పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

మార్చిలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..

Published Tue, Apr 2 2024 11:20 AM

GST Collections In March Will Be High

జీఎస్టీ వసూళ్లు ప్రతినెల భారీగా వసూలు అవుతున్నాయి. మార్చి నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దానితో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. గరిష్ఠంగా ఏప్రిల్‌ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో వసూలైన రూ.1.68 లక్షలకోట్ల కంటే ఈసారి అధికంగానే జీఎస్టీ ఖజానాకు చేరింది.

ఈసారి సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్‌ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం.

గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది.

Advertisement
Advertisement