విజయనగరం ఫోర్ట్: పశు సంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత సర్టిఫికెట్ ఉండాలని పేర్కొన్నారు. వీరికి నెలకు రూ. 18,500 గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. రెండు హాస్పటల్ అటెండెంట్ పోస్టులకు 10 వతరగతి ఉత్తీర్ణత ఉండాలని , నెలకు రూ. 15 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని తెలిపారు. అభ్యర్ధుల వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలని, రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరమితి సడలింపు వర్తిస్తుందన్నారు. విద్యార్హత మార్కులకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీతో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా పశుసంవర్థక శాఖ సంచాలకులు వారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
ఫుట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఫుట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన పోటీల్లో 26 జట్లు పాల్గొనగా.. విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన జట్టు అద్భుత క్రీడా ప్రతిభతో తృతీయ స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం ఈస్ట్ గోదావరి – విజయనగరం జట్ల మధ్య జరిగిన పోరు కూడా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కీలక సమయాల్లో విజయనగరం క్రీడాకారులు రాణించడంతో రెండు గోల్స్ తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు రజిని, కార్యదర్శి మహాలక్ష్మి, తదితరులు సోమవారం అభినందించారు.


