దీంతో తన రాజకీయ సెలవు నిర్ణయాన్ని బన్రూటి పునః సమీక్షించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే తీర్థం: రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించిన బన్రూటి అన్నాడీఎంకే గూటికి చేరే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయకాంత్పై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. దీంతో అన్నాడీఎంకేలోకి బన్రూటి చేరినట్టేనన్న ప్రచారం వేగం పుంజుకుంది. అయితే, తానెప్పుడు పార్టీలో చేరబోతున్నానో అన్న వివరాలను మద్దతుదారులకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువారం ఉదయాన్నే సతీమణి శాంతి, తనయుడు సంపత్కుమార్తో కలసి పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన బన్రూటికి సభ్యత్వాన్ని అందజేసిన జయలలిత కాసేపు ముచ్చటించారు. లోక్సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో అన్నాడీఎంకే ఖ్యాతి ఎలుగెత్తి చాటడం లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని బన్రూటి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా తన పయనం ఉంటుందన్నారు. వలసల బెంగ: బన్రూటి అధికారికంగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకోవడంతో డీఎండీకేలో వలసలు మొదలయ్యే అవకాశాలున్నారుు. పార్టీ ప్రిసీడియం చైర్మన్గా, సీనియర్ నాయకుడిగా వ్యవహరించిన బన్రూటికి ఆ పార్టీ నాయకులందరూ సన్నిహితులే. అనేక జిల్లాల్లోని డీఎండీకే నాయకులు పెద్ద దిక్కు లేని దృష్ట్యా, బయటకు వెళ్లలేక కాలం నెట్టుకు వస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకేలోకి బన్రూటి వెళ్లడంతో ఆయన మద్దతుదారులుగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ బన్రూటి పార్టీ మారడంతో వలసల బెంగ డీఎండీకే అధిష్టానాన్ని పట్టుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెబల్స్ అవతారం ఎత్తిన దృష్ట్యా, మరి కొందరు త్వరలో అమ్మకు జై కొట్టే అవకాశాలు ఎక్కువే. -
అన్నా డీఎంకే-సీపీఐ పొత్తు
40 ఎంపీ స్థానాలు గెల్చుకుంటాం: జయ చెన్నై: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నా డీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్తో తన నివాసంలో భేటీ అనంతరం అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి జయలలిత ఈ మేరకు వెల్లడించారు. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ సీట్లతోపాటు పుదుచ్చేరిలోని ఒక సీటును గెల్చుకోవడమే ఈ పొత్తు లక్ష్యమని చెప్పారు. అన్నాడీఎంకే-లెఫ్ట్ కూటమి ఘనవిజయం సాధిస్తే.. జయలలిత ప్రధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని బర్దన్ అన్నారు. -
పదవులిస్తాం
ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు పోటీ పడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆయా నేతలను తమవైపు తిప్పుకునేందుకు సరికొత్త వ్యూహం పన్నింది. పొత్తు పార్టీలకు మంత్రి పదవులు ఇస్తామంటూ ఎరవేయడం ప్రారంభించింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే వేర్వేరు కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు దీటుగా మూడో కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో లోక్సభ స్థానాలను దక్కించుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఆశ్రరుుంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వీలైనన్ని ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ఫలించారుు. పొత్తుకు ఎండీఎంకే అంగీకారం తెలిపింది. పీఎంకేతో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. డీఎండీకే అధినేత విజయకాంత్ను ఎలాగైనా తమతో చేర్చుకోవాలని కాంగ్రెస్, డీఎంకే ప్రయత్నిస్తున్నాయి. విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత తదితరులతో బీజేపీ రహస్య చర్చలు సాగిస్తోంది. యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో బీజేపీదే పైచేయిగా ప్రచారం సాగిస్తోంది. తాము సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చినా పొత్తుకుదుర్చుకున్న పార్టీలకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. పొత్తు హామీల్లో మిగిలిన అన్ని పార్టీల కంటే బీజేపీ మెరుగైన హామీగా డీఎండీకే భావిస్తోంది. ఏ పార్టీకి మద్దతు పలకాలో తెలియని అయోమయంలో కెప్టెన్ పడిపోయారు. వచ్చే నెల 2వ తేదీన ఉళుందూర్పేటలో జరిగే పార్టీ సమావేశంలో పొత్తుపై నిర్ణయం తీసుకుంటారని డీఎండీకే శ్రేణులు ఆశిస్తుండగా, ఆ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే ఆశపడుతున్నాయి. ఇదిలా ఉండగా వచ్చేనెల జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి ఓటు వేయబోమని పీఎంకే అధినేత రాందాస్ ప్రకటించారు. అసెంబ్లీలో ఈ పార్టీకి మూడు ఓట్లు ఉన్నాయి. -
