బుల్లితెర నటుడిపై యువతి ఫిర్యాదు

Young Woman Complaint On TV Artist In Tamil Nadu - Sakshi

చెన్నై,పెరంబూరు: తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడంటూ బుల్లితెర నటుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు చూస్తే స్థానిక కొడుమియూర్, గాంధీనగర్‌ 5వ వీధిలో దివ్య అనే యువతి నివశిస్తోంది. ఈమె ఒక ఒక ప్రైవేట్‌ సంస్థలో గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా పనిచేస్తోంది. దివ్య ఆదివారం నీలాంగరై పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో తాను ఒక ప్రైవేట్‌ సంస్థలో గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా పని చేస్తున్నానని, తనకు గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన నవీన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని పేర్కొంది. మా మధ్య పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారిందని చెప్పింది. దీంతో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు చెప్పడానికి భయపడ్డామన్నారు.

దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని తెలిపింది. ఈ విషయం తమ బంధువులకు తెలియదని చెప్పింది. పెళ్లి అయినా ఎవరి ఇంటిలో వారు ఉంటూ తరచూ కలుసుకుంటున్నామని, ఫోన్‌లో మాట్లాడుకుంటున్నామని చెప్పింది. అలాంటిది ఇటీవల నవీన్‌ ప్రవర్తనలో మార్పు రావడం గుర్తించానని అంది. దీంతో అతని గురించి ఆరా తీయగా తనను దూరంగా పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడన్న దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసిందని చెప్పింది. నవీన్‌ నీలాంగరైలోని ఒక కల్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసిందని, కాబట్టి ఆ పెళ్లిని ఆపాలని ఆ ఫిర్యాదులో దివ్య పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. నవీన్‌ బుల్లితెర నటుడని తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top