
కరుణతోనే సంక్షోభం
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం డీఎంకే అధినేత కరుణానిధి చేసిన పుణ్యమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చురకలు అంటించారు.
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కడలూరు, విల్లుపురంలలో సీఎం జయలలిత పర్యటించారు. కడలూరు అభ్యర్థి అరుణ్ మొళి దేవన్, విల్లుపురం రాజేంద్రన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎత్తి చుపుతూ, ఇందుకు కారణం డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటూ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లే యత్నం చేశారు.
కరుణ పుణ్యం: రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా, ప్రజలను ఇబ్బం దుల పాలు చేసింది డీఎంకే ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అంధకారంలో ముంచి, ఓటర్ల చేత ఛీ కొట్టించుకున్నారన్న విషయాన్ని మరచిపోయూరని ఎద్దేవా చేశారు.
తాను అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన కొత్త ప్రాజెక్టుల ద్వారా వస్తున్న విద్యుత్ ఫలాలను ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నెలకొందని గోల చేసేవాళ్లు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల గురించి, ప్రజల గురించి పట్టించుకోకుండా కరుణానిధి చేసిన పుణ్యానికి ప్రతి ఫలంగా అప్పుడప్పుడు విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని త్వరితగతిన అధిగమిస్తామని భరోసా ఇచ్చారు.
అవకాశ వాది: కరుణానిధి అవకాశ వాది అని ఆయన్ను నమ్మొద్దంటూ ఓటర్లకు వివరించే యత్నం చేశారు. ఇందుకు గత ప్రభుత్వ హయూంలో సాగిన వ్యవహారాలు, కేంద్రంలోని యూపీఏను అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి, కుంభకోణాలను, ఈలం తమిళుల విషయంలో ప్రదర్శించిన కపట నాటకాల గురించి వివరించారు. అవకాశ వాద రాజకీయాన్ని సాగించే కరుణానిధిని ఓటు అనే ఆయుధంతో అణచివేద్దామని పిలుపునిచ్చారు.
బీజేపీని ఆదరించొద్దని, ఆ పార్టీని ఆదరించిన పక్షంలో తమిళ ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాలని, దేశం మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రంలో ప్రజా పాలన రావాలని, అన్నాడీఎంకే కీలక భూమిక పోషించే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు చోట్ల సాగిన జయ ప్రచార సభకు జన సందోహం పోటెత్తడంతో అభ్యర్థుల్లో గెలుపు ధీమా పెరిగింది.
అధికారుల ఉరకలు : రాష్ట్రంలో ఎన్నికల వేళ కోతలు అమల్లోకి రావడంతో విద్యుత్ బోర్డు వర్గాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. విద్యుత్ ఉత్పత్తి మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ బోర్డు వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. తూత్తుకుడి, మెట్టూరు, ఉత్తర చెన్నై కేంద్రాల్లో ఉత్పత్తి మెరుగుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అధికారి పేర్కొంటూ, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని మరో రెండు రోజుల్లో అధిగమిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.