‘వైద్య’ వివాదం
చెన్నై, సాక్షి ప్రతినిధి: వైద్యుల నియామకంలో అన్నాడీఎంకే ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. కరుణానిధి హయాంలో అత్యంత ఆధునిక వసతులతో రూ.12 వేల కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలి సిందే. జయలలిత ముఖ్యమంత్రి కాగానే దానికి తాళం వేసి పాత సచివాలయాన్నే వినియోగిస్తున్నారు. కొత్త సచివాలయాన్ని స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త భవనంలో గత ఏడాదే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తగినట్లుగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వం గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. వైద్యుల నియామకంలో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందని, రిజర్వేషన్ అమలు చేయలేదని, అధికారులకు ఎక్కువ వేతనం నిర్ణయించారని తదితర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత కరుణానిధి ఒక ప్రకటనలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది నియామకంలోను, జీతభత్యాలపైనా నియమ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అంతేగాక రిజర్వేషన్ల అమలును సైతం ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఆస్పత్రి డెరైక్టర్కు నెలకు రూ.2.50 లక్షలు జీతంగా నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, మంత్రులకు సైతం ఇంత పెద్ద మొత్తంలో జీతాలు లేవని ఆయన ఆక్షేపిం చారు. 14 మంది ఆస్పత్రి ప్రధాన వైద్య సలహాదారులకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, తనకు ఆప్తులైన వారికి అధిక లాభం చేకూరుస్తూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విపరీత నిర్ణయాలపై పోరాటాలు జరిపేందుకు డీఎంకే ఏమాత్రం వెనుకడుగు వేయదని కరుణ హెచ్చరించారు. అదేవిధంగా పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ సైతం వైద్యుల నియామకం అక్రమాలమయమని వ్యాఖ్యానించారు. వన్నియర్ల సమావేశానంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసుల్లో బాధితులుగామారి జైలు జీవితం గడిపిన వారిని శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో రాందాస్ సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యుల నియమకాన్ని ప్రస్తావించారు. నియామకాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ ఆందోళనలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. -
అన్నాడీఎంకే ఒంటరిపోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీకి దిగుతుందని పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. మరేవైనా పార్టీలు తమతో కలిసిరావాలనుకుంటే దానిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అమ్మకే అప్పగిస్తూ తీర్మానించారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై అన్ని పార్టీల్లో కసరత్తులు సాగుతుండగా అన్నాడీఎంకే నేతలు ఆ బాధ్యతంతా అమ్మకే అప్పగించేశారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ సర్వసభ సమావేశాన్ని గురువారం చెన్నైలో నిర్వహించింది. సమావేశాన్ని ఉద్దేశించి జయలలిత ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని చేశారు. కేంద్రాన్ని శాసించే స్థాయి గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పార్టీకి ఒంటరిగా పోటీ చే సి 40 ఎంపీ స్థానాలు గెలుచుకునే సత్తా ఉందని తెలిపారు. తాను ఆశించే స్థాయిలో విజయాన్ని అందిస్తారని నేతలను, కార్యకర్తలను తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఏర్కాడులో అన్నాడీఎంకే గెలుపు అందరికీ తెలిసిందేనని, 30 వేల మెజార్టీ ఆశించాం, అయితే 86 వేల మెజారిటీ సాధించామని గుర్తు చేశారు. ఈ భారీ గెలుపు అందరి కృషి ఫలితమేనన్నారు. ఇదే ఉత్సాహం పట్టుదల పార్లమెంటు ఎన్నికల్లో కూడా సాగాలని ఆమె కోరారు. అన్నాడీఎంకే రైలు రెడ్ఫోర్ట్ ఎక్స్ప్రెస్గా మారి గమ్యం చేరాలని ఉత్సాహాన్ని నూరిపోశారు. ప్రజలు మనకు ఓటువేస్తే వారికి మనమేమి చేస్తామో కూడా చెప్పుకోవాలి. ప్రగతి, శాంతి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమాన్ని ఇద్దాం. భారత దేశ భవిష్యత్తు అన్నాడీఎంకే కార్యకర్తల చేతుల్లోనే ఉందని అన్నారు. తీర్మానాలు యూపీ, గుజరాత్, పంజాబ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రధానుల శకం తరువాత దేశానికి సార థ్యం వహించే అవకాశం ఇన్నాళ్లకు తమిళనాడుకు వస్తోందని చెప్పారు. కామన్వెల్త్ సమావేశంలో యూపీఏ పాల్గొనడంపై ఖండించారు. శ్రీలంక సైనికులకు భారత్లో శిక్షణపై నిరసన తెలిపారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక దళాల వరుస దాడులు, అరెస్ట్లను నియంత్రించడంలో యూపీఏ విఫలందమైన్నారు. చెన్నైలో ఎర్రకోట నమూనా పార్టీకి సంబంధించి ఇది కీలకమైన సమావేశం కావడంతో అమ్మకు ఎంతో అట్టహాసంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత సమావేశ ప్రాంగణానికి చేరుకోగా రంగుల రంగుల బెలూన్లు, మేళతాళాలతో స్వాగతం చెప్పారు. దేశంలో మూడో కూటమి అంటూ ఏర్పడితే జయలలిత ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు చిహ్నంగా సమావేశం ప్రవేశద్వారాన్ని ఎర్రకోట నమూనాలా తీర్చిదిద్దారు. దీంతో కార్యాకర్తలు జయలలిత కాబోయే ప్రధాని అంటూ నినాదాలు చేశారు. వినతుల వెల్లువ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న నేతలు గురువారం నుంచి తమ విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చని పార్టీ అధినేత్రి ఆదేశించడంతో పార్టీ కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 10 గంటల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామని పార్టీ ప్రకటించినా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు 8 గంటలకే రాయపేటలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద క్యూకట్టారు. తాము ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయదలుచుకుంది వివరిస్తూ ఒక్కో దరఖాస్తుకు రూ.25వేలు చెల్లించాలని పార్టీ ఆదేశించింది. ఒక్కో నేత మూడు నాలుగు నియోజకవర్గాలను ఎంచుకుని విజ్ఞప్తులు అందజేశారు. జయలలిత తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ వందలాది మంది విజ్ఞప్తులు చేశారు. జయ నియోజకవర్గం కోసం పోటీపడిన వారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు ఉన్నారు. ఒక నేత ఏకంగా రూ.4.75 లక్షలు చెల్లించి విజ్ఞప్తి చేశారు. -
నిర్ణయం ఎటో?
సాక్షి, చెన్నై: వానగరం శ్రీవారు వెంకటాచలపతి కల్యాణ మండ పం వేదికగా గురువారం అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 40 ఎంపీ సీట్లు లక్ష్యంగా ఆ పార్టీ కార్యాచరణ సిద్ధమవుతున్నా, తుది నిర్ణయం ఎటు వైపు మళ్లుతుందో అన్న ఎదురు చూపుల్లో వామపక్షాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల సందడి రాష్ట్రంలో మొదలైంది. నాలు గు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోం దన్న సంకేతాలకు బలం చేకూరింది. దీంతో రాష్ట్రంలోని ఆ పార్టీ లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. మరోవైపు తమది ఒంటరి సమరమేనని డీఎంకే అధినేత కరుణానిధి తేల్చారు. అయితే, లోక్సభ ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యడం, ఆ కమిటీ తుది నివేదిక ఆధారంగా డీఎంకే ప్లేటు మార్చే అవకాశాలు కూడా ఉన్యా. డీఎండీకే మల్లగుల్లాలు పడుతుంటే, కాంగ్రెస్ అయోమయంలో పడింది. అధికార అన్నాడీఎంకే తన వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రంలో చక్రం తిప్పడం లక్ష్యంగా 40 సీట్ల కైవశం తమ కర్తవ్యం అన్నట్టు ఆ పార్టీ వర్గాలు దూసుకెళుతున్నారుు. దీంతో ఆ కూటమిలో తామున్నామని చెప్పుకుంటున్న వామపక్షాలకు సంశయం మొదలైంది. తమను అన్నాడీఎంకే అక్కున చే ర్చుకుంటుందా..? లేదా తిరస్కరిస్తుందా..? