
ఏపీకే ఫైల్.. బీ కేర్ ఫుల్ !
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఏపీకే (అండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్స్) ద్వారా ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు.
మోసం చేసే విధానం..
● నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్ట్రాగామ్ ద్వారా ఒక లింక్ పంపుతారు.
● డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, ఎస్బీఐ, రివార్డ్స్ అప్డేట్, ఫ్రీ గిఫ్ట్, అర్జెంట్ డాక్యుమెంట్, ఈ–చలానా, పీఎం కిసాన్ వంటి పేర్లు గల లింక్తో వినియోగదారులను ఆకర్షిస్తారు.
● ఆ లింక్ ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడు దాన్ని యాప్ అనుకుని ఇన్స్టాల్ చేస్తాడు.
● ఆ యాప్ పర్మిషన్స్ (అనుమతులు) అడుగుతుంది. ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాక్స్, స్టోరేజ్, నోటిఫికేషన్స్, అసెస్బులిటీ తదితరాలు అనుమతులు ఇచ్చిన వెంటనే ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది.
● ఫోన్లోని ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది.
● కొన్నిసార్లు యూపీఐ యాప్లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాలోని డబ్బును దొంగిలిస్తారు.
● అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్మెయిల్కు కూడా ప్రయత్నిస్తున్నారు.
అమాయకులే లక్ష్యం
అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
● ప్లే స్టోర్ తప్ప మరో వేదికల నుంచి ఏ యాప్ను డౌన్లోడ్ చేయకండి.
● గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దు.
● ఫోన్లోని ప్రతి యాప్కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించాలి.
● బ్యాంక్ అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు.
● మీరు ఫోన్లో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్ను అన్ ఇన్స్టాల్ చేయండి.
● మొబైల్ను రీసెట్ చేసి ట్రస్ట్ చేసిన యాప్లను మాత్రమే తిరిగి ఇన్స్టాల్ చేయాలి.
● ఫోన్లో భద్రతాపరమైన భరోసా ఇచ్చే యాప్ (యాంటీ వైరస్/యాంటీ మాల్వర్) ఉపయోగించాలి
● బ్యాంకింగ్ అప్లికేషన్లలో బయోమెట్రిక్/2–ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలి.
మోసానికి గురైతే..
● తక్షణం 1930 నంబర్కు కాల్ చేయాలి (నేషనల్ సైబర్ హెల్ప్లైన్)
● డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సైబర్ క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
● మీ దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
● ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహనతో ఉండాలి. నేటి మోసాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
● సైబర్ భద్రత జాగ్రత్తలు పాటించి మోసాల నుంచి దూరంగా ఉండాలి.
● ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ వాట్సాప్ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు.
● మీరు ఏపీకే ఫైల్స్ లింకును క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు మీరు ఉన్న అన్ని గ్రూపులలో కూడా ఫార్వర్డ్ అవుతుంది.
● ఏపీకే ఫైల్స్ లింకులను క్లిక్ చేయకూడదని సూచిస్తున్నాం.
ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ మోసాలు
లింకులను క్లిక్, డౌన్లోడ్ చేస్తే
వెంటనే వాట్సాప్ హ్యాక్
అప్రమత్తంగా ఉండాలని
జిల్లా ఎస్పీ విజ్ఞప్తి

ఏపీకే ఫైల్.. బీ కేర్ ఫుల్ !