పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి | India should teach lesson to Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి

Aug 8 2013 4:33 AM | Updated on Mar 29 2019 8:30 PM

భారత సైనికులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దొంగచాటుగా దాడులు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా వారికి వత్తాసు పలకడం దేశ ద్రోహం అవుతుందని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు.

ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : భారత సైనికులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దొంగచాటుగా దాడులు చేసినా,  కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా వారికి వత్తాసు పలకడం దేశ ద్రోహం అవుతుందని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. వెంటనే పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ దుశ్చర్యను నిరసిస్తూ బుధవారం  బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ‘యెండల’ మాట్లాడుతూ.. ఎలాంటి యుద్ధ వాతావరణం లేని సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ భారత్‌పై దాడులకు ఉసిగొల్పడం పిరికిపంద చర్య అన్నారు.  ఐదుగురు భారత సైనికులను ప్రాణాలను బలిగొంటే, దేశం కోసం ప్రతి భారతీయుడు తలుచుకుంటే  పాకిస్థాన్‌లో ఒక్క ఉగ్రవాది కూడా మిగలడని  హెచ్చరించారు. దేశంలో భద్రత కరువైందన్నారు.
 
 జవాన్లు మరణిస్తే సంబరాలా..!
 పాక్ దాడిలో భారత జవాన్లు మరణిస్తే, తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సంబరాలు, సన్మానాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
 
 తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరులపట్ల స్పందించని కాంగ్రెస్ నాయకులు, నేడు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్,బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనిల్ రెడ్డి,ఉద్యమ కమిటీ నాయకులు కుల్‌దీప్‌సహానీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement