
అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో అక్క, చెల్లిల్ల మధ్య చెలరేగిన వివాదంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే...టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన కమ్రాన్ జా(20) తన సోదరి అఫ్సాన్జా నుంచి 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఈ నెల 7వ తేదీన రూ.30 వేల అప్పు తీర్చింది. మిగతా రూ.20 వేల అప్పును 14 వ తేదీన తీర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం పాత నోట్లను రద్దు చేయడంతో అఫ్సాన్జా పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించలేదు. తనకు కొత్త నోట్లు ఇస్తేనే కుదురుతుందని పట్టుబట్టింది.
ఈ మేరకు కమ్రాన్జా గత మూడు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. అవి దొరక్కపోవటంతో తీవ్ర వేదనకు గురైన ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన ఆమె కుటుంబసభ్యులు కమ్రాన్ జాను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా..గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు వైద్యులకు చెప్పారు. దీంతో వైద్యులు ఆమెకు గుండె ఆపరేషన్ చేశారు. వైద్యం చేసిన కాసేపటికే కమ్రాన్ జా మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఆమెకు ఏడాదిలోపు వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కమ్రాన్ జా మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.