కలిసి వస్తే.. సమైక్యాంధ్ర సాధ్యం | Samaikyandhra sabha in Srikakulam | Sakshi
Sakshi News home page

కలిసి వస్తే.. సమైక్యాంధ్ర సాధ్యం

Aug 5 2013 5:59 AM | Updated on Oct 17 2018 5:10 PM

సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లావ్యాప్తంగా ఆదివారం కూడా ఉద్ధృతంగా సాగింది. ఎచ్చెర్లలో బీఆర్ ఆంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు చీపుళ్లు పట్టి ఊడ్చడం ద్వారా విభజన నిర్ణయంపై నిరసన ప్రకటించారు.

 ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు, కార్మిక, మేధావులంతా ముందుకు కలిసి కట్టుగా వస్తే సమైక్యాంధ్ర సాధ్యమని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు అన్నారు. ఆదివారం ఎన్‌జీవో హోంలో వేదిక ప్రతినిధులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, చౌదరి నారాయణమూర్తి, హనుమంతు సాయిరాం, బరాటం లక్ష్మణరావు, దుప్పల వెంకటరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, అశోక్, నాగరాజ్, విజయ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూపీఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భయపడరన్నారు. యూపీఏ ప్రభుత్వం మరో ప్రకటన చేసే వరకు సమైక్య లక్ష్యసాధన కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరుచుకునేలా ప్రశాంతంగా ఉద్యమాలను యువత నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసినంత మాత్రాన తెలంగాణ విభజన జరగదన్నారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణా సొత్తు కాదని, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి ఆస్తిగా పేర్కొన్నారు. విద్యాసంస్థలు, కర్మాగారాలు, అక్కడ ఉన్న సంపద  ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని, నెత్తురు ధారపోసైనా కాపాడుకుంటామని శపథం చేశారు.  
 
 ఊరూరా తెలుగు తల్లి జెండాలు
 జిల్లాలో ప్రతి ఊళ్లోనూ తెలుగుతల్లి జెండాలు  ఆవిష్కరించాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సాగాలని కోరారు. దీనికి ప్రజాస్వామ్య, సమైక్య వాదులంతా ముందుకు రావాలన్నారు. సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని లేకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌ను ముక్కలు చేయాలంటే ఒప్పుకోని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ముక్కలు చేయాలని యోచిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని,  ఉద్యోగుల జోలికి వెళితే చర్యలు తప్పవని ప్రతినిధులు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, మేధావుల సంఘాలు మరింత ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయన్నారు. ఉద్యోగులు మెరుపు సమ్మెకు సమాయత్తమవుతున్నారని తెలిపారు.
 
 కేసును ఉపసంహరించుకోవాలి
 రాజాంలో విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారులకు కోరారు. వారు సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమాలు చేశారే తప్ప చెడ్డవారు కాదని, దీని గురించి ఎస్పీని కలుస్తామని చెప్పారు.
 
 నేడు భారీ ర్యాలీ
 సమైక్యాంధ్ర సాధన కోసం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం సూర్యమహల్ నుంచి ఏడు రోడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో కె.వేణుగోపాల్, శ్రీనివాసానందస్వామి, ఎంఆర్‌కె దాస్, విజయ్, డి. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement