విండీస్‌ను కొట్టేసి.. సిరీస్‌ పట్టేశారు

India won Series against West Indies  - Sakshi

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది.  చివరి వన్డేలో విండీస్‌ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్‌ శర్మ( 63 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి ( 33 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు మరోసారి ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(6) తొందరగా పెవిలియన్‌ చేరినప్పటికీ రోహిత్‌-కోహ్లిల జోడి మరో వికెట్‌ పడకుండా ఆడి భారత్‌కు విజయాన్ని అందించింది.
 

అంతకుముం‍దు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. భారత బౌలర్ల దెబ్బకు 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.  మార్లోన్‌ శామ్యూల్స్‌(24), జాసన్‌ హోల్డర్‌(25), రోవ్‌మాన్‌ పావెల్‌(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. విండీస్‌ ఓపెనర్‌ కీరన్‌ పావెల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సాయ్‌ హోప్‌ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ మొదటి ఓవర్‌ నాల్గో బంతికి ధోనికి క్యాచ్‌ ఇచ్చిన పావెల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్‌ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్‌ను ఔట్‌ చేశాడు. బూమ్రా బౌలింగ్‌లో హోప్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై రోవ్‌మాన్‌ పావెల్-శామ్యూల్స్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కావడంతో విండీస్‌ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్‌మెయిర్‌ నిష్క్రమించిన తర్వాత రోవ్‌మాన్‌ పావెల్‌, ఫాబియన్‌ అలెన్‌, హోల్డర్‌లు స్వల్ప విరామాల్లో పెవిలియన్‌ చేరడంతో విండీస్‌ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top