చోరీబాట పట్టారు..
ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్లో హార్డ్వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
పార్కింగ్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు.
ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు
బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం


