నర్సంపేట రూరల్ : మేడారం జాతరకు వెళ్తున్న ఓ గూడ్స్ ట్రాలీ ఆటోటైరు పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. సూర్యాపేట జిల్లా వేములపల్లి మండలం రావులపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్, మంగమ్మ దంపతులు, చీమల అంజయ్య(55) కలిసి సుమారు 25 మందితో గూడ్స్ ట్రాలీలో ములుగు జిల్లా మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో ముత్తోజిపేట గ్రామ శివారు 365 జాతీయ రహదారి వద్దకు రాగానే ట్రాలీ ఆటో టైరు పేలిపోయి అదుపు తప్పి బోల్తా పడిపోయింది. దీంతో ఆటో ఉన్న చీమల అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్, మంగమ్మ దంపతులతోపాటు పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను 108లో నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎం రెఫర్ చేశారు. అంజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంజయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గూడ అరుణ్ తెలిపారు.
ఒకరి మృతి.. పలువురికి గాయాలు
మేడారం జాతరకు వెళ్తుండగా ఘటన


