టమాటాల చోరీ..! | Tomatoes theft ..! | Sakshi
Sakshi News home page

టమాటాల చోరీ..!

Aug 3 2014 11:07 PM | Updated on Sep 2 2017 11:19 AM

టమాటాల చోరీ..!

టమాటాల చోరీ..!

వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ దొంగతనం నిజంగానే జరిగింది. టమాటాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది.

సాక్షి, ముంబై: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ దొంగతనం నిజంగానే జరిగింది. టమాటాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది. హోల్‌సేల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు ట్రక్కులు తీసుకొచ్చి మరీ టామాటాల పెట్టెలను ఎత్తుకెళ్తున్నారు. తీరా వాటిని రిటెయిల్ మార్కెట్‌లో బయటికంటే తక్కువ ధరకు అమ్మేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం తెల్లవారు జామున మీరారోడ్డులోని కాశీగావ్ హోల్‌సేల్ మార్కెట్‌లో సుమారు 720 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి.

వివరాల్లోకెళ్తే... హోల్‌సేల్ వ్యాపారి అశోక్‌కుమార్ ప్రజాపతి కిలో రూ. 60 ధరతో కొనుక్కొచ్చిన టమాటాలను పెట్టెల్లో నింపి హోల్‌సేల్‌గా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. యజమాని లేని సమయం చూసి దుండగులు ట్రక్కు వేసుకొని వచ్చి క్షణాల్లో పెట్టెలను అందులోకి ఎక్కించుకొని పరారయ్యారు. దీనిని పలువురు చూసినా కొనుగోలు చేసినవారే వాటిని తీసుకెళ్తున్నారమోనని భావించారు. తీరా ప్రజాపతి అక్కడికి వచ్చి చూస్తే కనీసం ఒక్క పెట్టె కూడా కనిపించలేదు.  గత 12 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ ఒక్కరోజు కూడా ఇలా జరగలేదని వాపోయాడు. టమాటాలను గుర్తించకున్నా వాటిని నింపిన పెట్టెలను గుర్తుపట్టగలననే నమ్మకంతో సమీపంలోని రిటెయిల్ మార్కెట్‌లలో వెతికాడు.

దీంతో దహిసర్‌లోని రావల్‌పాడా మార్కెట్‌లో తన టమాటాలను గుర్తుతెలియని వ్యక్తులు విక్రయించినట్లు గుర్తించాడు. వెంటనే కాశీమీరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీని యన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కదమ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో చోటుసుకుందని చెప్పారు. అక్కడ 24 పెట్టెల్లో టమాటాలు ఉన్నాయనీ, ప్రతి పెట్టెలో 30 కిలోల టమాటలు ఉన్నాయనిచెప్పారు. చోరీకి గురైన టమాటాల విలువ సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి వాటిని ఎత్తుకెళ్లిన దుండగులు ఒక్కో పెట్టెను రూ. 500 నుంచి రూ. 600 వరకు విక్రయిం చిన ట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement