ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తాం | Jagadeesh Reddy Criticize On MLA Jana Reddy | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తాం

May 7 2018 12:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

Jagadeesh Reddy Criticize On MLA Jana Reddy - Sakshi

మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ జెండా జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ జెండా జయకేతనం ఎగురవేస్తోందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు గెలుపుఖాయమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తేల్చిచెప్పారు.

ప్రజలు మంచి చెడును గమనిస్తున్నారని,  చెడును తుంగలో తొక్కడం ఖాయమన్నారు. సిండికేట్‌ వ్యాపారాలను ప్రోత్సహించిన వారికి గుణపాఠం తప్పదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని హెచ్చరించారు. దొంగలు..దొంగలు.. కలిసి ఊర్లు తిరుగుతున్నారని, వాళ్లకు ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. గత ఎన్నికల్లో సిగ్గు లేకుండా తిట్టుకున్న వారే కలిసి తిరుగుతుంటే సూర్యాపేట ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రూ.2468 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రబీలో సాగర్‌ జలాలలతో రెండో పంటను అందుకున్న రైతులు ఆనందం పడుతుంటే సాగర్‌ ఎమ్మెల్యే జానారెడ్డి మాత్రం చివరి భూములకు నీళ్లు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు.

జానారెడ్డి చివరి భూముల్లో తిరుగుతుండడం చూస్తుంటే ఆయనతో పనిచేయించినట్లుగా తనకు ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో వార్డులు పర్యటిస్తున్న దామోదర్‌రెడ్డి గతంలో పర్యటించి అభివృద్ధి చేస్తే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఎన్ని వార్డులు తిరిగినా అవసరమైన పనులు చూపిస్తే అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. కలెక్టరేట్‌ నిర్మాణం, ఎస్పీ కార్యాలయ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కమ్యూనిటీ హాళ్లు, సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ’20కోట్లు ఖర్చు చేశామన్నారు. పుల్లారెడ్డి చెరుకు కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మెడికల్‌ కళాశాల సూర్యాపేటకు మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. అభివృద్ధికి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, తాహేర్‌పాషా, బూరబాల సైదులు, మహేశ్వరి, రమణ, నర్సింహారావు, బాషా, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.

1
1/1

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement