భువనగిరి: మరుగున పడుతున్న సాహిత్యాన్ని వెలుగులోకి తేవడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జె .చిన్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలం రామకృష్ణాపురంలోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కాపుబిడ్డ వ్యాస సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో రైతు నేపథ్యంలో కవిత్వం రాసిన ఘనత గంగుల సాయిరెడ్డికే దక్కుతుందన్నారు. ఆంధ్రామహాసభల కాలంలోనే రైతు కవిత్వం రాశారని గుర్తు చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమేయ కృషి వికాస కేంద్రం నిర్వాహకులు జిట్టా బాల్రెడ్డి, జ్యోతి, భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్పన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, పోతంశెట్టి మంజుల, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, రమేష్, వివేరా వెంకట్రెడ్డి, నాగభూషణం, సర్పంచ్ మల్లికార్జున్రెడ్డి, తేజ సాహిత్య సేవ సంస్థ అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, అజయ్, శివాజీ, అమృతారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కొండల్రెడ్డి పాల్గొన్నారు.


