హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు.
29న శాకంబరీగా అలంకరణ..
ఆషాడ శుద్ధపౌర్ణమి 29న (బుధవారం) ఉదయం నాలుగు గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.


