● సీతయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి మెటబాలజీమ్ అనే వ్యాధితో ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. 8వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
● బి.లక్ష్మి అనే 58 ఏళ్ల మహిళ ఆగస్టు 7వ తేదీన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. 10వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
● 8 నెలల్లో 1070 మంది రోగుల మృతి
● చికిత్స అందించడంలో నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు
మరణాలు ఇలా..
ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు నెలాఖారు నాటికి ఆస్పత్రిలో 1070 మంది మంది మరణించారు. దీనిని బట్టి వైద్యసేవల తీరును అంచనా వేయవచ్చు. ఒక్క జనవరి నెలలో అత్యధికంగా 175 మంది మరణించారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యసేవలపై నిర్లక్ష్యం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంలేదని పలువురు రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరిన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. మరణాలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తున్నాం. వైద్య సిబ్బంది అలసత్వం కారణంగా రోగి మరణించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
విజయనగరం ఫోర్ట్:
సర్వజన ఆస్పత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, సకాలంలో వైద్య సేవలు అందకపోవంతో అధిక మరణాలు నమోదుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. కేవలం 8 నెలల్లో 1070 మంది సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృతిచెందినట్టు వైద్య రికార్డుల్లో నమోదుకావడం కలవరపెడుతోంది. ఆస్పత్రిలో చికిత్స అందించడంలో అలసత్వం కారణంగా అధికమంది రోగులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం చికిత్స అందించంలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
స్కానింగ్, ఎక్స్రే తీయించడంలోనూ తీవ్ర జాప్యం
వ్యాధి నిర్ధారణలో వైద్య సిబ్బంది అలసత్వం వహిస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించడంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం తీయాల్సిన స్కాన్, ఎక్స్రేలకు సాయంత్రం వరకు రోగులను ఉంచుతున్నారు. ఎక్స్రే, స్కానింగ్ రిపోర్టు వస్తేగాని చికిత్స అందించలేమని వైద్యులు చెబుతున్నారు. వైద్యసేవలు సకాలంలో అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని రోగుల బంధువులు కన్నీరుపెడుతున్నారు.
ఆదివారం
అయితే పరిస్థితి మరింత ఘోరం..
ఆదివారం అయితే రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమెర్జెన్సీ వార్డు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరమైతే సకాలంలో చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్ఐ, సీటీస్కాన్ రిపోర్టులు రావడం లేదు. ఈ రిపోర్టులు కోసం సోమవారం వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి. రిపోర్టు రాకపోవడం వల్ల ఏ వ్యాధి తెలియకపోతే ఏ విధంగా వైద్యం చేయగలమని వైద్యులు చెబుతున్నారు. రిపోర్టుల జాప్యం వల్ల రోగుల పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.