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఈ ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల వైపు జయలలిత తలొగ్గేనా, లేదా బీజేపీకి స్నేహ హస్తం ఇచ్చేనా అన్నది సర్వ సభ్య సమావేశంలో తేలబోతోంది. నేడు సర్వ సభ్య సమావేశం : వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ కల్యాణ మండపం వేదికగా తన నిర్ణయం ఏమిటో సీఎం జయలలిత ప్రకటించబోతున్నారు. సర్వసభ్య సమావేశం అంటే, అన్నాడీఎంకే నాయకులకు దడ. అధినేత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయోనన్న బెంగ వారిలో నెలకొంది. లోక్ సభ ఎన్నికలపై నిర్ణయం ఎలా ఉన్నా, పార్టీ పరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం అయ్యే ఈ సమావేశం కోసం సర్వం సిద్ధం చేశారు. జయలలితకు ఆహ్వానం పలికే ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఈ సమావేశం నిమిత్తం చెన్నైకు తరలి వస్తున్నారు. -
ఢిల్లీ పీఠంపై జయ కన్ను.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత డిల్లీ పీఠంపై కన్నేశారు. బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె తన ప్రసంగాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు యూపీఏ, ఎన్డీఏలు తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా, మూడో కూటమి ఏర్పాటు ద్వారా ఎర్రకోటను ఎగురవేసుకుపోవాలని మరి కొన్ని పార్టీలు యోచిస్తున్నాయి. ఇటీవల డిల్లీలో ఒక సమావేశం నిర్వహించి ఆ దిశగా చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో జయ కూడా పాల్గొన్నారు. యూపీఏకు రాహుల్, ఎన్డీఏకు నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థులుగా ఖరారయ్యూరు. మూడో కూటమి అంటూ ఏర్పడితే ప్రధాని పదవి కోసం అనేక మంది కాచుక్కూచున్నారు. వీరిలో జయలలిత కూడా ఒకరని రాష్ట్రంలో ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. జయ ఇంటి సమీపంలో బారులుతీరిన ఫ్లెక్సీల్లో కాబోయే ప్రధాని జయ అనే నినాదాలున్నాయి. అయితే ఇంతకాలం అభిమానులకే పరిమితమైన ఈ నినాదం తొలిసారిగా జయ నోటి వెంట వచ్చింది. చెన్నైలో బుధవారం ఒకే వేదికపై జరిగిన రాష్ట్ర మంత్రులు కే పళనిసామి, సెందూర్ పాండియన్, షణ్ముగనాథన్, పుదుచ్చేరి ఎమ్మెల్యే కవియరసు కుమారులు, కుమార్తెల వివాహ వేడుకలకు సీఎం జయ హాజరయ్యూరు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆధ్యాతికత కర్తవ్యబోధను చేశారు. గెలుపు ఓటములు నాణేనికి ఇరుపాశ్వాల వంటివి, ఓటమి తరువాతనే గెలుపు వస్తుందని పేర్కొన్నారు. జీవితంలో సుఖదుఃఖాలు సైతం అంతే సహజమని ధైర్యం చెప్పారు. అబ్రహం లింకన్ అనేక ఓటములు చవిచూసిన తరువాతనే అమెరికా అధ్యక్షులయ్యూరని చరిత్రను గుర్తుచేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 స్థానాల్లో అన్నాడీఏంకే గెలుపు త థ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సైతం ఇదే దీక్ష, లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. రేపటి భారతం మనదే అంటూ ఆమె పేర్కొన్నారు. జీహెచ్లో మరో అమ్మ క్యాంటిన్ చెన్నై ప్రజల విశేషాభిమానం చూరగొన్న అమ్మ క్యాంటిన్ల వరుసలో మరొకటి చేరింది. రాష్ట్రంలోని వారేగాక పొరుగు రాష్ట్రాల ప్రజలతో సైతం కిటకిటలాడే చెన్నై జనరల్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అమ్మ క్యాంటిన్ను బుధవారం జయ ప్రారంభించారు. చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంటీన్లో 300 మంది ఒకే సారి భోజనం చేసేలా వసతి కల్పించారు. వృద్ధులు, వికలాంగులకు అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. అత్యంత తక్కువ ధరకే టిఫిన్, భోజనం అందించేలా అమ్మ క్యాంటిన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభించారు. నగరంలోని మొత్తం 200 వార్డుల్లో ఈ క్యాంటీన్ల ఏర్పాటు పూర్తయింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆహారాన్ని అందిస్తారు. చలికాలంలో దోమలతో పేద ప్రజలు రోగాల బారిన పడకుండా రక్షించుకునేందుకు 5 లక్షల దోమ తెరలను జయ బుధవారం పంపిణీ చేశారు. రూ.1.32 కోట్ల విలువైన తెరలను నగరంలో రోడ్ల కిరువైపులా నివసించే పేదవారికి వాటిని పంచిపెట్టారు. -
చల్లని కబురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులోని తాగునీటి సమస్య ఈనాటిది కాదు. ప్రజలు దశాబ్దాలుగా నీటి కోసం అగచాట్లు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి హోదాలో ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా ఏటా తెలుగుగంగ నీరు రాష్ట్రానికి వస్తోంది. అలాగే చిన్నాచితక పథకాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రెండు నిర్లవణీకరణ కేంద్రాలను తీసుకు వచ్చింది. మరోవైపు కావేరి నీటి కోసం కర్ణాటకతో పోరాటం సాగిస్తోంది. నాలుగు జిల్లాల్లో మరో పథకం తిరుప్పూరు, ఈరోడ్, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో రూ.717.32 కోట్ల అంచనా వ్యయంతో సహకార తాగునీటి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ప్రకటించారు. ఈ పథకంతో తిరుపూరు జిల్లాలోని వెల్లకోయిల్, మాలనూర్, తారాపురం, కున్నట్టం, కాంగేయం ప్రాంతాలు లబ్ధి పొందనున్నాయి. ఈరోడ్ జిల్లా చెన్నమలై పంచాయతీలోని 1262 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేయనున్నారు. అలాగే తంజావూరు జిల్లా తిల్లుల పేరావూరణి, పెరుమగళూర్, అదిరామపట్టినం, మరో 9 పంచాయతీల్లోని 1153 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేస్తారు. ఇందుకు నిర్మాణ వ్యయంగా రూ.495.70 కోట్లు, ఏడాది నిర్వహణ వ్యయంగా రూ.9.19 కోట్లు కేటాయించారు. కోయంబత్తూరు జిల్లా తొండాపుత్తూరు, పులువపట్టి, తేన్కరై, వేటపట్టి, దాళ యూర్, ఆలిందురై, పేరూర్, మరో 134 పంచాయతీల్లోని పక్కాగృహాలకు రూ.130.46 కోట్లతో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అధికశాతం కావేరి నదీ జలాలపై ఆధారపడి ఉండడం గమనార్హం. -
మెట్రో రైలుకు రాజకీయ ‘రంగు’
రాజకీయాలకు అనర్హమేదీ కాదని తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఏనాడో నిరూపించాయి. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో మెట్రో రైల్వే లైను నిర్మాణ పనులు ప్రతిష్టాత్మకంగా సాగుతుండగా వాటి బోగీలకు వేసిన రంగుల విషయం చర్చనీయాంశమైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో 2009లో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా చెన్నైకి రూ.14,600 కోట్ల అంచనాతో మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైంది. నగరంలోని నలుమూలలను కలుపుతూ 45 కిలోమీటర్ల పొడవున రెండు రైలు మార్గాలు, వీటి మధ్యలో 32 రైల్వే స్టేషన్లు నిర్మించాలని సంకల్పించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి పూందమల్లి హైరోడ్డు, కోయంబేడు, వడపళని వంద అడుగుల రోడ్డు మీదుగా పరంగిమలై వరకు ఒక మార్గం, చాకలిపేట నుంచి సెంట్రల్ స్టేషన్ మీదుగా అన్నాశాలై మీదుగా మీనంబాకం ఎయిర్పోర్టు వరకు మరో మార్గం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు, బోగీల తయారీ బాధ్యతను బ్రెజిల్కు అప్పగించారు. 2011 ఆగస్టున విడుదల చేసిన మెట్రో రైలు బోగీల చిత్రాల్లో అప్పటి అధికార పార్టీ పతాకంలోని (డీఎంకే) రంగులను తలపించేలా పైన ఎరుపు, కింద నలుపుతో తయారు చేసినట్టు ఉన్నాయి. అదే ఏడాది సెప్టెంబరులో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. చెన్నైకి రానున్న మెట్రో రైలు బోగీల్లోని రంగుల ప్రత్యేకతను ఆ పార్టీ పసిగట్టింది. అంతే ఎరుపురంగు స్థానంలో నీలంరంగు చేరింది. మెట్రో పనులు పూర్తవుతున్న దశలో ఈ ఏడాది జూన్లో తొలి మెట్రో రైలు చెన్నైకి చేరింది. అన్నాడీఎంకే ప్రభుత్వం సూచన మేరకు తయారైన బోగీలన్నింటికీ రంగులు మార్పులు చేసినట్లు చెన్నై మెట్రో రైలు (సీఎంఆర్ఎల్) అధికారి చెప్పారు. మార్పులు చేసిన రంగులు ప్రస్తుత అధికార పార్టీవి కాకున్నా డీఎంకే రంగులను మాత్రం గుర్తుచేయకపోవడం గమనార్హం. వచ్చేనెల ట్రయల్ రన్ రంగుల రాజకీయం ఇలా ఉండగా మెట్రో రైలు వచ్చేనెలలో ట్రయల్ రన్కు సిద్ధమైంది. బ్రెజిల్ నుంచి చెన్నై చేరుకున్న నాలుగు బోగీలు కలిగిన మెట్రో రైలును కొయంబేడు ట్రాక్పై నిలబెట్టారు. ట్రయల్ రన్ కోసం కోయంబేడు సమీపంలో 800 మీటర్ల ట్రాక్ను