బిడ్డ‌కు క‌రోనా, త‌ల్లికి మాత్రం నెగెటివ్‌ | Sakshi
Sakshi News home page

త‌ల్లికి నెగెటివ్‌, అప్పుడే పుట్టిన బిడ్డ‌కు పాజిటివ్

Published Sun, Jul 12 2020 10:10 AM

Mother Tests Coronavirus Negative Baby Born Tests Positive In Delhi - Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా బారిన ప‌డ్డ గ‌ర్భిణిల‌కు పుట్టే శిశువులకు వైర‌స్ సోకిన వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే క‌రోనా నెగెటివ్ మ‌హిళ జ‌న్మ‌నిచ్చిన బిడ్డ‌కు పాజిటివ్ అని తేలింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న గురువారం దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీలో గ‌ర్భంతో ఉన్న‌ ఓ మ‌హిళ జూన్ 11న క‌రోనాతో రామ్‌మ‌నోహ‌ర్ లోహియా‌ ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో జూన్ 25న మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వహించ‌గా పాజిటివ్ అనే వ‌చ్చింది. జూలై 7న మూడోసారి జ‌రిపిన‌ ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ అని తేలింది. కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఆమె త‌ర్వాతి రోజు రాత్రి 8.50 గంట‌ల‌కు ప‌సికందుకు జ‌న్మ‌నిచ్చింది. (చుక్కల్లో కోవిడ్‌-19 ఔషధం ధర..)

ఆరు గంట‌ల త‌ర్వాత ఆ ప‌సిగుడ్డుకు ప‌రీక్ష చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని వ‌చ్చింది. శిశువులో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. దీనిపై ఆర్ఎమ్ఎల్ ఆసుప‌త్రి వైద్యులు రాహుల్ చౌద‌రి మాట్లాడుతూ.. త‌ల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డ‌కు క‌రోనా వ్యాపించే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. గ‌ర్భంలో ఉన్న శిశువుకు క‌రోనా సోక‌డమ‌నేది ప్ర‌పంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!)

Advertisement
Advertisement