
వివాదాల్లో 'రాజధాని' భూములు
ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం చేసిన సమీకరణలో 3,600 ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా వివాదాలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం చేసిన సమీకరణలో 3,600 ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా వివాదాలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 33,660 ఎకరాలకు సంబంధించి అంగీకారపత్రాలు అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఆయా భూముల క్షేత్రస్థాయి స్థితిగతులను తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. రైతులిచ్చిన డాక్యుమెంట్లలో ఉన్న వివరాల ప్రకారం సంబంధిత సర్వే నంబర్లో భూమి సక్రమంగా ఉందా? ఏవైనా తేడాలున్నాయా? వంటి విషయాలను సేకరించారు. ఈ సమయంలో 3,600 ఎకరాల భూములు పలు వివాదాల్లో ఉన్నట్లు తేటతెల్లమైంది. వివాదం లేని 30 వేల ఎకరాలకు సంబంధించి 23,028 ఎకరాలకు చెందిన రైతులతో ఒప్పందాలు చేసుకునేందుకు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 6,972 ఎకరాలకు సంబంధించి వివాదాలు లేకపోయినా ఇంకా పంట సాగులో ఉండడంతో భూమి కొలతలు పూర్తికాలేదు. సాగవుతున్న భూముల జోలికెళ్లే పరిస్థితి లేకపోవడం, భూమి స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు.
గుర్తించిన వివాదాలు..
వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ములు పంచుకున్నప్పుడు, భూమిని ఒకరి నుంచి నలుగురైదుగురు కొనుగోలు చేసినప్పుడు జరిగిన రిజిష్ట్రేషన్లలో భారీ అవకతవకలు.
రికార్డుల్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో కొలతలు సరిపోకపోవడం. వాటిని సరిచేసేందుకు మిగిలిన వారు ఒప్పుకోకపోవడం. ఒప్పుకున్నా అందరూ ఒకచోట లేకపోవడం. దీంతో ఈ సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
తుళ్లూరు మండలంలోని ఒక గ్రామంలో 17 ఎకరాల భూమిని 10 మంది కొనుగోలు చేశారు. కొనుగోలు దారులు అంగీకారపత్రాల్లో ఇచ్చిన వివరాలకు, భూముల్లో ఉన్న కొలతలకు మధ్య తేడా ఉంది. దీనిని మార్చేందుకు అందరూ ఒప్పుకునే పరిస్థితి లేదు.
సరిహద్దు తేడాలవల్ల నెలకొన్న వివాదాలు కూడా తేలిగ్గా పరిష్కారమయ్యేలా లేవు.