సిద్ధం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి జయలలిత పచ్చజెండా ఊపి ట్రయల్ రన్ను ప్రారంభించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది చివరికి కోయంబేడు - పరంగిమలై మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వరికి మద్దతు ధర పెంపు: ఆదేశాలిచ్చిన జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నదాతకు తీపికబురు. వరికి మద్దతు ధర పెంచుతూ ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ధరకు అదనంగా సొమ్ము చెల్లించనున్నారు. రాజకీయాల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శైలే వేరు. ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. ముఖ్యంగా ప్రజాకర్షక పథకాలతో జయలలిత నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ కోవకే చెందుతాయి. అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, చౌక దుకాణాలు. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా జయలలిత పాలన సాగిస్తున్నారు. తాజాగా ఆమె అన్నదాతకు తీపి కబురు పంపారు. వరిధాన్యం సేకరణలో క్వింటాలుపై కేంద్రం రూ.1310, సన్నరకంపై రూ.1345 చెల్లిస్తోంది. ఈ ధర తమకు ఏ మాత్రమూ సరిపోదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత సచివాలయంలో అధికారులతో గురువారం సమావేశమయ్యారు. వరి మద్దతు ధర అంశానికి సంబంధించి చర్చించారు. సాధారణ రకంపై అదనంగా రూ.50, సన్నరకంపై రూ.70 చెల్లించాలని ఆమె నిర్ణయించారు. ఈ లెక్కన సాధారణ రకానికి రూ.1360, సన్నరకానికి రూ.1415 చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
మా హయాంలోనే వికలాంగులకు పెద్దపీట
వేలూరు, న్యూస్లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే వికలాంగులకు పెద్ద పీట వేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలె క్టరేట్లో ఎమ్మెల్యేల నిధి నుంచి వికలాంగులకు స్కూటర్లు, వికలాంగ పరికరాలు, చెవిటి వారికి మిషన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వికలాంగులకు విద్య, ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. వివాహ నిధి, పెట్రోల్ వాహనాలను అందజేస్తున్నామన్నారు. వీటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు.గత రెండు బడ్జెట్లలో ఒక్కో ఎమ్మెల్యే నిధి నుంచి రూ.1.30 లక్షలు కేటాయించామన్నారు. మొదటి విడతగా 250 మందికి రూ.28,54,160 విలువ చేసే పరికరాలను అందజేస్తున్నామన్నారు. వికలాంగులను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిం చామని చెప్పారు. అమ్మ ప్రవేశ పెడుతున్న పథకాలను చూసి ఇతర రాష్ర్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్య పోతున్నారన్నారు. అనంతరం వికలాంగులకు పెట్రోల్ వాహనాలు, ఇతర పరికరాలు, వివాహ సహాయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శంకర్, ఎమ్మెల్యేలు మహ్మద్జాన్, డాక్టర్ విజయ్, రవి, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి చార్లెస్ ప్రభాకరన్, జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
ఆహార భద్రత బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే
ఢిల్లీ: లోక్సభలో ఆహారభద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై అన్నా డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆహార భద్రత బిల్లును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాకే లోక్సభలో ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆహర భద్రతకు తాము పెద్ద పీట వేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. రైతుల ప్రయోజనాలు కాపాడతామని కేంద్రం భరోసా ఇస్తే ఆహార భద్రత బిల్లుకు మద్దత్విడానికి తాము సిద్ధమని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ గత రెండు రోజుల క్రితం పేర్కొన్న విషయం తెలిసిందే. ఆహార బిల్లు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, అవసరమని భావిస్తే పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. బిల్లు పేరుతో ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్కు అమ్మేస్తారన్నారు.