పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు జీసీసీ సరుకుల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు అవసరమైన సరుకుల సరఫరా కోసం పార్వతీపురం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో పీఓ ఆర్. వైశాలి, తదితర అధికారులు ఈ టెండర్ల ప్రక్రియను శనివారం పకడ్బందీగా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు అందే సరుకుల్లో నాణ్యతతో పాటు, సరఫరాలో సమయపాలనకు పెద్దపీట వేశారు. ఈ ప్రక్రియలో సరఫరాదారులు సమర్పించిన పత్రాలు, కోట్ చేసిన ధరలు, సరుకుల నాణ్యతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా బేరీజు వేశారు. పోటీ ధరలకు, నిర్దేశిత స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న బిడ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. సరుకుల సరఫరాలో నాణ్యతా లోపాలున్నా, జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని ఎంపికై న సరఫరాదారులకు అధికారులు స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సీతంపేట: మండలంలోని కిట్టాలపాడు జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తొత్తడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై నిమ్మక పవన్, సునీత, అనూషా వస్తున్నారు. పత్తికగూడ మలుపు వద్దకు వచ్చేసరికి సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఆటో అద్దం తగిలి కిందపడ్డారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.


