సాగుకు రాత్రి కరెంట్ బంద్
నెలరోజులుగా సరఫరా కాని త్రీఫేజ్
12గంటలు సరిపోవడం లేదంటున్న రైతులు
ఉదయం నుంచి సాయంత్రం వరకే విద్యుత్
వరి నారు ఎదుగుదలకు ఇబ్బందులు
వానాకాలం సాగుపై భయాందోళన
24 గంటల కరెంటుపై తమకు
ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
ఈ రైతు పేరు పులిమామిడి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా, లింగాపురం గ్రామం. ఈయనకు పదెకరాల భూమి ఉంది. పొద్దంతా బోరు వేస్తే నీళ్లు కింద మడులకు అందడం లేదని, రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బోర్లు, బావులు మంచిగా నడిచి పొలమంతా పారుతుందని పేర్కొంటున్నాడు. వ్యవసాయానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరిపోవట్లేదని 24 గంటలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు.
ముస్తాబాద్ (సిరిసిల్ల): నిన్నమొన్నటి వరకు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు తిప్పలు పడ్డ రైతాంగం.. ఇప్పుడు నారుమళ్లు, వరిసాగుకు విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా తగినంత లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం అమ్మకాల సమయంలో త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు కుదించారు. అప్పుడు పెద్దగా అవసరం లేని కరెంట్ కోసం రైతులు ఏం ఆలోచించలేదు. ఇప్పుడు ఏరువాక సిద్ధం చేస్తున్న రైతాంగానికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయి.
రాత్రి కరెంట్ నిలిపేసిన అధికారులు
నెల రోజులుగా రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ధాన్యం విక్రయాల సమయంతోపాటు రైతులెవరూ ఇతర పంటలు కూడా వేయకపోవడంతో కరెంట్ సరఫరాపై ఆలోచించలేదు. ప్రస్తుతం మృగశిర కార్తె ముగిసి ఆరుద్రలోకి వస్తున్న తరుణంలో త్రీఫేజ్ కరెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం వ్యవసాయం కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ను సరఫరా చేస్తున్నారు. రైతులు నారుమడులు సిద్ధం చేసుకోగా, వరి నాట్లకు అవసరమైన పొలాన్ని సిద్ధం చేసేందుకు కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. పైగా ఇంకా ఎండలు మండుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వేళ పొలాల్లో పనిచేసే పరిస్థితులు లేవని, రాత్రి వేళ కరెంట్ సరఫరా ఉంటే పొలం మొత్తం నీరు పారించి ఇతర పనులు చేసుకుంటామనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
హామీ అమలు చేయాలి
ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కేవలం 10 గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ రావడంతో జిల్లాలో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేయలేక, కరెంట్ రాక అవస్థలు పడుతున్నారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చి, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. |– కొండ శ్రీనివాస్, ముస్తాబాద్
నీళ్లున్నా కరెంట్ ఉంటలేదు
భూగర్భ జలాలు మంచిగానే ఉన్నాయి. చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. కానీ కరెంట్ ఉంటలేదు. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ ఇస్తున్నారు. గతంలో కరెంట్ ఇచ్చినట్లు ఈసారి కూడా ఇవ్వాలి. రైతులకు అండగా నిలవాలి. – తాళ్ల చంద్రారెడ్డి, రైతు, ముస్తాబాద్
త్వరలోనే త్రీఫేజ్ సరఫరా
ప్రస్తుతానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరఫరా అవుతోంది. రైతులు పూర్తిస్థాయిలో పంటలు వేసుకునేలోగా 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది. ఇప్పటికైతే ఇంకా మాకేమీ ఆదేశాలు రాలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయానికి అవసరమైన కరెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– విష్ణుతేజ, ఏఈ, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా
వరిసాగు : లక్షా 40వేల ఎకరాలు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు: 80,289
రైతులు : సుమారు లక్ష మంది
ఈ రైతు పేరు ఎద్దండి నర్సింహారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం. ఇతడికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నాడు. తనకున్న రెండు బోరుబావులతో వరి సాగుచేసే నర్సింహారెడ్డికి విద్యుత్ బాధలు వచ్చి పడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఉండడంతో వ్యవసాయం ఎలా చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం 12 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో అధికారులు చెప్పాలని కోరుతున్నాడు. నెలరోజులుగా ఇదే పరిస్థితి ఉందని, పొలం మొత్తం నీరు పారిద్దామంటే కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నాడు. 24 గంటలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా.. ఇతనొక్కడే కాదు.. చాలా మంది రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


