● బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావాలి
● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు అన్నారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కొడంగల్లో పర్యటించారు. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని కాంట్రార్లకు సూచించారు. అనంతరం కడా కార్యాలయంలో ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్లానింగ్ డిజైనర్స్, కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేయాలన్నారు. సంప్రదాయ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు నిర్మించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ట్రైయినీ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, డీఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


