బాడంగి: మండలంలోని కోడూరు గ్రామంలో కోడూరుమాత యాత్ర శనివారం వైభవంగా సాగింది. వేలాది మంది భక్తులు కోడూరు మాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. దివ్యబలిపూజల్లో పాల్గొన్నారు. విశాఖ అగ్రపీఠం చాన్సలర్ జొన్నాడ జ్ఞానప్రకాష్, దుగ్గుంపూడి బాలసౌరి తదితర గురువులు వినిపించిన శాంతి సందేశాలను శ్రద్ధగా ఆలకించారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బొబ్బిలి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. భక్తులకు వీలుగా ఆర్టీసీ అధికారులు శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. పండగ విజయవంతంగా ముగియడంపై కోడూరు చర్చి ఫాదర్ పీటర్ సింహాచలం సంతోషం వ్యక్తంచేశారు.


