‘కాంగ్రెసోళ్లంత నెత్తిమీద దస్తీ వేసుకొని పోవాల్సిందే’
సాక్షి, జనగామ : కాంగ్రెస్ నాయకులు ఎంత తిరిగిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నెత్తి మీద దస్తీ వేసుకోని పోవడమే తప్పా చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పుట్టుక ఓ చరిత్ర అని, 14 ఏళ్లు పోరాడి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగలే కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు.
జనగామ నుంచి ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా నుంచి ఒకరికైనా మంత్రి పదవి వచ్చేలా చూస్తామన్నారు. దేవాదుల ద్వారా త్వరలోనే జనగామలోని చెరువులన్నింటిని నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే టీఆర్ఎస్కు బలం అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్, బీజేపీని కాదని దేశం మొత్తం టీఆర్ఎస్ వైపు చూస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికే దిక్సూచిగా మారనుందని వివరించారు. పంచాయతీ, సొసైటీ, మున్సిపల్, ఎంపీల ఎన్నికల్లో బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తే అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 16ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీని శాసిద్దామని కార్యకర్తలు వివరించారు.