● ప్రజాసంఘాల నేతల డిమాండ్
● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన
బొంరాస్పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు.


