విండీస్‌ను కూల్చేశారు.. | West Indies Bowled out at 104 | Sakshi
Sakshi News home page

విండీస్‌ను కూల్చేశారు..

Nov 1 2018 3:50 PM | Updated on Nov 1 2018 3:52 PM

West Indies Bowled out at 104 - Sakshi

తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున‍్న ఆఖరి వన్డేలో వెస్టిండీస్‌ తడబాటుకు గురైంది.  భారత బౌలర్ల దెబ్బకు విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.  మార్లోన్‌ శామ్యూల్స్‌(24), జాసన్‌ హోల్డర్‌(25), రోవ్‌మాన్‌ పావెల్‌(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. విండీస్‌ ఓపెనర్‌ కీరన్‌ పావెల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సాయ్‌ హోప్‌ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ మొదటి ఓవర్‌ నాల్గో బంతికి ధోనికి క్యాచ్‌ ఇచ్చిన పావెల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్‌ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్‌ను ఔట్‌ చేశాడు. బూమ్రా బౌలింగ్‌లో హోప్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై రోవ్‌మాన్‌ పావెల్-శామ్యూల్స్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కావడంతో విండీస్‌ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్‌మెయిర్‌ నిష్క్రమించిన తర్వాత రోవ్‌మాన్‌ పావెల్‌, ఫాబియన్‌ అలెన్‌, హోల్డర్‌లు స్వల్ప విరామాల్లో పెవిలియన్‌ చేరడంతో విండీస్‌ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది.



Advertisement
Advertisement
 
Advertisement
Advertisement