ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
నల్లగొండ టౌన్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన గణనలో బీసీ కుల గణన కూడా చేపడతామని ప్రధాని మోదీ క్యాబినేట్ సమావేశంలో ప్రకటించారని, కానీ ఇప్పుడు బీసీ కుల గణన నిర్వహించడం లేదన్నారు. బీసీలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జనాభా గణనలో స్పష్టంగా కులం, మతం కాలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జన గణన ప్రశ్నావళిలో బీసీ కులం కాలమ్ ఏర్పాటు చేసిన తర్వాతే జన గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓబీసీ కాలమ్ పెట్టాలని కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. బీసీలకు జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఏకమై త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమించి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే బీసీల జాతీయ సదస్సులో తమ కార్యచరణను ప్రకటిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నాయకులు కంది సూర్యనారాయణ, జాజుల లింగంగౌడ్, నకిరేకంటి కాశయ్యగౌడ్, కేశబోయిన శంకర్ముదిరాజ్, నల్ల మధు తదితరులు పాల్గొన్నారు.


